గోదావరి బనకచర్ల విషయంలో నాపై తప్పుడు ప్రచారం
కెసిఆర్ మాదిరిగా నేను మోసం చేయలేదు
నీటి హక్కుల విషయంలో తెలంగాణకు మరణశాసనం రాసిందే కెసిఆర్
చేసిన తప్పులకు ముఖం చెల్లకనే ఫాంహౌజ్ నుంచి కెసిఆర్ బయటకు రావడం లేదు
‘రైతు నేస్తం’, రైతు విజయోత్సవ సభలో సిఎం రేవంత్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: బనకచర్లపై అసెంబ్లీలో కెసిఆర్ చర్చకు సిద్ధమా..? అని సిఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. 2016లో గోదావరిలోకి 3 వేల టిఎంసీలు వెళ్తున్నాయని చెప్పింది మీరు కాదా? అని ఆయన నిలదీశారు. గోదావరి బనకచర్ల విషయంలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబుతో ఉండేవాడిని అయితే ఆయనతోనే ఉండేవాడినని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన సోనియాకు అండగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్లోకి వచ్చానని, కెసిఆర్ మాదిరిగా తాను మోసం చేయలేదని సిఎం రేవంత్ విమర్శించారు. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని కెసిఆర్ మాదిరిగా మోసం చేయలేదని, బనకచర్లపై చర్చ కోసం కెసిఆర్ స్పీకర్కు లేఖ రాయాలని సిఎం రేవంత్ డిమాండ్ చేశారు. నీటి హక్కుల విషయంలో తెలంగాణకు మరణశాసనం రాసిందే కెసిఆర్ అని సిఎం రేవంత్ మండిపడ్డారు.
వేల కోట్లకు కెసిఆర్, హరీష్రావు, కెటిఆర్లు ఎలా అధిపతులు అయ్యారు
సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ‘రైతు నేస్తం’, రైతు విజయోత్సవ సభలో సిఎం రేవంత్రెడ్డి మంత్రులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్ పేషంట్ ఎలా ఉంటారో రాష్ట్ర పరిస్థితి అలా ఉన్నప్పుడు తమకు ప్రభుత్వాన్ని అప్పగించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్లకు కెసిఆర్, హరీష్రావు, కెటిఆర్లు ఎలా అధిపతులు అయ్యారని, అది ఎలా సాధ్యం అయ్యిందని సిఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఫాంహౌజ్ లు ఎలా వచ్చాయో బిఆర్ఎస్ నేతలు చెప్పాలని సిఎం రేవంత్ డిమాండ్ చేశారు. చేసిన తప్పులకు ముఖం చెల్లకనే ఫాంహౌజ్ నుంచి కెసిఆర్ బయటకు రావడం లేదని సిఎం రేవంత్ విమర్శించారు. గత ప్రభుత్వంలో రైతుబంధు ఇచ్చేందుకు భూములను అమ్మారని, రుణమాఫీ కోసం ఔటర్ రింగ్రోడ్డు భూములు అమ్మారని, ఇప్పుడేమో తమకు నీతులు చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోదావరి నీటిపై ఒకరోజు, కృష్ణా నీటిపై ఒకరోజు అసెంబ్లీలో చర్చిద్దాం
కెసిఆర్ హయాంలో ఎపి ముచుమర్రి కట్టారని, పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసింది కూడా బిఆర్ఎస్ హయాంలోనేనని సిఎం రేవంత్రెడ్డి అన్నారు. గోదావరి నీటిపై ఒకరోజు, కృష్ణా నీటిపై ఒకరోజు అసెంబ్లీలో చర్చించడానికి రావాలని సిఎం రేవంత్ డిమాండ్ చేశారు. రాయల సీమను రతనాల సీమ చేస్తానని చెప్పింది ఎవరో ఆధారాలు సహా చెబుతానని ఆయన తెలిపారు. అప్పుడంటే పెద్దలు జానారెడ్డి కెసిఆర్తో ఎందుకులే అనుకున్నారని, ఇప్పుడు అలా కాదనీ, కెసిఆర్ అసెంబ్లీకి వస్తే అన్ని వివరిస్తానని సిఎం రేవంత్ పేర్కొన్నారు.
