లీడ్స్: భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్లో మొదటి రోజు భారతకే అనుకూలించింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ ఆట ముగిసేసమయానికి కేవలం 3 వికెట్లు మాత్రమే నష్టపోయి.. 359 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో రాహుల్ (42) మంచి ఆరంభం అందించగా.. జైస్వాల్ (101) శతకంతో రాణించగా.. కెప్టెన్ శుభ్మాన్ గిల్ 127, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ 65 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్కి 138 పరుగులు జోడించారు. అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes)తీసుకున్న ఓ నిర్ణయంపై మాజీ ఆటగాళ్లు మండిపడుతున్నారు.
హెడ్డింగ్లే మైదానంలో గత ఆరు మ్యాచ్ల్లో తొలుత బౌలింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే స్టోక్స్ ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ, అది భారత్కే కలిసొచ్చింది. దీంతో బెన్ స్టోక్స్పై మాజీ కెప్టెన్ మైకేల్ ఆథర్టన్ ఫైర్ అయ్యారు. కామన్ సెన్స్ ఉన్నవాళ్లు ముందు బౌలింగ్ ఎంచుకోరు అని ఆయన అన్నారు. ‘‘గత ఆరు మ్యాచుల్లో బౌలింగ్ చేసిన జట్టే విజయం సాధించింది. కానీ, కాస్త క్రికెట్ బుర్ర వాడేవారు టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటారు. ఎందుకంటే.. ఇక్కడ ఇప్పుడు తీవ్రమైన ఎండ ఉంది. వచ్చే రెండు రోజుల్లో 30 డిగ్రీల పైనే ఎండ ఉంటుంది. కేవలం గత రికార్డులను చూసి స్టోక్స్ (Ben Stokes) బౌలింగ్ ఎంచుకొని ఉంటాడు. కానీ, అది కరెక్ట్ కాదు’’ అని ఆథర్టన్ మండిపడ్డారు. కానీ, ఇంగ్లండ్కు భారీ లక్ష్యన్ని చేధించే సత్తా ఉందని పేర్కొన్నారు.