Thursday, June 26, 2025

యుద్ధభూముల్లో జీవితపోరాటం

- Advertisement -
- Advertisement -

బాంబుల దాడులు, సైనిక బలగాల కవాతు విన్యాసాలు, సైరన్ల హెచ్చరికలు, నగరాల విధ్వంసాలు.. ఇలాంటి అత్యంత భయానక వాతావరణంలోనూ తమ జీవనపోరాటం కోసం ఆరోగ్య సంరక్షకులుగా, నిర్మాణాల కూలీలుగా, తాపీ మేస్త్రీలుగా, ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లుగా ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల్లో ఎందరో భారతీయులు గత కొన్నేళ్లుగా మనుగడ సాగిస్తున్నారు. అక్కడి యూనివర్శిటీల్లోనూ ఎందరో భారతీయ విద్యార్థులు చదువుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య కొన్ని రోజులపాటు యుద్ధం బీభత్సంగా సాగింది. ప్రవాస భారతీయులను స్వదేశానికి రప్పించాలన్న బాధ్యతతో భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధు పేరుతో అక్కడి భారతీయులను తరలించడం ప్రారంభించింది. పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్ వాసులకు కూడా ఆపరేషన్ సింధు సహకరిస్తోంది. ఇప్పటివరకు ఇరాన్ నుంచి 2858 మందిని, ఇజ్రాయెల్ నుంచి 818 మందిని కేంద్ర ప్రభుత్వం రప్పించ గలగడం హర్షించదగిన చొరవే.

అయితే గత కొన్నేళ్లుగా ఆ దేశాల్లో వివిధ వృత్తులు, ఉద్యోగాలు చేస్తూ బతుకుతున్న వారు మాత్రం తిరిగి భారత్‌కు రావడానికి ఇష్టపడడం లేదు. దేశాల యుద్ధం (War Nations) కన్నా తమ జీవన పోరాటం ముఖ్యమన్న అభిప్రాయం వారిలో కనిపిస్తోంది. ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక అభివృద్ధి దేశంగా ఎదుగుతున్న భారత్‌లో ప్రస్తుతం ఉంటున్న భారతీయుల్లో కొందరు ఆ దేశాలే తమ జీవనోపాధికి గమ్యస్థానాలన్న ఆకాంక్షను వెలిబుచ్చుతున్నారు. భారత ప్రభుత్వానికి ఇదో పెద్ద సవాలు. దేశంలో పౌరుల భద్రతకు ఢోకా లేదని, ఇతరత్రా సహకారం లభిస్తుందన్న కేంద్ర ప్రభుత్వ హామీలు ఉంటున్నా దాని ప్రభావం ఎంతవరకు పనిచేస్తుందో ప్రశ్నార్థకం. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల్లో ప్రస్తుతం ఉంటున్న భారతీయుల్లో కేవలం 10 నుంచి 12 శాతం మంది మాత్రమే స్వదేశం భారత్‌కు తిరిగి వస్తున్నారని ఇజ్రాయెల్ లోని ప్రవాస భారతీయ ప్రతినిధులు చెబుతున్నారు.

ఇజ్రాయెల్‌లో 15,000 మంది భారతీయులు ఆరోగ్య సంరక్షకులుగా ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో చాలామంది తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు చెందినవారే. ఇజ్రాయెల్‌లో తెలంగాణ ఆరోగ్య సంరక్షకులు నెలకు రూ. 1,50,000 వరకు సంపాదిస్తున్నారు. ఆహారం, వసతి తదితర సౌకర్యాలు వీరికి ఉచితంగా లభిస్తున్నాయి. ఇటువంటి సౌకర్యాలు స్వదేశం భారత్‌లో తమకు లభిస్తాయా? అన్న ప్రశ్న ఎదురవుతోంది. ‘సంఘర్షణ అన్నది తమకు కొత్తేమీ కాదు. హమాస్, హెజ్బొల్లా, హౌతీస్ ఇలా ఎన్నో ఉగ్రవాద గ్రూపుల నుంచి నిత్యం తమకు సంఘర్షణలు ఎదురవుతూనే ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ ఐరన్‌డ్రోమ్ మమ్మల్ని నిత్యం రక్షిస్తోంది. స్కూళ్లు, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్, అపార్టుమెంట్లు ఇలా ప్రతిచోట భూగర్భ బంకర్లు ఉన్నాయి. అందువల్ల మా భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదు’ అన్న నమ్మకం ప్రవాస భారతీయుల్లో కనిపిస్తోంది.

