యుద్ధ విరమణలు ఎవరివల్ల జరిగినా, ఎందుకు జరిగినా యథాతథంగా సంతోషించదగ్గవే. ప్రపంచం అభివృద్ధి, నాగరికత, ప్రజాస్వామ్య యుగంలోకి ప్రవేశించిందని చెప్పుకున్న తర్వాత జరిగిన యుద్ధాలు తక్కువ కాదు. వాటిలో అక్షరాలా కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. లెక్కకు అందనన్ని సంపదలు ధ్వంసమయాయి. ఇప్పటికీ జరుగుతున్నది ఇదంతా. ఈ పరిస్థితులకు ఏకైక కారణం పాలకుల స్వార్థ ప్రయోజనాలు తప్ప అందులో ప్రజల ప్రమేయాలు లేవు. పాలకుల స్వార్థ చర్యలకు ప్రజలు బలవుతున్నారు. అందువల్ల, యుద్ధ విరమణలు ఎందుకు జరిగినా, ఆ కారణంగా పాలకులకు కలిగే లాభనష్టాలు ఎట్లున్నా, ప్రజలు కొంత ఊపిరి తీసుకోగలరు. పశ్చిమాసియా ప్రస్తుత యుద్ధం కూడా అటువంటిదే. ఈ నెల 13వ తేదీన ఇరాన్పై ఇజ్రాయెల్ ఆకస్మిక దాడితో మొదలైన యుద్ధం, 21వ తేదీన ఇరాన్ అణు పరిశోధనా కేంద్రాలపై అమెరికా అంతే ఆకస్మికంగా దాడి చేయటంతో ముగిసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినట్లు ఇది ‘శాశ్వతమైన’ విరమణా? ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ‘ఇక ఎప్పటికీ’ తిరిగి యుద్ధం జరగబోదా? (going another war) అనే విషయాలు ఎట్లున్నా, ప్రస్తుతానికి మాత్రం తగినంత కాలం వరకు యుద్ధ విరమణ జరిగినట్లేనని భావించవచ్చు. ఈ ప్రభావం పశ్చిమాసియాపైనే కాకుండా ప్రపంచమంతటా ఉంటుంది. అక్కడి నుండి అంతటికీ రవాణా అయ్యే చమురు ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఇది ఆర్థిక సంబంధమైన అంశం కాగా, ఈ యుద్ధం ప్రభావాలు పాశ్చాత్య ప్రపంచంతో పాటు, గ్లోబల్ సౌత్ అని పిలిచే తక్కిన దేశాలపై కూడా రాజకీయంగా, వ్యూహాత్మకంగా చాలా ఉన్నాయి. ఈ యుద్ధ విరమణ జరిగినప్పటికీ, పాలస్తీనాతో, పశ్చిమాసియాలో అమెరికన్ కూటమి సామ్రాజ్యవాద మంత్రాంగాలతో ముడిబడిన అంశాలు యథాతథంగా కొనసాగుతాయి. గనుక, యుద్ధానికి ముందు నుంచి ఉండిన సమస్యలు మునుముందు కూడా ఉంటాయి.
అవి ముగిసేది ఎప్పుడో, ఆ ప్రాంతంలో నిజమైన శాశ్వత శాంతి సిద్ధించేది ఎన్నటికో ఎవరూ చెప్పజాలరు. ఆ ప్రాంతం సామ్రాజ్యవాదానికి వనరుల రీత్యానే గాక, భౌగోళిక వ్యూహాల కోసం కూడా అతి ముఖ్యమైనదని తెలిసిందే. ఆ వివరాలలోకి ఇక్కడ వెళ్లనక్కరలేదు గాని, దశాబ్దాలుగా కొనసాగుతూ అనేక యుద్ధాలకు కారణమైన ఆ పరిస్థితులు మునుముందు కూడా కొనసాగనున్నాయని గుర్తించటం మాత్రం అవసరం. ఆ దృష్టా ప్రస్తుత యుద్ధ విరమణ తాత్కాలికమైనది మాత్రమే. ప్రస్తుతానికి వస్తే, అమెరికా బంకర్ బస్టర్ల ప్రయోగం, కాల్పుల విరమణ దరిమిలా కొన్ని ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. ట్రంప్ ప్రకటించినట్లు ఫోర్దో, నతాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలు నిజంగానే ‘పూర్తిగా’ ధ్వంసమైపోయాయా? లేక తగినంత సష్టం మాత్రమే జరిగిందా? అమెరికా కన్న ముందు కొద్ది రోజులలో ఇజ్రాయెల్ అవే కేంద్రాలపై దాడులు జరపటానికి కన్నా ముందే ఇరాన్ అక్కడి నుండి తరలించి వేసిన 409 కిలోల శుద్ధి చేసిన యురేనియం పరిస్థితి ఏమిటి? తరలించినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించినందున ఇది ఊహాగానపు ప్రశ్న కాదు.
యుద్ధ విరమణ విషయమై రెండు దేశాలతో ట్రంప్ అధికారులు జరిపిన సంప్రదింపులు, విరమణ నియమని బంధనలు ఏమిటి? వాటిలో ఈ శుద్ధి చేసిన ఇంధనం ప్రస్తావన గాని, అంతకన్న ప్రధానంగా ఇరాన్కు గల అణు పరిశోధనల హక్కు మాట అయినా ఉన్నాయా? ఈ వివరాలేవీ తెలియనంత కాలం మనకు పరిస్థితిపై ఎటువంటి స్పష్టత రాదు.బంకర్ బస్టర్ దాడులు 21న జరిగి ఈ వ్యాసం రాసే సమయానికి నాలుగు రోజుల గడిచాయి. ఈ దాడులతో ఆయా కేంద్రాలు ‘పూర్తిగా’ ధ్వంసమైనట్లు అమెరికా అధ్యక్షుడు వెంటనే ప్రకటించారు గాని తర్వాత ఇప్పటి వరకు స్వయంగా అమెరికన్ ఇంటెలిజెన్స్, రక్షణ శాఖ సంస్థలు గాని, నిపుణులు గాని ఆ మాటను ధ్రువీకరించటం లేదు. ఉపరితల నిర్మాణాలకు, పర్వతాలకు గణనీయమైన నష్టం మాట నిజం.
కాని భూగర్భంలో చాలా లోతున గల ‘ఎన్రిచ్మెంట్ హాల్స్’గా చెప్పే శుద్ధి విభాగాలను ఆ భీకరమైన బాంబులు చేరలేకపోయాయన్నది కనీసం ఇంతవరకు వినవస్తున్న అభిప్రాయాలు. అమెరికా రక్షణ శాఖ తన తొలి నివేదికలో, పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉందని అంటూనే, ప్రస్తుత అంచనాలు ట్రంప్ ప్రకటనకు భిన్నంగా ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ వార్తను సిఎన్ఎన్ ప్రసారం చేయటంతో ఆగ్రహించిన ట్రంప్ ఆ వార్తా సంస్థను బహిరంగంగా దూషించటం ఛానళ్లలో కనిపించిందే.అంతేకాదు, ఇరాన్ అణ్వస్త్రాల తయారీకి ‘చాలా దూరంలో’ ఉందన్న తమ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ మాటను కొట్టివేసిన విధంగానే, ఇప్పుడు బంకర్ బస్టర్ ప్రభావాల నివేదికను కూడా తప్పన్నారు. మొత్తానికి దీనిని బట్టి ఇరాన్గాని, ఇతరులు గాని, బస్టర్లకు సంబంధించి ఇక ముందు తగు జాగ్రత్తలు తీసుకోవచ్చునన్న మాట. బంకర్ బస్టర్ల గురించి చాలా చర్చ జరుగుతూ వస్తున్నది.
ఆ కేంద్రాలను తన స్థాయిలో ఏమీ చేయలేనని తెలిసిన ఇజ్రాయెల్, అమెరికాను రంగంలోకి తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. 30 వేల పౌండ్ల శక్తి గల ఆ బాంబులు ఎంత లోతుకు వెళ్లగలవనే ప్రశ్నపై ఆ రోజుల్లో నిపుణులు పలు రకాల మోడలింగ్ లెక్కలతో అంచనాలు వేసారు. విశేషమేమంటే వారెవరూ ఈ బాంబర్లు ఇరాన్ భూగర్బ కేంద్రాలను ‘ఖచ్చితంగా, పూర్తిగా’ ధ్వంసం చేయగలవని నిర్ధారణగా చెప్పలేకపోయారు. అంతకన్న గమనార్హమైన ఒక రహస్యాన్ని గార్డియన్ పత్రిక వెల్లడి చేసింది. బంకర్ బస్టర్ల గురించిన చర్చ ట్రంప్ జనవరి 20న అధికారానికి రాగా ఆ తొలి రోజులలోనే ప్రభుత్వ స్థాయిలో జరిగిందట. అపుడు అమెరికా రక్షణ శాఖకు చెందిన ‘డిఫెన్స్ థ్రెట్ రాడక్షన్ ఏజెన్సీ’ సంస్థ ఇరాన్లోని ఫోర్దో కేంద్రాన్ని పూర్తిగా దెబ్బ తీయలేమని స్పష్టం చేసిందట. గార్డియన్ కథనాన్ని ప్రభుత్వం ఖండించలేదు.
