సింధూనదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ఈ ఒప్పందం నిబంధనలను పాకిస్థాన్ ఉల్లంఘించిందని ఆయన మండిపడ్డారు. ఇన్నాళ్లూ దాయాది అన్యాయంగా నీళ్లు అందుకుందని, ఇకపై నీటి కొరతతో అల్లాడిపోవాల్సిందేనని దుయ్యబట్టారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో అమిత్షా ఈ ఒప్పందం నిలిపివేత గురించి ప్రస్తావించారు. “ అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేం. కానీ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు భారత్కు ఉంది. అదే చేశాం. ఈ ఒప్పందం పీఠికలో రెండు దేశాలు శాంతి, పురోగతి సాధించాలనే విషయాన్ని పొందుపరిచారు. కానీ ఒకసారి దీన్ని ఉల్లంఘిస్తే రక్షించడానికి ఇంకేమీ ఉండదు ” అని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. “ భారత్కు హక్కుగా లభించిన నీటిని సమర్థంగా వినియోగిస్తాం.
కెనాల్ను నిర్మించి పాకిస్థాన్కు వెళ్లే నీటిని రాజస్థాన్కు మళ్లిస్తాం . ఇన్నాళ్లూ పాక్ అన్యాయంగా నీటిని అందుకుంది. ఇకపై ఆ దేశం గొంతు ఎండాల్సిందే ” అని అమిత్షా దుయ్యబట్టారు. 1960ల్లో భారత్, పాక్ మధ్య సింధూ నదీ జలాల ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయితే పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో దీని అమలును భారత్ నిలిపివేసింది. ఇది దాయాదికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ ఒప్పందం నిలిపివేత పాకిస్థాన్ను ఎండబెట్టే అవకాశాలున్నాయి. ఆ దేశంలో నీటి సరఫరా అత్యధికంగా సింధూ జలాలపైనే ఆధారపడింది. అక్కడ వ్యవసాయానికి వాడే నీటిలో 80 శాతం ఈ ఒప్పందం కింద లభించేదే. పాకిస్థాన్ జీడీపీలో 25 శాతం ఈ నదుల నుంచే లభిస్తోందంటే … భారత నిర్ణయం ఆ దేశాన్ని భవిష్యత్తులో ఎలా ప్రభావితం చేయనుందో అర్థం చేసుకోవచ్చు.