హెడీంగ్లీ: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సర్కిల్కు భారత్, ఇంగ్లండ్ జట్లు శ్రీకారం చుట్టనున్నాయి. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా రెండు జట్ల మధ్య శుక్రవారం నుంచి హెడింగ్లీలోని లీడ్న్ మైదానంలో తొలి మ్యాచ్ జరుగనుంది. ఆతిథ్య ఇంగ్లండ్ సిరీస్లో ఫేవరెట్గా కనిపిస్తోంది. ఇక పలువురు సీనియర్లు లేకుండా బరిలోకి దిగుతున్న భారత జట్టుకు సిరీస్ సవాల్గా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో వారు లేకుండానే టీమిండియా క్లిష్టమైన సమరానికి సిద్ధమైంది. శుభ్మన్ గిల్ సారథ్యంలో ఇంగ్లండ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇక ఆతిథ్య టీమ్కు బెన్ స్టోక్స్ సారథ్యం వహించనున్నాడు. టీమిండియాతో పోల్చితే ఇంగ్లండ్ కాస్త బలంగా కనిపిస్తోంది. సొంత గడ్డపై ఆడుతుండడం వారికి కలిసి వచ్చే అంశంగా మారింది. అయితే యువకులతో కూడిన భారత్ను కూడా తక్కువ అంచన వేసే పరిస్థితి లేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు.
ఓపెనర్లే కీలకం..
ఇక తొలి మ్యాచ్లో భారత్కు ఓపెనర్లు కీలకంగా మారారు. యువ సంచలనం యశస్వి జైస్వాల్తో కలిసి సీనియర్ ఆటగాడు కెఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశం ఉంది. ఇద్దరు ఏ మేరకు శుభారంభం అందిస్తారనే దానిపైనే జట్టు భారీ స్కోరు ఆధారపడి ఉంది. ఈ సిరీస్లో భారత్కు రాహుల్ ప్రధాన అస్త్రంగా మారాడు. అతనిపైనే జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం టీమ్లో అతనే కీలక ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ను అతను ముందుండి నడిపించక తప్పదు. ఇక కరుణ్ నాయర్ చేరికతో బ్యాటింగ్ బలంగా తయారైంది. అయితే నాయర్ చాలా కాలం తర్వాత టెస్టుల్లో ఆడనున్నాడు. ఇది కాస్త ప్రతికూలమైన అంశంగా చెప్పొచ్చు. దేశవాళీక్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన నాయర్ టీమిండియా తరఫున కూడా మెరుగైన బ్యాటింగ్ను కనబరచాలనే పట్టుదలతో ఉన్నాడు. ఎలాంటి బౌలింగ్నైనా చిన్నాభిన్నం చేసే సత్తా అతనికుంది. సిరీస్లో అతను కూడా టీమిండియాకు కీలకమనే చెప్పాలి.
అందరి కళ్లు గిల్పైనే..
మరోవైపు టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ సిరీస్కు ప్రత్యేక ఆకర్షణగా మారాడు. సీనియర్లు లేని జట్టును అతను ఎలా నడిపిస్తాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. సిరీస్లో అందరి దృష్టి గిల్పైనే నిలిచింది. క్లిష్టమైన ఇంగ్లండ్ సిరీస్లో జట్టును ముందుండి నడిపించడం గిల్కు సవాల్గా తయారైంది. అతనికి ఇదే తొలి టెస్టు సిరీస్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తి కొత్త జట్టుతో భారత్ బరిలోకి దిగనుంది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్సీ బాధ్యత చాలా క్లిష్టమైన అంశంగా తయారైంది. ఇందులో గిల్ ఎంత వరకు సఫలమవుతాడనే దానిపైనే జట్టు గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన గిల్పై టీమిండియా భారీ ఆశలు పెట్టుకుంది. ఇక వికెట్ కీపర్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా జట్టుకు చాలా కీలకంగా మారాడు. పంత్ కూడా తన బ్యాట్కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆల్రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్లు కూడా తమ తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించక తప్పదు. కీలకమైన సిరీస్లో వీరిపై జట్టు భారీ నమ్మకాన్నిపెట్టుకుంది. యువ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహతహలాడుతున్నాడు. జడేజా, శార్దూల్లు కూడా ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టుకు అండగా నిలవాలనే పట్టుదలతో ఉన్నారు. జస్ప్రిత్ బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ తదితరులతో భారత బౌలింగ్ చాలా బలంగా ఉంది.
ఆత్మవిశ్వాసంతో..
ఇక ఆతిథ్య ఇంగ్లండ్ సిరీస్లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ప్రపంచ స్థాయి ఆల్రౌండర్ బెన్స్టోక్స్ సారథ్యంలో ఇంగ్లీష్ టీమ్ సిరీస్కు సిద్ధమైంది. జాక్ క్రాలి, బెన్ డకెట్, బ్రూక్, రూట్, స్టోక్స్ వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అంతేగాక వోక్స్, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. రూట్ ఫామ్లో ఉండడం ఇంగ్లండ్కు అతి పెద్ద ఊరటగా చెప్పొచ్చు. సిరీస్లో రూట్, బ్రూక్లు మెరుపులు మెరిపించడం ఖాయంగా కనిపిస్తోంది. కొంతకాలంగా వీరు అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత నిలకడైన బ్యాటింగ్ను కనబరుస్తున్నారు. ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారారు. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న ఇంగ్లండ్ సిరీస్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది.