Thursday, June 26, 2025

గద్దర్ అవార్డుల్లో ఏదీ పారదర్శకత?

- Advertisement -
- Advertisement -

ఇటీవల జరిగిన ‘తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్’ కార్యక్రమం ఒక విషయం స్పష్టంగా చూపింది. గద్దర్ పేరుతో అన్నీ విభాగాల అవార్డులకూ పేర్లు పెట్టడం ఘోరమైన పొరపాటు. గద్దర్ విప్లవాత్మక ఆలోచనలకు విరుద్ధమైన చిత్రాలకు అవార్డులు ఇస్తే, అది గద్దర్ వారసత్వాన్ని అవమానించడమే కాక, ఆయనను స్మరించడంలో ఉండే సారాన్ని మసకబార్చేపనిగా మారుతుంది. పలుమార్లు హెచ్చరికలివ్వబడినప్పటికీ ప్రజాభిప్రాయాన్ని తృణప్రాయంగా పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకు పోయింది. జ్యూరీ ఎంపికనుండి అవార్డుల నిర్ణయాల వరకూ ఈ కార్యక్రమమంతా తెలంగాణ ప్రజలను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ ప్రక్రియ అంతా పారదర్శకతలేకుండా, అనేక విరుద్ధతలతో నిండినదిగా ఉంది. దీనిని సమీక్షించకుండా వదిలేస్తే, ఇది రాష్ట్ర సాంస్కృతిక రంగంలో శాశ్వత మచ్చగా మిగిలిపోతుంది.

అంతేకాదు, ఇది బాధ్యత వహించేవారి సామర్థ్యం, నైతికతలపై కూడా తీవ్రమైన సందేహాలు కలిగిస్తోంది. ఉదాహరణకు, పుష్పా 2 చిత్రంలోని స్మగ్లర్ పాత్రకు అవార్డు ఇచ్చారు. ఈ సినిమాలో అసభ్యతలు, పోలీసుల్ని దూషించే ఘట్టాలు ఉన్నాయి. దీనిద్వారా మన యువతకు ఏ సందేశం ఇస్తున్నాం? ఏ విలువలు మిగులుస్తున్నాం? ఇది అక్రమతను, అసభ్యతను, చట్టవ్యతిరేకతను ప్రోత్సహించడమే కదా? ఇది గద్దర్ పేరుతో జరగాల్సిన కార్యక్రమమా? ఇంకో తీవ్రమైన విషయమేమిటంటే -రజాకార్ అనే సినిమాకు రాష్ట్ర అవార్డు ఇవ్వడం. ఈ చిత్రం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించిందని, మత విద్వేషాలను ప్రేరేపించేలా ఉన్నదని చరిత్రకారులు, రచయితలు విమర్శించారు. అలాంటి సినిమాకి చారిత్రక చిత్రం విభాగంలో అవార్డు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం వక్రీకృత చరిత్రను సమర్థించినట్లైంది. ఇది గద్దర్ లాంటి విప్లవాత్మక నాయకుడి పేరుతో జరిగిందంటే, అది మరింత దురదృష్టకరం. తాము సెక్యులర్ విలువలకు కట్టుబడి ఉన్నామని చెప్పుకునే పార్టీకే ఇది చారిత్రక అపసవ్యంగా నిలుస్తుంది.

అవార్డు కమిటీ సభ్యులలో ఒకరైన గేయ రచయిత ‘షామ్’ కూడా అదే సినిమాకు పనిచేయడం మరొక పెద్ద నైతిక ఉల్లంఘన. జ్యూరీగా పనిచేస్తూ, తనకు సంబంధించిన సినిమాకు పురస్కారం రావడం ద్వారా ఆ ప్రక్రియకు విశ్వసనీయతే మిగలదు. ఇంకో ఉదాహరణ అవార్డు కార్యక్రమానికి ఒకరోజు ముందు, తెలంగాణ మంత్రివర్గ సభ్యుని సోదరుడైన పొన్నం రవిచంద్రను ఉత్తమ విమర్శకుడిగా ప్రకటించడం. అసలు ఆ విభాగానికి ముందుగా ఏ దరఖాస్తులూ లేవని ప్రకటించారు. మరి ఒక రోజులోనే ఆయన పేరు ఎలా వచ్చిందీ? ఇది అవార్డు నిబంధనలకు, విధివిధానాలకు విరుద్ధమే కాక, అవార్డులు ఎలా యాదృచ్ఛికంగా నిశ్చయించబడుతున్నాయన్నదానికి ఉదాహరణ. అలాగే, ఉర్దూ సినిమాలకోసం సరైన జ్యూరీని ఏర్పాటు చేయలేదన్నది మరొక ప్రధాన సమస్య. గత పదేళ్లలో ఒక్క ఉర్దూ సినిమాకూ అవార్డు ప్రకటించలేదు ఎందుకు?. ఉర్దూ భాషా పరిజ్ఞానం లేని జ్యూరీతో ఎలా న్యాయం జరుగుతుంది?. ఇవన్నీ కాకుండా, అసలు అవార్డు ప్రక్రియనే అవగాహనారాహిత్యంగా మొదలయింది. పద్మ అవార్డులు, జాతీయ ఫిలిం అవార్డులు, అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ అన్నీ స్పష్టమైన దరఖాస్తుల పద్ధతిలో, పారదర్శకంగా నిర్వహించబడతాయి.

