మనతెలంగాణ/హైదరాబాద్ : దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దండగైన వ్యవసాయం, పదేళ్ల కెసిఆర్ పాలనలో పండగయిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో మళ్లీ దండగయిందని విమర్శించారు. రూ.10 వేల రైతుబంధు స్థానంలో రూ.15 వేలు రైతుభరోసా ఇస్తామని ఓట్లు దండుకుని .. రూ.12 వేలకు కుదించడం సంబరమా..? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. రైతుభరోసా రెండు సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం ఆగమేఘాల మీద డబ్బులు వేయడం సంబరమా..? అని నిలదీశారు. వ్యవసాయం అంటే రైతుభరోసా ఒక్కటేనా..? అని అడిగారు. సాగు నీటితో రైతుకు ప్రోత్సాహం ఇచ్చి..ఉచిత కరెంటుతో సాగుకు ఊతమిచ్చి..పంట పెట్టుబడికి రైతుబంధుతో వెన్నుదన్నుగా నిలిచి..మట్టిని నమ్ముకున్న రైతు కుటుంబాలకు రైతు ఏ కారణం చేత మరణించినా రూ.5 లక్షల రైతుబీమాతో ధీమానిచ్చి…వందశాతం పంటల కొనుగోళ్లతో వ్యవసాయానికి భరోసానిచ్చిన దార్శనికుడు కెసిఆర్ అని వ్యాఖ్యానించారు.
కరోనా విపత్తులోనూ కర్షకుల కష్టాలను గుర్తెరిగి రైతుబంధును ఆపకుండా ఊరూరా పంటల కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులకు అండగా నిలబడి దేశానికి ఆదర్శంగా నిలబడ్డ చరిత్ర కెసిఆర్ది అని పేర్కొన్నారు. రైతుభరోసా ఎగ్గొట్టి.. రైతుబీమా పక్కనపెట్టి..రుణమాఫీని తుంగలో తొక్కి.. క్వింటాలుకు రూ.500 బోనస్కు సున్నం పెట్టి..కల్లాలలో ధాన్యం కొనకుండా కన్నీళ్లు పెట్టించి..రైతులను పండగ చేసుకోమంటారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మోసాలకు గుణపాఠం తప్పదు అని హెచ్చరించారు. జాగో రైతన్నా జాగో..జాగో తెలంగాణ జాగో అంటూ ట్వీట్ చేశారు.