న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు ఇది షాకింగ్ న్యూస్. జూలై 1వ తేదీ నుంచి రైల్వే (Indian Railways) టికెట్ ధరలు పెరగనున్నాయి. నాన్ ఎసి మొయిల్/ఎక్స్ప్రెస్ ట్రైన్ టికెట్ ధరపై కిలోమీటర్కు పైసా, ఎసి తరగతి టికెట్ ధర కిలోమీటర్కు రెండు పైసలు పెరుగనుంది. ఈ విషయాన్ని కొన్ని అంగ్ల వెబ్సైట్లు వెల్లడించాయి. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. చాలా రోజుల తర్వాత రైల్వే టికెట్ ధరలు సవరిస్తున్నారు.
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే.. ఆధార్ అథంటికేషన్ తప్పని సరి అని రైల్వే శాఖ (Indian Railways) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మార్పు జూలై 1 నుంచి అమలులోకి రానుంది. దీంతో పాటే సమరించిన టికెట్ ధరలు కూడా అమలులోకి వస్తాయని తెలుస్తోంది. సబర్బన్ టికెట్ ధరలు, 500 కిలోమీటర్ల వరకూ సెకండ్ క్లాస్ ప్రయాణానికి ఈ పెంపు వర్తించదు.. 500 కిలోమీటర్లు దాటితే పైసా చొప్పున చెల్లించాలి. సెలవారీ టికెట్ ధరల్లోనూ ఎలాంటి మార్పు ఉండబోదని సంబంధిత వర్గాలు తెలిపాయి.