Monday, June 23, 2025

హర్మూజ్ జలసంధి మూసివేత

- Advertisement -
- Advertisement -

టెహ్రాన్ : అంతర్జాతీయ చమురు సరఫరాలో ఆయువుపట్టు హార్మూజ్ జలసంధి మార్గం మూసివేతకు ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని అణు స్థావరాలపై అమెరికా ఆకస్మిక దాడులకు ప్రతిఘటనగా ఆదివారం రాత్రి ఈ చర్యకు దిగింది. మూసివేత నిర్ణయానికి ఇరాన్ పార్లమెంట్ కూడా ఏకగ్రీవ ఆమోదం తెలిపిందని దేశంలోని అధికారిక వార్తా సంస్థ ప్రెస్ టీవీ వెల్లడించింది. ఇక జలసంధి ద్వారా రాకపోకలను ప్రత్యేకించి అన్ని రకాల రవాణా సరుకుల రవాణాను నిలిపివేసే నిర్ణయం ఇరాన్‌కు చెందిన అత్యున్నత స్థాయి జాతీయ భద్రతా మండలి తుది ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. పార్లమెంట్ కూడా ఆమోదం తెలియచేయడంతో ఇక ఈ కౌన్సిల్ కూడా ఇందుకు అనుగుణంగానే వ్యవహరిస్తుందని, అర్థరాత్రి తరువాత ఎప్పుడైనా జలసంధి మూసివేత జరుగుతుందని వెల్లడైంది. దాడులు ఇతరత్రా పరిణామాల దశలో

అత్యవసర పరిస్థితుల్లో ఈ జలసంధి మూసివేత నిర్ణయం తీసుకుంటూ ఉంటారని రెవెల్యూషనరీ గార్డ్ కమాండర్, ఎంపి ఇస్మాయిల్ కొసారి ఇరాన్‌కు చెందిన యంగ్ జర్నలిస్టు క్లబ్‌కు చెప్పారు. హార్మూజ్ జలసంధి మూసివేత జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాలపై తీవ్ర ఆటంకం వాటిల్లుతుంది. క్రమేపీ ప్రపంచవ్యాప్త యుద్ధ వాతావరణం మరింత విస్తరించుకునే అవకాశం ఏర్పడుతోంది. ప్రపంచవ్యాప్తం గా చమురు అవసరాల్లో దాదాపు 20 శాతం ఈ మార్గం గుండానే రవాణా అవుతుంది. పలు దేశాలకు చమురు సహజవాయువుల బ్యారెల్స్ నౌకల ద్వారా వెళ్లుతాయి. అరేబియా సముద్రంలో ఒమన్‌కు చెందిన ముసాండం ద్వీపకల్పం ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జల మార్గమే ఈ హార్మూజ్ జలసంధి. ఇక్కడ ప్రతిరోజూ రెండు కోట్ల బారెళ్ల చమురు వివిధ దేశాలకు వెళ్లుతుంది. సౌదీ, ఇరాన్, యుఎఇ, కువైట్ , ఇరాక్‌ల నుంచి చమురు పలు దేశాలకు సరఫరా అవుతోంది. అయితే ఈ మార్గం బంద్ అయితే పరిస్థితి ఏమిటనేది కీలక పరిణామం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News