పదేళ్లలో కెసిఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రజలకు లెక్క చెప్పాలి
రాబోయే రోజుల్లో రాజీవ్ యువ వికాసం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని భట్టి విక్రమార్కకు సూచిస్తున్నానని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. మరో పదేళ్లు అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీనేనని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రజలందరూ మరోసారి ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యానించారు నోటిఫికేషన్లు వద్దని నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్న పరిస్థితి నేడు రాష్ట్రంలో నెలకొందని అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోనే రూ. 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని ఆయన తెలిపారు. పదేళ్లలో కెసిఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రజలకు లెక్క చెప్పాలని ఆయన సూచించారు. ఇప్పుడు తాము నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని బిఆర్ఎస్ నాయకులపై సిఎం రేవంత్ ఫైర్ అయ్యారు. ఇలాంటి శకుని మామ (కెసిఆర్), శనీశ్వరుడైన అల్లుడు (హరీష్ రావు) తమను ప్రశ్నిస్తున్నారని సిఎ రేవంత్ ఎద్దేవా చేశారు. కెసిఆర్ కుట్రలతోనే తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాలు ఆగిపోయాయని, కెసిఆర్ దేని మీద చర్చకు వస్తారో చెప్పాలని సిఎం రేవంత్ డిమాండ్ చేశారు.
కాళేశ్వరం కూలేశ్వరం అయ్యింది…
లక్షా 4 వేల కోట్ల రూపాయలతో రైతును రాజును చేసిన ప్రభుత్వం తమదని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. వ్యవసాయం అంటే రైతుకు సాయం చేయడమని తాము నమ్ముతామని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం పేరుతో బిఆర్ఎస్ నాయకులు కమీషన్లు తీసుకున్నారని సిఎం రేవంత్ ఆరోపించారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పామని, ఆ దిశగా మహిళలకు పెట్రోల్ బంకులు పెట్టించామని సిఎం రేవంత్ తెలిపారు. ప్రజా పాలనలో అందరూ భద్రంగా ఉండాలని చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలన, 18 నెలల తమ పాలనపై ఎక్కడికక్కడ చర్చ పెట్టాలని సిఎం రేవంత్ సూచించారు. పదేళ్లలో ఏ ప్రాజెక్టులు పూర్తి కాలేదని, కాళేశ్వరం కూలేశ్వరం అయ్యిందని, లక్ష కోట్లు వృధా అయ్యాయని, చిన్న కాళేశ్వరంలో కెసిఆర్ను ఉరేసినా తప్పులేదని రైతులు అంటున్నారని సిఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు నిధులు విడుదల రికార్డ్
2019లో బనకచర్లకు పునాది వేసింది కెసిఆర్ అని, రోజమ్మ రొయ్యల పులుసు తిని నీళ్లు అప్పగించింది ఎవరని సిఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. సీమాంధ్ర పాలకులతో కలిసి తెలంగాణను ఎడారి చేశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో తాను ఏనాడూ రాజీపడబోనని సిఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఎవరు తెలంగాణకు ద్రోహం చేశారో చర్చిద్దామంటూ సిఎం రేవంత్ సవాల్ విసిరారు. కృష్ణానదిపై కెసిఆర్ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని ఆయన అన్నారు. కెసిఆర్ ఎగ్గొట్టిన రూ. 7 వేల కోట్ల రైతు భరోసా తమ ప్రభుత్వం ఇచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. 70 లక్షల మంది రైతుల కళ్ళల్లో సంతోషం చూస్తున్నామని, రైతు భరోసా కోసం 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు నిధులు విడుదల చేయడం రికార్డ్ అని సిఎం రేవంత్ పేర్కొన్నారు. 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చామని, కోటి 49 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చామని సిఎం తెలిపారు. తెలంగాణ చరిత్ర అంతా రైతులదేనని, భూమి చుట్టూనే మన పోరాటాలు, జీవితాలు ముడిపడి ఉన్నాయని ఆయన తెలిపారు. రైతులను ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్దేనని సిఎం రేవంత్ పేర్కొన్నారు.
