ఇటీవల మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశం మొత్తాన్ని కుదిపేసింది. వివాహం జరిగిన కొద్ది రోజుల్లోనే భార్య సోనమ్ తన భర్త రాజా రఘువంశీని హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందే.. ఇప్పుడు, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఇలాంటి ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇది మరోసారి రాజా రఘువంశీ హత్య కేసును గుర్తు చేసింది. పెళ్లి అనంతరం మొదటి రాత్రి ఎంతో ఉత్సాహంగా ఉన్న వరుడికి.. వధువు దిమ్మతిరిగే షాకిచ్చింది. మొదటి రాత్రి.. గదిలోకి పాల గ్లాసుతో రావాల్సిన వధువు కత్తితో వచ్చి హల్ చల్ చేసింది. “నన్ను తాకితే.. నిన్ను 35 ముక్కలుగా నరికివేస్తా” అని బెదిరించింది.
వివరాల్లోకి వెళితే.. ప్రయాగ్రాజ్లోని నైని ప్రాంతంలో నివసించే కెప్టెన్ నిషాద్, సితార అనే యువతిని ఏప్రిల్ 29న వివాహం చేసుకున్నాడు. పెళ్లి వరకు అంతా బాగానే ఉంది.. కానీ, పెళ్లి తర్వాత మొదటి రాత్రి జరిగినది వరుడికి ఊహించనిది. హనీమూన్ రోజు రాత్రి సితార తనను కత్తితో బెదిరించి.. “నన్ను ముట్టుకుంటే, నిన్ను 35 ముక్కలుగా నరికివేస్తాను. నేను వేరొకరి దానిని” అని చెప్పిందని నిషాద్ పేర్కొన్నాడు. ఈ ఘటన తర్వాత సితార మంచం మీద పడుకోగా, నిషాద్ సోఫాలో పడుకున్నాడు. వరుసగా మూడు రాత్రులు, సితార కెప్టెన్ను కత్తితో బెదిరిస్తూనే ఉంది. చివరికి, అతను తన తల్లిదండ్రులకు జరిగిన దాని గురించి చెప్పాడు. ఆ తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కెప్టెన్ నిషాద్ తల్లితండ్రలు సితారను నిలదీయగా.. ‘నేను అమన్ను ప్రేమిస్తున్నాను. అతనితోనే జీవించాలనుకుంటున్నాను. అతను మాత్రమే నన్ను ముట్టగలడు, మరెవరూ కాదు’ అని చెప్పింది. దీంతో వారు సితార తల్లిదండ్రులను పిలిపించి పెద్ద మనుషుల ముందు పంచాయతీ పెట్టారు. సితార ఎక్కడికీ వెళ్లకూడదని, ఇక్కడే కోడలిగా ఉండాలని.. తన ప్రేమికుడిని మరచిపోవాలని పంచాయితీలో ఆమెకు నచ్చజెప్పారు. అయినప్పటికీ, సితార తన భర్తను వేధిస్తూనే వచ్చింది. చివరికి భార్య వేధింపులు భరించలేక నిషాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ఈలోగా, సితార తన ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.