కానీ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టిఎఫ్‌డిసి) మాత్రం 2024లో సెన్సార్ అయిన చిత్రాలకే దరఖాస్తులు ఆహ్వానించింది. గత పదేళ్లలో(జూన్ 2, 2014 నుంచి డిసెంబర్ 31, 2023 వరకు) వచ్చిన సినిమాలకైతే దరఖాస్తే తీసుకోలేదు. అలాంటప్పుడు సెన్సార్ అయిన సినిమాలన్నీ చూసి నిర్ణయించవలసి ఉంటుంది. ఇంకో ఆందోళన కలిగించే విషయం 2014నుండి 2023 వరకు అవార్డులు కేవలం నిర్మాతలకే ఇవ్వబడ్డాయి. అసలు సినిమాలు చూసే పనే చేయలేదు. ఆ సినిమాల కళాకారులు, సాంకేతిక నిపుణుల్ని పూర్తిగా పక్కనపెట్టారు. టిఎఫ్‌డిసి ఛైర్మన్ స్వయంగా నిర్మాత కావడం ఈ ప్రక్రియను మరింత అనుమానాస్పదంగా చేస్తుంది. ఇది అసలు కళను గౌరవించడం కాదు పెట్టుబడిదారుల్ని ప్రోత్సహించే వ్యవస్థగా మారిపోయింది. ప్రజాధనం, కళా ప్రేరణకు వాడాలి కానీ, లోపాయికారి వర్గాలకు లబ్ధి చేకూర్చటానికి కాదు. ఇంకా, టిఎఫ్‌డిసి ఛైర్మన్‌కు సంబంధిత నాలుగు చిత్రాలు (శతమానం భవతి, మహర్షి, ఫిదా, బలగం) అవార్డులకు ఎంపికవడం, వాటిలో రెండింటిలో జ్యూరీ హెడ్ జయసుధ నటించడమూ తగిన విధాన ఉల్లంఘనలే. అసలు అధికారిక జ్యూరీ ఉన్నా, ఎందుకు మరో జ్యూరీ వేసారు? ఆ కొత్త జ్యూరీ సినిమాలు చూసిందా? నిబంధనల ప్రకారం టిఎఫ్‌డిసి అధికారులకు సంబంధిత సినిమాలను అవార్డుల పోటీలో అర్హత కలిగించకూడదు. ఇది నిబంధనల ఉల్లంఘనే!.

ఇంకా చాలా మంచి సినిమాలు, ముఖ్యంగా తెలంగాణ సినిమాలు పూర్తిగా విస్మరించబడ్డాయి. 15 -20 రోజుల్లోనే అన్ని సినిమాలు చూడడం అసాధ్యం. ఇది పూర్వనిర్దేశిత పక్షపాతంతో కూడిన వ్యవస్థ అని చెప్పక తప్పదు. అలాగే షార్ట్ ఫిలిం విభాగానికి దరఖాస్తులు తీసుకున్నా, అవార్డులు ఎవరికి ఇచ్చారో వేడుకలో ప్రకటించలేదు. ఇది మరీ అన్యాయం! తొందరపడి, జనం మనసు గెలవాలనే ఉద్దేశంతో చేసిన ఈ వేడుక, ఖర్చులన్నీ ప్రజాధనంతో నిర్వహించినా, విశ్వసనీయతను కోల్పోయింది. ప్రజల ప్రశంసకన్నా వ్యతిరేకతే ఎక్కువగా ఎదుర్కొంది. మంచి మార్గం ఏమిటంటే మొదటగా తెలంగాణ ఫిలిం పాలసీని ఏర్పాటు చేయాలి. గద్దర్ ఆశయాలకు అనుగుణంగా ఉన్న చిత్రాలను ప్రోత్సహించాలి. అప్పుడు ఇచ్చే అవార్డులు నిజమైన గౌరవంగా నిలుస్తాయి. ప్రస్తుతంగా ఎంపిక చేసిన ఏ సినిమా గద్దర్ ఆలోచనలతో సంబంధం లేదు. మరి, ఈ విధంగా ఈ సినిమాల ఎంపికను ఎలా ఆయనకు నివాళిగా చెప్పగలం? కాబట్టి, ఈ వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి, గద్దర్ గౌరవాన్ని కాపాడటానికి ఈ సూచనలు అమలు చేయాలి: 2014 జూన్ 2 నుంచి 2023 డిసెంబర్ 31 మధ్య విడుదలైన సినిమాల కోసం తక్షణమే టిఎప్‌డిసి దరఖాస్తులను ఆహ్వానించాలి. కొత్త, స్వతంత్ర జ్యూరీని సినీ దర్శకులు, రచయితలు, విమర్శకులు, సీనియర్ మేధావులతో నియమించాలి. ఆ దశాబ్దపు సినిమాలన్నీ, అలాగే 2024 దరఖాస్తు చేసిన సినిమాలు పారదర్శకంగా మళ్లీ కొత్త జ్యూరీ చూడాలి. చూసి, నాణ్యత, సాంస్కృతిక విలువల ఆధారంగా అవార్డులు ఇవ్వాలి. ఈ విమర్శను దాడిగా కాకుండా, రాష్ట్రం, తెలంగాణ కళాసంస్కృతి పట్ల మమకారంతో చెప్పిన విజ్ఞప్తిగా స్వీకరించాలి. నేను ఒక చిత్రదర్శకుడిగా, తెలంగాణ ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా, ఈ రాష్ట్ర కళావారసత్వం, ప్రతిష్ఠను నిలబెట్టాలనే ధ్యేయంతో సూచిస్తున్నాను.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News