Friday, June 27, 2025

కార్పొరేట్ విషవలయంలో విద్య, వైద్యం

- Advertisement -
- Advertisement -

కేంద్ర-, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల విద్య -వైద్య సంస్థలను నిర్వహిస్తున్నాయి. వాటి నిర్వహణకు సరిపడా నిధులు మాత్రం కేటాయించడం లేదు. అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూన్నాయి. భారతదేశంలో పథకాలకు కొదువ లేదు, పైసలకు కొరత లేదు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుస్త్తున్నారు. ప్రధాన మంత్రులు, ముఖ్య మంత్రులు మారుతున్నారు. కాని ప్రజల జీవితాలు మాత్రం మారడం లేదు. స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినప్పటికీ సగటు భారతీయుని ప్రాథమిక హక్కులైన కూడు-, గూడు-, గుడ్డతోపాటు విద్య-, వైద్యం-, ఆరోగ్యం సమకూర్చడంలో కేంద్ర-, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశ పూరిత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్నాయి.

సమగ్ర విద్య వైద్య- ఆరోగ్య విధానాన్ని రూపొందించడంలోను, అమలు చేయడంలోను పూర్తిగా విఫలం చెందాయి. పూర్తి నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. ఓట్లు దండుకోవడంలో, సీట్లు దక్కించుకోవడంలో కనబరిచిన శ్రద్ధాసక్తులలో పది శాతం కలిగి వున్నా ‘అక్షర భారత్ ఆరోగ్య భారత్’ (Akshara Bharat, Healthy Bharat’) నిర్మాణం జరిగి ఉండేది. దీని పర్యవసానమే విద్య -వైద్య రంగాలలో ప్రైవేటీకరణ,- కార్పొరేటీకరణ ప్రబలంగా పెరిగి పోయింది. విద్య వైద్య రంగంలో కార్పొరేట్ విషపోకడలు మొత్తం మానవాళి మనుగడకే ప్రమాదకరంగా పరిణమించాయి. సమస్యల సాలెగూళ్ళలో చిక్కి ప్రభుత్వ విద్య- వైద్య సంస్థలు ప్రజాదరణ కోల్పోతున్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెపుతున్న ప్రభుత్వాలు విద్య- వైద్య సంస్థల్లో నేటికీ కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేదు. కమిటీలు, కమిషన్లు వేస్తూ కడుపు నింపని సంక్షేమ పథకాలతో కాలయాపన చేస్తూ మీనమేషాలు లెక్కపెడుతున్నాయి. చిత్తశుద్ధి లోపించిన ప్రభుత్వాల పనితీరు ప్రజల పాలిటి శాపంగా మారింది.

లక్షలాది మంది విద్యార్థినీ, విద్యార్థులు పోషక ఆహార లోపం, రక్తహీనత, కంటి, దంత, మూత్ర సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. సమాజ మనుగడకు విద్య, -వైద్యం,- ఆరోగ్యం అతి ప్రధానమైనవి. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడం ప్రజాస్వామిక ప్రభుత్వాల ప్రధాన లక్షణం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గొప్పలు చెప్పుకుంటున్న భారత పాలక వర్గాలు ఆచరణలో దానికి భిన్నమైన వైఖరిని కలిగి వున్నాయి. భారత దేశంలో భూస్వాములు,- పెట్టుబడిదారులు ప్రైవేట్- కార్పొరేట్ శక్తులుగా ఎదిగి పాలక వర్గాలుగా అవతరించాయి. కేంద్ర-, రాష్ట్ర ప్రభుత్వాలు పాలక వర్గ ప్రయోజనాలే ప్రథమ కర్తవ్యంగా అంతర్గత ఎజెండాను అమలు చేస్తున్నాయి. ప్రభుత్వ అనుమతితోనే విద్య- వైద్య రంగాల్లో కార్పొరేటీకరణ విష ఫలాలనందించే వటవృక్షంగా పెరిగిపోయింది. కార్పొరేట్ యాజమాన్యాలు ప్రభుత్వ పాలక వర్గంలో కీలక భాగమై కూర్చున్నాయి. విధానాల రూపకల్పనలో, అమలులో చక్రం తిప్పుతున్నాయి.

