పునరుద్ధరణ పనులు
వారానికోసారి సమీక్ష
బనకచర్లపై న్యాయపోరాటం
ఈ నెల30న ప్రజాభవన్లో
పవర్ పాయింట్ ప్రజెంటేషన్
త్వరలో నాగార్జున సాగర్
ప్రాజెక్టు పూడికతీత పనులు
నీటిపారుదల శాఖ
-మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి రాష్ట్ర ప్రభు త్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టును చట్టపరంగా అడ్డుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. తెలంగాణా రై తాంగం ప్రయోజనాలకే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. బుధవారం జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బనకచర్ల ప్రాజెక్ట్ తో తెలంగాణ ఏర్పడనున్న ముప్పును 19 న కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ కు సిఎం రేవంత్ రెడ్డి, తాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించినట్లు తెలిపారు. ఎపి సర్కారు ఇచ్చే బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ఫ్రీ- ఫిజిబిలిటీ నివేదికను ఆమోదించవద్దని స్పష్టంగా చెప్పినట్లు వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాటిల్ ఎపి ప్రభుత్వం సమర్పించిన నివేదికను ఆమోదించ లేదని, త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.
ఈనెల 30న ప్రజాభవన్లో పిపిపి
గత పదేండ్ల పాలనలో పుట్టుకొచ్చిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణ ప్రయోజనాలకు జరిగే నష్టంపై ఈ నెల 30వ తేదీన సాయంత్రం మూడు గంటలకు ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్(పిపిపి) ఏర్పాటుచేశామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
టన్నెల నిపుణుల నియామకం
ఎస్ఎల్బిసి టన్నల్ పునరుద్దరణ పనులకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. శ్రీశైలం ఎడమ కాలువ (ఎస్ఎల్బిసి) పునరుద్ధరణ పనుల కోసం అంతర్జాతీయ స్థాయి ఏజెన్సీలతో చర్చించి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. టన్నెల్ నిర్మాణాలలో అపారమైన అనుభవం కలిగిన ఇద్దరు సైనిక అధికారుల సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇటీవల రోహ్తంగ్, జోజిలా టన్నెల్ నిర్మాణంలో పనిచేసిన ఆ ఇద్దరు అధికారులను వినియోగించుకుంటామన్నారు. భారత సైన్యంలో ఇంజినీర్ ఇన్-చీఫ్ గా పనిచేసిన జనరల్ హార్బల్ సింగ్ ను నీటిపారుదల శాఖకు సలహా దారుడిగా ఉండాలని కోరామని, అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించిన టన్నెల్ టెక్నాలజీ నిపుణులు కర్నల్ పరిక్షిత్ మోహ్రా వచ్చే జులైలో నీటిపారుదల శాఖలో చేరనున్నారని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
మూడు బ్యారేజిలకు డిజైన్ కన్సల్టెంట్
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజిల పునరుద్దరణ పనులకు ఎన్డిఎస్ఎ డిజైన్ కన్సల్టెంట్ గా వ్యహారిస్తుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఎన్డిఎస్ఎ ఇచ్చిన ఆదేశాలను వెంటనే అమలులోకి తీసుకు రావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి(ఎన్డిఎస్ఎ)ఇచ్చిన నివేదికలను మంత్రి ఉత్తమ్ సమీక్షించారు. బ్యారేజిల పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా వారానికోసారి సమీక్ష చేయనున్నట్లు చెప్పారు. కేంద్ర జలసంఘం సూచనలకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
ప్రాజెక్టుల పూడికతీత పనులు
రాష్ట్రంలో అనేక జలాశయాలు పూడికతో పూడి పోయి ఉన్నందున 20 నుంచి 25 శాతం మేర నీటిసామర్ధ్యం తగ్గిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జాతీయ మార్గదర్శకాలకు లోబడి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. నాగార్జునసాగర్, నిజాంసాగర్ తదితర ప్రాజెక్టుల పూడికతీత పనులపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూడిక తీత పనులను సత్వరం ప్రారంభించాలని, దీనిపై ఎపి ప్రభుత్వానికి కూడా సమాచారం అందించాలని అధికారులను సూచించారు.
డిండి ప్రాజెక్టుపై
డిండి ప్రాజెక్ట్ పై భూసేకరణ విషయమై సంబంధిత సంబందిత జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీచేశారు. నీటిపారుదల శాఖలో పెండింగ్ లో ఉన్న పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలని, బదిలీలు కూడా వెంటనే పూర్తి చేయాలని సూచించారు. దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పనుల పురోగతి, సీతారామ ప్రాజెక్టుకు ప్రస్తుతం కేటాయించిన నిధుల పరిమితులకు లోబడి అదనపు ప్యాకేజి లను రూపొందించే అంశలపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు.