లీడ్స్: ఇంగ్లండ్తో హెడింగ్లీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుత సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. షోయబ్ బషీర్ వేసిన బంతిని సిక్స్గా మలచిన రిషబ్ తన టెస్టు కెరీర్లో ఏడో శతకాన్ని అందుకున్నాడు. సెంచరీ తర్వాత రిషబ్ పంత్ సోమర్సాల్ట్ విన్యాసంతో వినూత్నంగా సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్గా మారాయి. ఈ మ్యాచ్లో రిషబ్ 178 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 134 పరుగులు చేశాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన రిషబ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
టీమిండియా దిగ్గజ ఆటగాడు, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ అద్భుత సెంచరీతో అలరించిన పంత్పై ప్రశంసలు కురిపించాడు. పంత్ సెంచరీ సాధించగానే కామెంట్రీ బాక్స్లో ఉన్న గవాస్కర్ సూపర్బ్..సూపర్బ్..సూపర్బ్ అంటూ పంత్ని ప్రశంసించాడు. గతంలో మెల్బోర్న్ టెస్టు సమయంలో చెత్త షాట్ ఆడి పెవిలియన్ చేరిన పంత్ను అప్పట్లో కామెంట్రీ బాక్స్లో ఉన్న గవాస్కర్ స్టుపిడ్..స్టుపిడ్..స్టుపిడ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే గవాస్కర్ ఈసారి పంత్ ఇన్నింగ్స్పై సూపర్బ్ అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇదిలావుంటే ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ అరుదైన రికార్డును తనపేరిట లిఖించుకున్నాడు. భారత్ తరఫున అత్యధిక శతకాలు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్గా పంత్ నయా రికార్డును నెలకొల్పాడు. ఇప్పటి వరకు మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న ఆరు శతకాల రికార్డును పంత్ తిరగరాశాడు. ధోనీ 90 టెస్టుల్లో ఆరు సెంచరీలు సాధించగా, పంత్ 44 మ్యాచుల్లోనే ఏడు శతకాలు సాధించడం విశేషం.