హైదరాబాద్: అంజనాదేవి అనారోగ్యం పాలయ్యారనే విషయంపై ఆమె కుమారుడు, ఆంధ్రప్రదేశ్ ఎంఎల్సి నాగబాబు (Nagababu) స్పందించారు. అంజనాదేవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. ఆమెను చూసేందుకు పవన్కళ్యాణ్ మంత్రివర్గ సమావేశం నుంచి చిరంజీవి షూటింగ్ని ఆపుకొని హైదరాబాద్ వచ్చారని మంగళవారం ఉదయం నుంచి ప్రచారం జరిగింది.
అయితే తాజాగా ఈ వార్తలన్నీ అవాస్తవాలని నాగబాబు (Nagababu) స్పష్టం చేశారు. తమ తల్లి చాలా ఆరోగ్యంగా ఉందని ఆయన సోషల్మీడియా వేదికగా తెలిపారు. కొన్ని అవాస్తవాలు ప్రచారం జరుగుతున్నాయని.. కానీ, ఆమె చాలా బాగున్నారంటూ ఆయన పోస్ట్ చేశారు. అయితే అంజనాదేవి గురించి ఇలాంటి వార్తలు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు ఆమె అనారోగ్యానికి గురయ్యారని వార్తలు వచ్చాయి. ఇకసారి చిరంజీవి స్వయంగా ఈ వార్తలను ఖండించారు. అసత్యా ప్రచారాలు నమ్మొద్దని ఆయన సోషల్మీడియాలో పోస్ట్ చేశారు.