రైల్వే ట్రాక్ పై కారుతో దూసుకొచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి.
ఆగిన రైళ్లు..తప్పిన ప్రమాదం
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి రైల్వే స్టేషన్ పరిధిలో సంచలనంగా మారిన ఘటన
మన తెలంగాణ/శంకర్ పల్లి: రైళ్లు రయ్యి మని దూసుకెళ్లే పట్టాలపై కారుతో వెళ్తూ కలకలం సృస్థించింది ఓ మహిళ. దాంతో నిత్యం ఉదయం సమయంలో రద్దీగా ఉండే ట్రైన్ ల రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సినిమాలలో మాత్రమే కనిపించే ఈ దృశ్యాలు నిజం చేసింది ఆ మహిళ….రీల్స్ పిచ్చో, మతిస్థిమితం లేకనో, ఏదైనా మాదక ద్రవ్యాల ప్రభావంతో చేసిందో కానీ ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే… శంకర్ పల్లి మండలం కొండకల్ రైల్వే గేటు నుండి ఓ మహిళ తన కీయా కారుతో పట్టాలపైకి దూసుకొచ్చింది. కొండకల్ గేటు వయా చిన్న శంకర్ పల్లి గేటుల మీదుగా శంకర్ పల్లి స్టేషన్ వైపుకు దూసుకువస్తుండగా స్థానికులు అపటానికి ప్రయత్నిస్తే ఖాతరు చేయలేదు..కారు వల్ల రైళ్లు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. రైళ్లోని ప్రయాణికులు, స్థానిక ప్రజలు ఎట్టకేలకు అమెను పట్టుకొని, కారును పక్కకు తోసేశారు. ఈ కారుకు నెంబర్ ప్లేట్ కూడా పెట్టుకోలేదు. ఆమె తన వద్ద ఉన్న నాన్ ఛాక్ తో వీరిపై దాడికి ప్రయత్నించింది. ఆ మహిళ చేతులను కట్టేసి ప్రజలు పోలీసులకు సమాచారం అందించగా, శంకర్ పల్లి పోలీసులు, రైల్వే పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. కారును శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించగా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందినట్లు భావిస్తున్న ఆ యువతిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. సుమారు 8 కిలోమీటర్లు ఆమె ఈ ట్రాక్ పై కారు నడిపింది.
సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఊడటం….భర్తతో వేరుగా ఉంటూ….
లక్నో కు చెందిన ఒమిక సోనీ క్యాప్ జెమిని లో ఉద్యోగం చేస్తూ పుప్పాల్ గూడ లో విల్లాలో నివాసం ఉంటుంది…లక్ష 50 వేల జీతంతో చేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఉండటంతో పాటు భర్తకు దూరంగా ఒంటరిగా ఉండటంతో మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తుంది. గత రెండు నెలలుగా లక్నో లోని పేరెంట్స్ తో కూడా మాట్లాడటం లేదని తెలుస్తోంది. దాంతో రింగ్ రోడ్డు మీదుగా కొండకల్ రేడియల్ రోడ్డులో వచ్చి కొండకల్ రైల్వే గేటు వద్ద కారును పట్టాలపైకి ఎక్కించి శంకర్ పల్లి వైపుకు దూసుకుపోయింది.
ఆత్మహత్య ప్రయత్నమా….మానసిక ఒత్తిడిలోన….మత్హు పదార్థాలకు బానిస?
ఉద్యోగం ఉడటం, భర్తకు దూరంగా ఒంటరి జీవితంతో విరక్తి చెంది ఆత్మహత్యకు ప్రయత్నించిందా లేక మానసిక డిప్రెషన్ తో ఇలా చేసిందా అనేది పోలీసుల విచారణలో తేలనుంది.గత రెండు మాసాలుగా తల్లిదండ్రులతో పాటు సన్నిహితులు, బంధువులు ఎవరోతోను మాట్లాడటం లేదని విచారణలోతెలిసింది.ఈ సందర్భంగా ఆమె ఏమైనా డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు తీసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు ఆమెకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
నిలిచిన రైళ్లు….తప్పిన ప్రమాదం.
ఈ సంఘటనతో శంకర్ పల్లి నుండి హైదరాబాద్ వైపు వెళ్లాల్సిన రైళ్లను శంకర్ పల్లిలో,హైదరాబాద్ నుండి శంకర్ పల్లి వైపు కు రావాల్సిన రైళ్లను నాగుల పల్లి స్టేషన్ వద్ద నిలిపివేశారు. చిత్తాపూర్-సికింద్రాబాద్ డెమో, బీదర్ -హైదరాబాద్ ఇంటర్ సిటీ,మరో గూడ్స్ రైళ్లు శంకర్ పల్లిలో,రేపల్లె-వికారాబాద్,హైదరాబాద్-పూర్ణ రైళ్లను నాగుల పల్లిలో నిలిపివేశారు.స్థానికులు,ప్రజల అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పిందని భావించవచ్చు.ఒక వేల ఆ సమయంలో ఏవైనా రైలు వస్తే కారుతో పాటు ఒక్కోసారి రైలు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది…దాంతో పెను ప్రమాదం తప్పిందని పలువురు పేర్కొంటున్నారు.
సోషల్ మీడియా ను షేక్ చేసిన పట్టాలపై కారు వీడియోలు
గురువారం ఉదయం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంభందించిన వీడియోలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి..కొందరు రైలు ప్రయాణికుల తో పాటు కొండకల్,చిన్న శంకర్ పల్లి రైల్వే గేటుల వద్ద తీసిన వీడియోలు,ఫోటోలు వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రపంచానికి తెలిసేలా చేశాయి. దాంతో ఒక్కసారిగా ఈ సంఘటన జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అయ్యింది…. దానికి కొందరు రకరకాలుగా స్పందించారు. సినిమా షూటింగ్ కోసమా…. రీల్స్ చేసారా అంటూ కొందరు స్పందిస్తే మరికొందరు మీరు కారు కొనాలి అనుకుంటున్నారా అయితే రోడ్డుపైనే కాదు రైల్వే ట్రాక్ పైన కూడా దూసుకెళ్లే కీయా కారును కొనండి అంటూ పోస్టులు పెట్టారు.