Wednesday, June 25, 2025

2.37 లక్షల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు ఇచ్చాం: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది
1.03 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయి
వివిధ దశల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి
రెవెన్యూ, హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతోందని రెవెన్యూ, హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల ఇళ్లను మంజూరు చేయగా ఇందులో 2.37 లక్షల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసినట్టు ఆయన తెలిపారు. 1.03 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా రూ.22,500 కోట్లతో నియోజకవర్గానికి 3,500ల చొప్పున 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈనెల 23వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్‌ఎంసీ) మినహా రాష్ట్రంలోని 95 నియోజకవర్గాలకుగాను 88 నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని, వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని గ్రౌండింగైన ఇళ్లకు వీలైనంత త్వరగా బేస్‌మెంట్ పనులు పూర్తి చేసుకునేలా నిరంతరం మానిటరింగ్ చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు.

పలు జిల్లాల్లో అధికారుల పనితీరు మెరుగుపడాలి
ఇళ్ల మంజూరు, గ్రౌండింగ్‌లో సూర్యాపేట, పెద్దపల్లి, భూపాలపల్లి, హనుమకొండ, వికారాబాద్, సిద్దిపేట, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల పనితీరు మరింత మెరుగు పడాలని, తక్షణమే ఆయా జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ఒక్కో ఇంటి కోసం 40 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తోందని, ఈ ప్రయోజనాన్ని పూర్తిస్థాయిలో లబ్ధిదారులు పొందే విధంగా క్షేత్ర స్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని బట్టి లబ్ధిదారులకు ప్రతి సోమవారం చెల్లింపులు జరుపుతున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా నాలుగు విడతల్లో ఇందిరమ్మ లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోని జమ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. బేస్‌మెంట్ పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు, గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత 1.25 లక్షలు, స్లాబ్ పూర్తయిన తర్వాత 1.75 లక్షలు, మిగిలిన పనులు పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు విడుదల చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు.

అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లపై…
ఇంటి స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇప్పటివరకు కేటాయించని డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయించాలని, అలాగే మొండిగోడలతో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ ముందుకు రాని పక్షంలో లబ్ధిదారులే పూర్తి చేసుకోవడానికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వమే అందిస్తుందన్నారు. ప్రధానంగా జీహెచ్‌ఎంసీ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News