ఇక ఈ మ్యాచ్లో భారత ఓటమికి బౌలింగ్ వైఫల్యం ప్రధాన కారణమని చెప్పాలి. రెండు ఇన్నింగ్స్లలోనూ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ మెరుగైన స్కోరును సాధించిందంటే దానికి బౌలర్లే పూర్తి బాధ్యత వహించక తప్పదు. బుమ్రా మినహాయించి ఏ బౌలర్ కూడా మెరుగైన ప్రదర్శన చేయలేక పోయాడు. బుమ్రా ఒక్కడే ఐదు వికెట్లు తీశాడు. ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్లు పెద్దగా ప్రభావం చూపలేక పోయారు. శార్దూల్ ఠాకూర్, జడేజాలు అయితే ఒక్క వికెట్ కూడా పడగొట్టలేక పోయారు. రెండో ఇన్నింగ్స్లో కూడా బౌలర్లు నిరాశ పరిచారు. ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీలు అద్భుత బ్యాటింగ్తో టీమిండియా బౌలర్లను హడలెత్తించారు.
ఈ జోడీని కట్టడి చేయడంలో బుమ్రాతో సహా ప్రతి బౌలర్ విఫలమయ్యాడు. డకెట్ భారీ శతంక సాధించగా క్రాలీ సమన్వయంతో ఆడి అతనికి అండగా నిలిచాడు. జో రూట్, కెప్టెన్ బెన్ స్టోక్స్, వికెట్ కీపర్ జెమీ స్మిత్ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని ఇంగ్లండ్కు చిరస్మరణీయ విజయం సాధించి పెట్టారు. ఈ విజయంతో ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసం రెట్టింపు కాగా, టీమిండియా ఆత్మరక్షణలో పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ భారత జట్టుకు సవాల్ వంటిదేనని చెప్పాలి. అలవోకగా గెలిచే అవకాశాలున్న మ్యాచ్లో చేజేతులా ఓటమి పాలైన టీమిండయా రానున్న టెస్టుల్లోనైనా ఆట తీరును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.