టీమిండియా తీరు మారాల్సిందే..
మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ గెలుస్తుందని భావించినా బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం జట్టు ఆశలపై నీళ్లు చల్లింది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఏకంగా 471 పరుగులు చేసింది. మొదటి ఇనింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్లు సెంచరీలు సాధించారు. ముగ్గురు శతకాలు సాధించినా టీమిండియా స్కోరు 500 పరుగుల మార్క్కు చేరుకోలేదు. ఈ ముగ్గురు తప్ప మిగతా బ్యాటర్లు పూర్తిగా నిరాశ పరిచారు. దీంతో మొదటి ఇన్నింగ్స్లో భారత్ ఆశించిన స్కోరును సాధించలేక పోయింది.
ఒక వేళ తొలి ఇన్నింగ్స్లో కనీసం 550 పరుగులు సాధించి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరోలా ఉండేది. భారీ ఆశలు పెట్టుకున్న కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, కరుణ్ నాయర్లు విఫలమయ్యారు. కెరీర్లో మొదటి టెస్టు మ్యాచ్ ఆడిన సాయి సుదర్శన్ కనీసం ఖాతా తెరవకుండానే ఇంటిదారి పట్టాడు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చిన స్టార్ బ్యాటర్ కరుణ్ నాయర్ కూడా నిరాశ పరిచాడు. అతను కూడా ఖాతా తెరవడంలో విఫలమయ్యాడు. నాలుగు బంతులు ఆడి డకౌటయ్యాడు. రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ వంటి ఆల్రౌండర్లు కూడా బ్యాట్ను ఝులిపించలేక పోయారు. ఇద్దరు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. భారత్ చివరి 7 వికెట్లను 41 పరుగుల తేడాతో కోల్పోవడం గమనార్హం.
రెండో ఇన్నింగ్స్లోనూ అదే తీరు..
ఇక రెండో ఇన్నింగ్స్లోనూ భారత బ్యాటర్లు తేలిపోయారు. ఈసారి కెఎల్ రాహుల్, రిషబ్ పంత్లు మాత్రమే తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేశారు. వీరిద్దరూ శతకాలతో చెలరేగారు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీలతో అలరించిన ఓపెనర్ యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈసారి విఫలమయ్యారు. ఇద్దరు సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరారు. యువ ఆటగాడు సాయి సుదర్శన్ (30), కరుణ్ నాయర్ (20)లు మరోసారి విఫలమయ్యారు. రిషబ్ పంత్, కెఎల్ రాహుల్లు శతకాలతో మెరవగా మిగతా వారు ఘోర వైఫల్యం చవిచూశారు. దీంతో భారత్ స్కోరు 364 పరుగులకే పరిమితమైంది.