ఒక్క కిలో తరుగు తీసినా తోలు తీస్తాం
ప్రజల ఆశీర్వాదంతో జెడ్పీటిసిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, అతి చిన్న వయస్సులోనే ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇచ్చారని సిఎం రేవంత్రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణలో జరిగిన ఉద్యమాలు తనకు తెలుసని భూమి చుట్టూ మన త్యాగాలు, జీవితాలు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. వ్యవసాయం దండుగ అనే రోజు నుంచి వ్యవసాయం పండుగ చేసే దిశగా ముందుకు సాగామని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వానికి మొట్ట మొదటి ప్రాధాన్యత కింద రైతులకు ఇస్తుందని ఆ తర్వాత ఆడబిడ్డలు, తర్వాత ఉద్యమకారులు, విద్యార్థులకు ఇస్తుందన్నారు. రైతులను అప్పుల నుంచి తాము విముక్తులను చేశామని ఆయన చెప్పారు. వరి వేసుకుంటే ఉరే అని నాటి ముఖ్యమంత్రి చెప్పారని కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పండించండి అదనంగా రూ.500ల బోనస్ ఇస్తామని చెబితే రైతులు సన్న వడ్లు పండించారని సిఎం రేవంత్ చెప్పారు. నాడు తాలు పేరుతో క్వింటాల్ కు 10 కిలోలు తరుగు తీసే వారని ఇప్పుడు ఒక్క కిలో తరుగు తీసినా తోలు తీస్తామని హెచ్చరించామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.
దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో ఈరోజు లిఖించదగ్గ రోజు: భట్టి
దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో ఈరోజు లిఖించదగ్గ రోజు అని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. 70 లక్షల మంది రైతులకు తొమ్మిది రోజుల్లో రూ. తొమ్మిది వేల కోట్లు వారి ఖాతాల్లో వేశామని ఆయన గుర్తు చేశారు. రైతు భరోసా విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు త్యాగాలు చేసిన మహానుభావుడు రాజీవ్ గాంధీ అని ఆయన అన్నారు. వ్యవసాయం అంటే కాంగ్రెస్ అని, కాంగ్రెస్ అంటేనే వ్యవసాయమని డిప్యూటీ సిఎం బట్టి తెలిపారు. రైతులకు మద్దతు ధర ఇచ్చింది కాంగ్రెస్ అని, రైతులకు నిధులు ఇవ్వాలని చెప్పింది కాంగ్రెస్ అని, దేశంలో గ్రీన్ రెవల్యూషన్ తెచ్చింది కాంగ్రెస్ అని డిప్యూటీ సిఎం చెప్పారు. రైతులకు రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన తెలిపారు.
రైతులకోసం బిఆర్ఎస్ ఏమీ చేయలేదని, రైతులకు ఇవ్వాల్సిన అన్నింటిని బంద్ చేసిందని డిప్యూటీ సిఎం విమర్శించారు. రైతు బంధు పేరుతో అరకొర నిధులు వేశారని ఆయన ఆరోపించారు. చెప్పిన మాట ప్రకారం తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా ఇచ్చిన ప్రజా ప్రభుత్వాన్ని రైతులు ఆశీర్వదించాలని డిప్యూటీ సిఎం భట్టి కోరారు. రైతు సంక్షేమం కోసం రుణమాఫీ, మద్దతు ధర, రైతు భరోసా, వడ్లకు బోనస్, ఉచిత కరెంట్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. 1,034 వేదికల్లో ‘రైతు నేస్తం’ కార్యక్రమాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని డిప్యూటీ సిఎం అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పంట నష్టానికి సంబంధించి పరిహారం ఇవ్వలేదని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అకాలవర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం: మంత్రి తుమ్మల
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న పథకాలు పొరుగు రాష్ట్రాలు అనుసరించాలని చూస్తున్నాయని ఆయన అన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీని, 25 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్లు జమ చేశామని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇలాంటి ఘనత దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదని ఆయన అన్నారు. రైతు భరోసా పథకం కింద 67.01 లక్షల మంది రైతులకు తొమ్మిది రోజుల్లోనే సుమారుగా రూ. 9 వేల కోట్లను జమ చేసి రికార్డు సృష్టించామని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయ రంగానికి రూ.1.04 లక్ష కోట్లు ఖర్చు చేశామని ఆయన తెలిపారు. రబీ సీజన్లో 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్ల రికార్డు ఉత్పత్తితో దేశంలోనే ముందున్నామని ఆయన తెలిపారు.