డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న విడుదల కాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా. ఎం. మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘ఆ భగవంతుడి ఆశీస్సులతోనే ‘కన్నప్ప’ చిత్రం ప్రారంభమైంది. అంతా ఆ దేవుడి దయవల్లే జరుగుతుంది. ఆడియెన్స్ ప్రేమ, ఆ దేవుడు ఆశీస్సులు నా బిడ్డ విష్ణుకి ఉండాలని కోరుకుంటున్నాను. ఆ పరమేశ్వరుడు ఇచ్చిన శక్తితోనే ఈ చిత్రాన్ని తీశాం. ఈ మూవీలోని ప్రతీ పాత్ర హీరోలానే ఉంటుంది. ఇందులో నటించిన ప్రతీ ఒక్కరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను.
‘కన్నప్ప’ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ అద్భుతంగా తెరకెక్కించారు’ అని అన్నారు. విష్ణు మంచు మాట్లాడుతూ.. “కన్నప్ప’ విష్ణు సినిమా కాదు. ఇది కన్నప్ప సినిమా. ఎడిటింగ్ టేబుల్ మీద ఈ చిత్రాన్ని చూసినప్పుడు వావ్ అనిపించింది. ‘కన్నప్ప’ అనేది శివానుగ్రహంతోనే జరిగింది. మోహన్లాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మా కోసం వచ్చిన అక్షయ్ కుమార్కి థాంక్స్. (Thanks Akshay Kumar) తమిళంలో ఈ చిత్రం పెద్ద స్థాయిలో రిలీజ్ అవుతోందంటే దానికి శరత్ కుమార్ కారణం. న్యూజిలాండ్ షూటింగ్కి కూడా ఆయనే సపోర్ట్ చేశారు. ఈ చిత్రం ప్రారంభం కాక ముందే బ్రహ్మానందం దీవెనలు అందిస్తూ ఉన్నారు. నాన్న గారి మీదున్న గౌరవంతోనే ప్రభాస్ ఈ మూవీని చేశారు’ అని తెలిపారు.
ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ‘జన్మభూమిని, కర్మభూమిని మర్చిపోకూడదు. నాకు హైదరాబాద్ కర్మభూమిలాంటిది. మోహన్ బాబు నన్ను నమ్మి ఇక్కడకు తీసుకు వచ్చారు. ‘కన్నప్ప’ను నాకు ఇచ్చినందుకు మోహన్ బాబుకి థాంక్స్. విష్ణు అరుదైన నటుడు. ఒకటి, రెండు టేక్స్లోనే అన్ని సీన్లను చేసేశారు. ఆయన నటనస్థాయిని అందరూ చూడబోతోన్నారు. విష్ణు ఓ గొప్ప హీరోనే కాదు.. గొప్ప కొడుకు’ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, శరత్ కుమార్, మధుబాల, అర్పిత్ రంకా, మైత్రి శశి, సుద్దాల అశోక్ తేజ, బీవీఎస్ రవి, తోట ప్రసాద్, ఆకెళ్ల శివ ప్రసాద్, రామజోగయ్య శాస్త్రి, శివ బాలాజీ, ముఖేష్ రిషి పాల్గొన్నారు.