ఇక విద్యార్థుల చదువుల విషయానికొస్తే ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల్లో చదువులకయ్యే ఖర్చు భారత్‌తో పోలిస్తే చాలా తక్కువ. ఒక్క ఇరాన్‌లోనే 4000 మంది భారతీయ విద్యార్థులు చదువుకొంటున్నారు. వీరిలో సగానికి సగం మంది కశ్మీర్ విద్యార్థులే. భారత్‌లో ఎంబిబిఎస్ సీటు ప్రైవేట్ కాలేజీల్లో సంపాదించాలంటే రూ. కోటి వరకు ఖర్చు పెట్టవలసివస్తుంది. అదే ఇరాన్‌లో మొత్తం ఎంబిబిఎస్ కోర్సుకు రూ. 30 లక్షలు మాత్రమే ఖర్చవుతుంది. దీనికి కారణం ఇరాన్‌లో యూనివర్శిటీలకు అక్కడి ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తోంది.2023 లో భారత్ ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం ఫలితంగా నిర్మాణ రంగం, నర్సింగ్‌ల్లో భారత కార్మికుల కోటా పెరిగింది. నెలవారీ వేతనాలు రూ. లక్ష దాటాయి. దీనికి తోడు వైద్య బీమా వంటి సౌకర్యాలు లభిస్తున్నాయి. ఇటువంటి ప్రయోజనాలు భారత్‌లో లభిస్తాయని ఊహించడం కష్టమే.

ఇదిలా ఉండగా యుద్ధం జరిగే ప్రాంతాల్లో ఉద్యోగాలు, వృత్తులు చేయడం ప్రాణాలతో చెలగాటం. కానీ దీనికి ప్రవాసీయులు భయపడడం లేదు. పైగా యుద్ధం జరిగే చోట పనులు చేస్తే తమకు ఎక్కువ ఆదాయం లభిస్తుందని చెబుతున్నారు. స్వదేశంలో లభించే ఆదాయం కన్నా ఏడాదిలో ఐదు రెట్లు ఆదాయం సంపాదించవచ్చని అంటున్నారు. యుద్ధాల బాధితులమని వారు ఆవేదన చెందడం లేదు. అలా తమను గుర్తించవద్దని స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి ప్రవాస భారతీయుల్లో అనేక మంది ఆర్థికంగా, సామాజికంగా బాగా వెనుకబడిన వారే కావడం గమనార్హం. స్వదేశంలో తమకు తగిన వేతనాలు ఎక్కువగా లభిస్తాయన్న ఆశ వారిలో కలగడం లేదు. అందుకే ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధోన్మాద దేశాలైనప్పటికీ, తమ బతుకులకు ఆసరా కల్పించే దేశాలన్న నమ్మకం వారిలో కనిపిస్తోంది.

ఇక భారతీయులను తరలించే రిస్కు ఆపరేషన్లు కూడా వారికి కొత్తేమీ కాదు. 2023 ఏప్రిల్ మే నెలల్లో 3000 మంది కన్నా ఎక్కువ మంది భారతీయులు సూడాన్ నుంచి ఆపరేషన్ కావేరీ ద్వారా విమానాల్లో భారత్‌కు తరలి వచ్చారు. అంతకు ముందు 1990లో మొదటి గల్ఫ్ యుద్ధంలో భారతీయులను తరలించడం జరిగింది. 2015 లో యెమెన్ నుంచి ఆపరేషన్ రాహత్ పేరున, అలాగే 2022లో ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరులను తరలించే ప్రయత్నాలు జరిగాయి. యుద్ధభూముల్లో వ్యక్తిగత భద్రత కన్నా ఆర్థిక భద్రత, కుటుంబ సంక్షేమం ప్రాధాన్యాలుగా ఉంటున్నాయి. పొరుగున ఉన్న గాజాలో యుద్ధ భయానక సంఘటనలు, పౌరుల మరణాలు, విధ్వంసాలు ఎక్కువగా సాగుతున్నప్పటికీ, అవేవీ వీరు పట్టించుకోవడం లేదు. యుద్ధవ్యూహాల కన్నా మనుగడ వ్యూహాలే ముఖ్యం అన్న లక్షం వీరిని యుద్ధభయం లేకుండా ముందుకు నడిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News