ఈ వర్గాలే సేవా రంగాలైన విద్య- వైద్య రంగాలను అత్యంత లాభసాటి వ్యాపారంగా మార్చాయి. ఈ వర్గాలే ప్రజలను కార్పొరేట్ రాజకీయాల వైపు మళ్లిస్తూ ఎన్నికల ప్రక్రియను, ప్రభుత్వాలను శాసిస్తున్నాయి. కార్పొరేట్ యాజమాన్యాలు విద్యార్థులను, ఉపాధ్యాయులను, డాక్టర్లను కీలుబొమ్మల్లాగా మార్చుకున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ విద్య- వైద్య సంస్థలమధ్య నెలకొన్న తీవ్రమైన అనారోగ్యకరమైన పోటీ కారణంగా స్వార్థం, అవినీతి అక్రమాలతో కూడిన తప్పుడు విధానాలకు పూనుకుంటున్నాయి. పారిశుధ్యం, తాగునీరు, మూత్ర శాలలు, భోజన శాలలు, వంట శాలలు, పక్కా భవనాలు, ప్రహారి నిర్మాణాలు, మురుగు కాల్వలు, ఈగలు, దోమలు, శిధిలావస్థలో వున్న భవనాలు, విద్యుత్, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఫర్నీచర్, వైద్య పరికరాలు, మందులు తదితర మౌలిక వసతులు, సదుపాయాలు లేక ప్రభుత్వ విద్య- వైద్య సంస్థలు ఆదరణ కోల్పోతున్నాయి.

వీటికి తోడు అరకొర నిధుల కేటాయింపు, సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపం, అవినీతి, నిర్లక్ష్యం తదితర ప్రధాన సమస్యలు ప్రభుత్వ విద్య- వైద్య సంస్థలను నిత్యం పట్టిపీడిస్తున్నాయి. సమస్యల వలయంలో చిక్కిన ప్రభుత్వ విద్య- వైద్య సంస్థలు ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోయాయి. ఒకప్పుడు విదేశీయులు, దోపిడీ దొంగల బీభత్సంతో ప్రజలు అభద్రత భావంతో బతికేవారు. నేడు విద్య వైద్యం అందక జీవితంపై భయంతో, బెంగతో, అభద్రతా భావంతో జీవనం సాగిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన 78 ఏండ్లుగా పాలక వర్గాల మోసపూరిత, కుట్ర బుద్ధితో విద్య-, వైద్య-, ఆరోగ్య, ఉపాధి అవకాశాలు సామాన్య ప్రజలకు అందకుండా పోయాయి. వలసలు, అప్పులు, ఆకలి చావులు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆకలి చావులైనా, ఆత్మహత్యలైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలి.

నేడు దేశంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలు, కుల వృత్తిదారుల ఆత్మహత్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల మూలంగానే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్వార్థపూరిత అనాలోచిత నిర్ణయాలు-, నిర్లక్ష్యాల మూలాలే నేటి ఆత్మహత్యలకు కారణాలు. ప్రజాద్రోహులు, పెట్టుబడిదారులు, కార్పొరేట్‌శక్తులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మమేకమవుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరం. ప్రజలకు ఉపకరించే ప్రభుత్వ పథకాలను, లక్ష్యాలను నిర్వీర్యం చేస్తూ తమ వర్గ ప్రయోజనాలు కాపాడుకునే ప్రయత్నంలో భాగమే ఈ శక్తుల కలయిక.

భారతదేశ ప్రజలు విజయానికి, విజయం తాలూకు ఫలాలను ఆస్వాదించడానికి మధ్య ఉన్న సంధికాలంలో ఉన్నారు. ప్రజల నోటి కాడి ముద్దను దళారులు గుంజుకునేందుకు ప్రభుత్వ విధానాలే దోహదం చేస్త్తున్నాయి. ప్రజాద్రోహులు, -రాజకీయ దళారులు ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తున్నారు. విద్య-, వైద్యం-, ఉపాధి మొదలైన మౌలిక రంగాలలో విధానాలు రూపొందించడం,- అమలుపర్చడంలో ప్రజలు మరింత చైతన్యవంతమైన పోరాట స్ఫూర్తిని కలిగియుండాలి. విద్య వైద్య రంగాలలో కార్పొరేటీకరణ మానవజాతి మనుగడకే సమస్యగా తయారై ప్రజాజీవనానికి పెను సవాలుగా మారింది. ప్రజలందరికీ సమానమైన, నాణ్యమైన విద్య వైద్యం అందాలంటే వీటిని జాతీయీకరణ చేయడమే ఏకైక పరిష్కారం. విద్య- వైద్యం జాతీయీకరణ జరిగేంతవరకు, దోపిడీ, పీడన ఆగేంతవరకు అలుపెరగని పోరాటం చేయడమే ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం.

  • విశ్వ జంపాల
    77939 68907
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News