నిర్మల్ జిల్లాలో చిన్న, పెద్ద తేడా లేకుండా యువత, వృద్ధులు, చిన్నపిల్లలు సైతం మత్తు పదార్థాలకు బానిసలు కావడం ఈ ప్రాంతంలో కలకలం రేపుతున్నది. డ్రగ్ ఫ్రీ జిల్లాగా మారుస్తామని ప్రకటిస్తున్న అధికారులకు సవాళ్లు విసిరే రీతిలో ఎత్తుకు పైఎత్తు వేస్తూ తమ మత్తు దందాను కొనసాగిస్తూపోతున్నారు. అక్రమార్కులు తాజాగా జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో చిట్యాల వాగు శివారులో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఏకంగా మత్తుపదార్థాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కలకలం రేపుతున్నది. శనివారం ఎక్సైజ్, టాస్క్ఫోర్స్ అధికారులు జరిపిన దాడుల్లో బయటపడ్డ బాగోతం అధికారులనే నివ్వెరపరిచింది. కల్తీ కల్లులో కలిపే సిహెచ్ను తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న అబ్కారీ, రాష్ట్ర టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ రెండు కార్లు అనుమానాస్పద స్థితిలో పట్టుబడ్డాయి.
అందులోని నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తే మత్తు పదార్థాల తయారీ కేంద్రం వివరాలు వెలుగు చూడడమే కాకుండా వారి వద్ద నుండి 10 లక్షల రూపాయలు విలువ చేసే కిలో అల్ప్రాజోలం, మరో రూ. 10 లక్షల విలువ గల 425 కిలోల క్లోరల్ హైడ్రెల్ (Chloral hydrel) లభ్యమైంది. ఈ ప్రాంతంలో తెల్లగల్లును పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది తాగుతారు. అయితే గత కొన్నేళ్లుగా ప్రజలు మత్తు కల్లుకు బానిసలయ్యారు. నిషేధిత మత్తు పదార్థాలను కలుపుతూ కల్తీ కల్లు విక్రయించడం ఇక్కడ మామూలే. అయితే ఇప్పటి వరకు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలనుంచి కల్తీ కల్లులో కలిపే మత్తు పదార్థాలను తీసుకొచ్చి నిల్వచేసేవారు. కాని ఇప్పుడు ఇక్కడే తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు.
ముంబై సమీపంలోని భీవండి ప్రాంతం లో క్లోరో అనే ద్రవపదార్థం ఇక్కడికి తీసుకు వస్తున్నారు. దానితో సిహెచ్ తయారు చేస్తున్నారు. 50 లీటర్ల క్లోరోకు 9 లీటర్ల నీటిని కలుపుతారు. దీన్ని డ్రమ్ములో పోసి గుంతలు తవ్వి చుట్టూ ఐస్ను పేరుస్తారు. దాదాపు 10 రోజులు అలాగే ఉంచుతారు. చల్లదనం కారణంగా అదంతా గడ్డ కడుతుంది. దీన్ని సిఎస్గా మార్చి విక్రయానికి వినియోగిస్తున్నారు. ఇవి బయటపడడం చర్చనీయాంశమైంది. అయితే జిల్లాలో కల్తీ కల్లుతో పాటు గంజాయి దందా సైతం కొనసాగుతున్నది. గత నెలలో జిల్లా కేంద్రంలోని ఆసుపత్రుల్లో పనిచేసే ముగ్గురు ల్యాబ్ ఎక్స్రే టెక్నీషియన్లు, ఓ యువకుడు శస్త్రచికిత్సలకు వాడే మెడా జోలం ఇంజక్షన్లను యువతకు అక్రమంగా అందజేస్తూ పట్టుబడ్డాడు.
ఈ మందు ప్రాణాంతకమే. ఖానాపూర్లో బాటిల్ షాట్ అనే కొత్త పద్ధతిలో యువకుడు గంజాయి, బోను ఫిక్స్ మిశ్రమాన్ని బాటిల్లో రంధ్రం చేసి పెన్ను మూత ద్వారా పీలుస్తున్నారు. ఈ ప్రమాదకర అలవాటుకు యువత తెలియకుండానే బానిసలవుతున్నారు. అంతేగాకుండా వైట్నర్, దగ్గు మందులు, నిద్రకు ఉపయోగించే బిల్లలను సైతం మత్తుకోసం వాడుతున్నవారున్నారు. ఈ వ్యవహారం జిల్లాలో యువత మత్తుబారిన పడడానికి కారణమవుతుంది. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ మత్తుకు బానిస అవుతుండడం ఒక రకంగా పరిస్థితులు ఎటు వైపు వెళుతున్నాయో ఆలోచించాల్సిన అవసరం ఉందంటున్నారు. అంతేగాకుండా గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఎకరాలకు ఎకరాలు గంజాయి పంట సాగు చేసిన సంగతి బయటపడింది. అమాయక రైతులను మభ్యపెట్టి దందా కొనసాగిస్తున్నారంటున్నారు.
ఇప్పటికైనా డ్రగ్ ఫ్రీ జిల్లాగా మారేలా ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నాలు ముమ్మరం చేస్తేనే యువత, ప్రజలు మత్తునుండి బయటపడతారని లేకుంటే ఆ దేవుడు కూడా కాపాడే పరిస్థితులు లేకపోవచ్చన్న అభిప్రాయం జిల్లా వ్యాప్తంగా వ్యక్తమవుతున్నది. జిల్లాలో మత్తు నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ అబ్దుల్ రజాక్ చెప్పారు. గత ఏడాది అక్టోబర్ నెలలో నిర్మల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఖానాపూర్ ప్రాంతంలో గుడుంబ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అంతేగాకుండా జిల్లాలోని భైంసా ప్రాంతంలో కల్లులో క్లోరో హైడ్రేట్ (సీహెచ్) కలపకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు ఎక్కడైనా కల్లులో మత్తు పదార్థాలు కలుపుతున్నట్లు తనకు సమాచారం ఇస్తే అప్పటికప్పుడే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల జగిత్యాలకు తరలుతున్న మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
- వకుళాభరణం ప్రశాంత్,
(ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో ఇన్చార్జ్)
(99516 66160)