తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టు బుధవారం తుది తీర్పు వెల్లడించింది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీతో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు రావడంతో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ముగిసినా ఎన్నికలు జరపడం లేదని నల్గొండ, నిర్మల్, జనగాం, కరీంనగర్ జిల్లాకు చెందిన ఆరుగురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై హైకోర్టులో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు పిటిషనర్ల వాదనలు వినిపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేసి, ప్రకటించడానికి 30 రోజుల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. 30 రోజుల్లో తన బాధ్యతలను నెరవేర్చి రాష్ట్ర ఎన్నికల సంఘానికి తమ సమ్మతి తెలియజేస్తామని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చాక 60 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. అందరి వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు.. రాజకీయవర్గాల్లో ఉత్కంఠకు తెరదించుతూ.. ప్రభుత్వం, ఎన్నికల సంఘం అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు జరపాలని ఆదేశిస్తూ తీర్పు వెల్లడించింది.