ఇంగ్లండ్ లక్షం 371
రసవత్తరంగా మొదటి టెస్టు
లీడ్స్: ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జరుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 96 ఓవర్లలో 364 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ ముందు 371 పరుగుల క్లిష్లమైన లక్ష్యాన్ని ఉంచింది. తరువాత బ్యా టింగ్ చేపట్టిన ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. 90/2 ఓవర్నైట్ స్కోరుతో సో మవారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది.
ఆదుకున్న పంత్, కెఎల్
ఈ దశలో ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కెఎల్ రాహుల్, రిషబ్ పంత్లు తమపై వేసుకున్నారు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ను కుదుట పరిచారు. ఒకవైపు వికెట్ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ముందుకు సాగారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఆతిథ్య జట్టు బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాహుల్, పంత్లు అసాధారణ బ్యాటింగ్తో జట్టుకు అండగా నిలిచారు. రాహుల్ సమన్వయంతో ఆడగా రిషబ్ తన మార్క్ షాట్లతో అలరించాడు. ఇదే క్రమంలో రాహుల్ 202 బంతుల్లో శతకాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత రిషబ్ కూడా దీన్ని అందుకున్నాడు. ధాటిగా ఆడిన పంత్ 130 బంతుల్లో సెంచరీ సాధించాడు.
ఈ టెస్టులో పంత్కు ఇది రెండో శతకం కావడం విశేషం. తొలి ఇన్నింగ్స్లో కూడా పంత్ సెంచరీతో మెరిశాడు. దూకుడైన బ్యాటింగ్ను కనబరిచిన రిషబ్ 140 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 118 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో రాహుల్తో కలిసి నాలుగో వికెట్కు 195 పరుగులు జోడించాడు. మరోవైపు అద్భుత బ్యాటింగ్తో అలరించిన రాహుల్ 18 బౌండరీలతో 137 పరుగులు చేశాడు. మిగతా వారిలో జడేజా 25 (నాటౌట్), కరుణ్ నాయర్ (20) మాత్రమే కాస్త రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, టంగ్ మూడేసి వికెట్లను పడగొట్టారు. బషీర్కు రెండు వికెట్లు దక్కాయి.
పంత్ అరుదైన రికార్డు
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లలో కూడా సెంచరీలు సాధించి రిషబ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో రెండు ఇన్నింగ్స్లలో కూడా శతకాలు నమోదు చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్గా పంత్ నిలిచాడు. అంతేగాక టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్లలో సెంచరీలు సాధించిన రెండో వికెట్ కీపర్గా కూడా రిషబ్ రికార్డును అందుకున్నాడు. అంతకుముందు జింబాబ్వే దిగ్గజం ఆండ్రీ ఫ్లవర్ ఈ ఫీట్ను సాధించాడు. అతని తర్వాత ఈ ఘనత సాధించిన వికెట్ కీపర్గా రిషబ్ పంత్ నిలిచాడు.