సీట్లు అమ్ముకుంటున్న ఇన్ఛార్జీలు
దరఖాస్తుదారుల
వివరాలు నోటీస్ బోర్డుల్లో వేయని వైనం
ఒక్కో సీటుకు రూ.5 వేల నుంచి
రూ.10 వేల వరకు డిమాండ్
కనీస మెనూ పాటించని అధికారులు
మన తెలంగాణ/ మహబూబ్నగర్ బ్యూరో : అనాథ ఆడ పిల్లలు, నిరుపేద ఆడ పిల్లలు, వలసలు వెళ్తున్న వలస కార్మికుల ఆడ పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సంబంధిత ఇన్చార్జీలే నీరు గారుస్తున్నారు. పేద పిల్లల చదువు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కస్తూర్బా పాఠశాలలు కాసుల వేటలో మునిగి పోతున్నాయి. దీంతో పేద పిల్లలకు సీట్లు లభించడం లేదు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్ల కంటే మెరుగైన వసతులు, నాణ్యమైన విద్యను అందించాలనే లక్షంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక కస్తూర్బా పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఇందులో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు భోధన ఉంటుంది. వీరికి ఇక్కడే టిఫిన్తో పాటు రెండు పూటల పౌష్టికాహరంతో పాటు వసతి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మెనూ ప్రకారం ప్రతి రోజు పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలని కూడా ఆదేశాలు ఉన్నాయి.
అయితే కస్తూరిభా పాఠశాలల్లో క్షేత్ర స్థాయిలో ఇందుకు భిన్నంగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గద్వాల మండల పరిధిలో ఉన్న కస్తూర్బా పాఠశాల ఇన్ఛార్జి ఇష్టాను సారంగా సీట్లను ఇతరలకు కేటాయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం దరఖాస్తులు చేసుకున్న పిల్లలకు రిసిఫ్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా అనాధ, వలస కార్మికుల ఆడపిల్లలకు, నిరుపేదలకు సీట్లు కేటాయించాలి. ప్రతి తరగతికి 40 సీట్లు ఉంటాయి. ఈ లెక్కన వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జాబితాను నోటీస్ బోర్డులో ఉంచాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అలాంటివేమి లేనట్లు తెలుస్తోంది. ఇక్కడున్న ఇన్ఛార్జి ఆదరణ కలిగేతేనే సీటు వస్తుందని చెబుతున్నారు. ప్రవేట్ పాఠశాలు, కళాశాలల్లో ఫీజులు అధికంగా ఉన్న నేపథ్యంలో అనేక మంది పేద పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. కొంత మంది మధ్యతరగతి పిల్లలు ప్రవేట్ ఫీజులు చెల్లించలేక కస్తూర్బాలో కొంత చెల్లిస్తే సీటు వస్తుందనే ఆశను ఇన్ఛార్జీలు సొమ్ము చేసుకుంటున్నారు.
ఇక్కడున్న ఇన్ఛార్జి తను నేరుగా పైసలు వసూళ్లు చేయకుండా తమ అన్న, బంధువుల ఫోన్పేలకు తల్లిదండ్రులతో ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అసలైన అర్హులైన పిల్లలకు కస్తూర్బా స్కూల్లో సీట్లు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడున్న ఇన్ఛార్జి కనీసం ఒక్కో తరగతి 40 సీట్లు ఉండగా అదనంగా మొత్తంగా 60 సీట్లు భర్తీ చేస్తోందని తెలుస్తోంది. దీంతో పిల్లలు హాస్టల్ గదిలో పడుకోవడానికి, చదువుకోవడానికి కూడా స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. కనీసం మెను కూడా పాటించడం లేదని తెలుస్తోంది. ఈ పాఠశాలలోనే హెడ్ కుక్కు, అకౌంటెంట్లు నిరంతరం గొడవలు పడుతుండడంతో నాణ్యమైన ఆహారం అందడం లేదని తెలుస్తోంది. పిల్లలకు ఇవ్వాల్సిన కనీస మెనూ పాటించకుండా సరుకులను దారి మళ్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా మహబూబ్నగర్ దగ్గర ఉన్న కస్తూర్బా పాఠశాలలో కూడా ఇవే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ కూడా సీట్లను పైసలకు విక్రయించుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
కస్తూర్బా జిల్లా ఇన్ఛార్జి వివరణ
కస్తూరిభా పాఠశాల్లో జరుగుతున్న వ్యవహారంపై గద్వాల జిల్లా ఇన్ఛార్జి అంపయ్యను వివరణ కోరగా .. తాను ఛార్జీ తీసుకొని మూడు రోజులు అయ్యిందని.. ఇంకా పూర్తి వివరాలు తెలియవని అన్నారు. కస్తూర్బాలో వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని మన తెలంగాణకు తెలిపారు.