ఐఎస్ఎస్కు చేరిన తొలి భారతీయుడిగా
రికార్డు శుభాంశు బృందానికి ఛీర్స్తో స్వాగతం
విజయవంతంగా డ్రాగన్ వ్యోమ నౌక డాకింగ్
ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన నలుగురు వ్యోమగాములు
14రోజుల పాటు కీలక ప్రయోగాలు చేయనున్న
శుభాంశు నాసా, ఇస్రో సంయుక్తంగా నిర్వహణ
న్యూఢిల్లీ : భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా మరో ముగ్గురు సహచరులతో కలిసి గురువారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోపలికి ప్రవేశించారు. ఈ వ్యోమగాములతో కూడిన అక్సియోమా 4 మిషన్ సంబంధిత వ్యోమనౌక అంతరిక్షంలోని పరిశోధనా కేంద్రంతో అనుసంధానం అయింది. దీనిని డాకింగ్ ప్రక్రియగా పిలుస్తారు. ఈ డాకింగ్ విజయవంతం కావడంతో అంతరిక్ష పరిశోధనలకు వెళ్లిన తొట్టతొలి భారతీయుడి ఘనత శుక్లా దక్కించుకున్నారు. ఇప్పుడు ఐఎస్ఎస్లో కి చేరుకున్న బృందం అక్కడ 14 రోజుల పాటు ఉంటుంది. పలు పరిశోధనలు నిర్వహిస్తుంది. ఇప్పటికే ఐఎస్ఎస్లో ఉన్న సిబ్బంది నుంచి ఇప్పు డు డాకింగ్ ద్వారా వచ్చిన బృందానికి సాదర స్వాగతం దక్కింది.
లోపలి టీం ఇప్పుడు వచ్చిన వారిని కౌగిలించుకోవడం, ముద్దుపెట్టుకోవడం, డ్రింక్స్ అందించడం వంటి సంబరాలు సాగాయి. అమెరికాలోని కెన్నెడి అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బయలుదేరిన వ్యోమనౌక డాకింగ్కు సంబంధించిన సాంకేతిక ప్రక్రియ భారతీయ కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 5.44 గంటలకు ముగిసింది. ఇది విజయవంతం అయింది. ముందుగా వ్యోమనౌక నుంచి మిషన్ కమాండర్ పెగ్గి విట్సన్ లోనికి ప్రవేశించారు.
ఆమె శూన్య స్థితిలో స్టేషన్లోకి చేరారు. తరువాత ఇదే ప్రక్రియలో భాగంగా మిషన్ పైలట్ శుక్లా ఆ తరువాత పోలండ్ ఇంజనీరు స్లావోజ్ , యూరోపియన్ స్పేస్ స్పెషలిస్టు ఉజననస్కి వరుసగా లోపలికి చేరారు. తాము ఇక్కడికి చేరుకోవడం ఆనందంగా ఉందని , తాము ఇప్పుడు ఎక్కువ కాలం క్వారంటీతో ఉంటామని విట్స్మెన్ తెలిపారు. ఆమెకు ఇది ఐదవ అంతరిక్ష యాత్ర. ఈ నలుగురు వ్యోమగాములు హుస్టన్లోని నాసా కంట్రోల్ రూం బృందానికి విజయ సంకేతాలు వెలువరించారు. ఈ నౌక డాకింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో సాయంత్రం విజయవంతం అయిందని నాసా వర్గాలు ప్రకటన వెలువరించాయి. ఇది నాలుగవ ప్రైవేటు వ్యోమగామి ప్రయాణం అని తెలిపారు. ఇప్పుడు అంతరిక్ష కక్షలో పరిభ్రమిస్తున్ననౌకకు ఇప్పటి నౌక అనుసంధానం ఇక భావి పరిశోధనల క్రమానికి కీలక మలుపు అని ప్రకటనలో తెలిపారు. భారతీయ వ్యక్తి ఒక్కరు ఈ విశేష ఘట్టంలో చేరడం భారత్కు ప్రత్యేకత తీసుకువచ్చింది. నాసా అధికారికంగా ఈ డాకింగ్ దృశ్యాల వీడియోలింక్ను వెలువరించింది. అంతా సజావుగా సాగింది. అంతరిక్ష నౌకకు ఈ వ్యోమనౌక చేరుకోవడం నిర్థిష్ట రీతిలో జరిగింది.
భారత్లో మరో మారు సంబరాల హోరు
భారత్ మాతాకీ జై నినాదాలు ..లక్నోలో కళకళ
అంతరిక్ష కేంద్రంలోకి భారతీయుడు, లక్నోవాలా శుభాంశు శుక్లా చేరుకున్న దశలో లక్నో ఇతర ప్రాంతాలలో గురువారంపండగ వాతావరణం నెలకొంది. లక్నోలో జనం ప్రత్యేక ఏర్పాట్ల మధ్య ఈ డాకింగ్ ప్రక్రియను టీవీ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా తిలకించారు. పలు ప్రాంతాల్లో శుక్లాకు అభినందనలు వెల్లువెత్తాయి. భారత్ మాతాకీ జై, ఇండియా ఇండియా, హిప్హిప్ హుర్రే అనే కేరింతలు మార్మోగాయి. శుక్లా తల్లిదండ్రులు చేతిలో త్రివర్ణపతాకం పట్టుకుని తమ హర్షం వ్యక్తం చేశారు. కుమారుడి అంతరిక్ష విజయాన్ని లైవ్లో తిలకించారు. డాకింగ్ పూర్తి అయింది. ఇప్పుడు వారు ఐఎస్ఎస్కు చేరారు. ఇప్పుడు మనం చంద్రుడి మీదున్నామని శుభాంశు సోదరి సుచి మిశ్రా స్పందించారు. లక్నోలోని వరల్డ్ యూనిటీ కన్వెన్షన్ సెంటర్లో గురువారం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డాకింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా అంతా చూసేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి.