హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు న్యాయం జరిగేలా స్పోరట్స్ రిజర్వేషన్ జీఓ 74ను సవరించాలని, ఫారమ్ 1-4 తొలగించి అదే స్థానంలో 1-90 ప్రాధాన్య క్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరిని వ్యాయాయ విద్య ఉపాధ్యాయుల సంఘం (పెటా టిఎస్) కోరింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నగాని కృష్ణమూర్తి గౌడ్ సహా నల్లగొండ, హైదరాబాద్ జిల్లాల అధ్యక్షులు చంద్రయ్య, కట్ట శ్రీనివాస్లు గురువారం సచివాలయంలోని కార్యాలయంలో స్పోరట్స్ మినిస్టర్ను కలిసి వినతి పత్రం అందించారు.
’స్పోరట్స్ రిజర్వేషన్ జీవో 74 ప్రకారం క్రీడాకారులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. జీవో 74ను సవరించి 1-90 ప్రాధాన్యతల ప్రకారం ఉద్యోగాలను కల్పించాలి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 1700 స్కూల్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ పోస్టులు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2447 పీఈటీ పోస్టులు మంజూరు చేయాలి. స్పోర్ట్ రిజర్వేషన్ను 2 శాతం నుంచి 5 శాతానికి పెంచాలని’ మంత్రికి పెటా టిఎస్ నాయకులు విన్నవించారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా నూతన క్రీడా విధానం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పట్ల మంత్రి వాకిటి శ్రీహరికి పెటా టిఎస్ తరఫున ధన్యవాదాలు తెలిపారు. వ్యాయామ విద్య ఉపాధ్యాయులు ప్రకాశ్, రాజేందర్, విక్రమ్, శక్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.