హైదరాబాద్: స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ దుర్వినియోగం, అక్రమ రవాణాపై అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవం 2025 సందర్భంగా గురువారం నగరంలోని శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హీరోలు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, దిల్ రాజు, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ.. “తెలంగాణ అంటే ఉద్యమాలు, పోరాటాల గడ్డ. ఉద్యమాల గడ్డ డ్రగ్స్కు అడ్డాగా మారితే అవమానకరం. పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు విద్యార్థులపై డ్రగ్స్ ప్రభావం పడింది. యువత గంజాయి, డ్రగ్స్కు బానిసలైతే దేశం మనుగడకే ప్రమాదం” అని అన్నారు.
రాష్ట్రంలోని పలు కాళాశాలలు, పాఠశాలల ముందు ఉండే కిరాణా షాపుల్లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారని… స్కూళ్లు, కాలేజీల్లో అసాంఘిక కార్యక్రమాలు జరిగితే యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని సిఎం చెప్పారు. ఏ స్కూల్, కాలేజీలో డ్రగ్స్, గంజాయి దొరికినా.. యాజమాన్యంపైనా కేసులు పెడతామని, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫీజులు తీసుకోవడమే కాదు.. విద్యార్థులు ఏం చేస్తున్నారో చూసే బాధ్యత కూడా మీదేనని సిఎం రేవంత్ అన్నారు.