ఏ ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉందో
కూడా రేవంత్కు తెలియదు
కాళేశ్వరానికి కేబినెట్ ఆమోదం
లేదనడం దుర్మార్గం మీడియా
సమావేశంలో బిఆర్ఎస్
అగ్రనేత హరీశ్రావు
మన తెలంగాణ/హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి రాష్ట్రం గురిం చి, రాష్ట్రంలోని ప్రాజెక్టుల గురించి అసలు అవగాహన లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. సచివాలయంలో బనకచర్ల ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ దేవాదుల, బనకచర్ల ఏ బేసిన్లో ఉందని ఉత్తమ్ కుమార్ను అడిగారని, దీనిని బట్టి రేవంత్ కు తెలంగాణ ప్రాజెక్టుల మీద కనీస అవగాహన లేదన్నారు. 23 ఏళ్ల క్రితం గోదావరి బేసిన్లో ప్రారంభమైన దేవాదుల వివరాలే తెలియని సీఎం ఇక ఢిల్లీకి వెళ్ళి, సుప్రీంకోర్టుకు వెళ్ళి ఏపీ ప్రాజెక్టుల మీద కొట్లాడతాననడం హాస్యాస్పదమన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ లో హరీష్ రావు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ కు బేసిక్స్ తెలియవని, బేసిన్స్ తెలియవని హరీశ్ రావు అన్నారు. దేవాదుల ఏ బేసిన్ లో ఉందో రేవంత్ కు తెలియదని, ముఖ్యమంత్రి అశ్రద్ధ నిన్న బయటపడిందని విమర్శించారు.
బనకచర్లపై రేవంత్ అసత్యాలు చెప్పారని, ఆంధ్రా దోపిడి అడ్డుకోమంటే తమపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు జల దోపిడిని అడ్డుకోమంటే సమావేశం పెట్టి మరీ అబద్దాలు చెప్పారని తెలిపారు. కాళేశ్వరానికి కేబినెట్ ఆమోదం లేదని ప్రకటించడం దుర్మార్గం అని, కేబినెట్ భేటీ గ్రీన్ సిగ్నల్ వచ్చాకే ప్రాజెక్టుపై ముందుకు వెళ్లామని, తమపై ఏదోక రకంగా బురద జల్లడం తప్ప మరేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నారు. కృష్ణా బేసిన్లో రాష్ట్రానికి 763 టిఎంసిల వాటా దక్కాలని బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ముందు కేసీఆర్ పోరాడితే రేవంత్ మాత్రం 500 టిఎంసి లు ఇస్తే చాలు అంటున్నారని, దీనివల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున బనకచర్ల ప్రాజెక్ట్ ఆపడానికి సహకరిస్తామని చెప్పారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తే తామ మద్దతిస్తామన్నారు. బనకచర్లపై సర్కార్ ను నిద్ర లేపింది బీఆర్ఎస్ అని, తాను ప్రశ్నిస్తేనే సీఎం ఢిల్లీకి లేఖలు రాశారని హరీష్రావు చెప్పారు. గోదావరిలో 968 టీఎంసీలు కాదని, కేసీఆర్ 1900 టీఎంసీలు అడిగారని, రేవంత్ 1000 టీఎంసీలు చాలంటున్నారని, వెయ్యి టీఎంసీలు ఇచ్చి బనకచర్ల కట్టుకోవచ్చని రేవంత్ అం టున్నారని అన్నారు.
చంద్రబాబు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడడం ఏంటి ? చంద్రబాబు మనకు నీళ్లు ఇచ్చేదేంటి.? తెలంగాణకు గోదావరిలో 946 టీఎంసీలకు సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది. మరో 20 టీఎంసీలు సూత్రప్రాయంగా ఆమోదించిందని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ ఆరు నెలల నుండి పనిచేస్తుంటే, కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాల రాస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిని కలుస్తూ కేంద్ర జల మంత్రిని కలుస్తూ ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంటే అమాయకంగా ముఖ్యమంత్రి బనకచర్ల ఏ బేసిన్లో ఉందని అడగడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన సలహాదారుడు ఆదిత్యా దాస్ బనకచర్ల ప్రకాశం జిల్లాలో ఉంది అంటారని, అది ఉన్నది నంద్యాల జిల్లాలో అని, ముఖ్యమంత్రి అట్లంటే ఆయన సలహాదారుడు అంతకంటే గొప్ప ఘనుడుగా ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 968 టీఎంసీలు కేటాయిస్తూ జీవోలు ఇచ్చారని, కెసిఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 968 లో 946 టీఎంసీలకు అన్ని అనుమతులు సాధించామని గుర్తు చేశారు.