దీనంతటిని బట్టి అర్ధమయేదేమిటి? ఇరాన్ తమ అణుకేంద్రాలను నిర్మించినపుడే చాలా ముందు చూపుతో, బంకర్ బస్టర్ల్ గురించి కూడా అవగాహనతో, తగు జాగ్రత్తలు తీసుకున్నదనుకోవాలి. తిరిగి అదే ముందుచూపుతో ప్రస్తుత యుద్ధం మొదలు కాగానే, బంకర్ బస్టర్ల కోసం అమెరికా వద్ద ఇజ్రాయెల్ లాబీయింగ్ను గమనించి, వెంటనే అక్కడి ఇంధనాన్ని రహస్య ప్రదేశాలకు తరలించిందన్న మాట. తరలించిన స్థావరాలు తమకు తెలుసునని ఇజ్రాయెల్ అంటుండగా, తామింకా కనుగొనలేకపోయినట్లు అమెరికా చెప్తున్నది. ఒకవేళ కనుగొంటే ఏమి చేయవచ్చునన్నది వేరే ప్రశ్న. మొత్తానికి బస్టర్లకు పరిమితులున్నాయి.
ఇదే విషయానికి సంబంధించి మరొక వైపు చూస్తే, ఇరాన్ అణు పరిశోధనలు ఇక ముగిసిపోయిన అధ్యాయమన్నది బంకర్ బస్టర్ దాడి అనంతరం అమెరికా అధ్యక్షుని మాట కాగా, అది తమ సార్వభౌమాధికార హక్కు అని, కొనసాగించగలమని ఇరాన్ వెంటనే స్పష్టం చేసింది. దీనితో విషయం తిరిగి మొదటికి వస్తున్నది. వాస్తవానికి అణువ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పిటి)లో భాగమై అంతర్జాతీయ అణుశక్థి సంస్థ (ఐఎఇఎ) పర్యవేక్షణలోగల దేశాలన్నింటికి శాంతియుత ఉపయోగాల కోసం అణు పరిశోధనలు జరిపే హక్కు ఉంది. ఆ నిబంధనను ఇరాన్ ఇంతవరకు ఉల్లంఘించలేదని ఐఎఇఎతో పాటు సాక్షాత్తూ అమెరికన్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ ఇటీవల ప్రకటించటం తెలిసిందే. అయినప్పటికీ ట్రంప్, నెతన్యాహూలు తమకు ఇతరత్రా గల ప్రయోజనాల కారణంగా, ‘కాదు కాదు ఇరాన్ అతి త్వరలో బాంబులు తయారు చేయనున్న’దంటూ హోరెత్తించారు.
నెతన్యాహూ అయితే ఈ మాట ఇరవై ఏళ్లుగా అంటున్నట్లు వేర్వేరు ఛానళ్లు ఎన్నో వీడియోలను చూపాయి. ఈ పరిస్థితులలో, ఇరాన్ ఇక తమ నియమాలను వదలి ఆత్మరక్షణ కోసం ఉత్తర కొరియా వలెనే అణ్వస్త్రాలు తయారు చేసుకోవాలన్న సూచనలు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ సూచనలు చేస్తున్న వారిలో పాశ్చాత్య దేశాలకు చెందిన ప్రజా స్వామిక మేధావులు, నిపుణులు, మాజీ సైన్యాధికారులు, దౌత్యవేత్తలు కూడా ఉండటం గమనించదగ్గది. నిరుడు ఇజ్రాయెల్తో ఘరణ జరిగినపుడు ఇరాన్లోనూ సైనిక వర్గాలు కొన్ని ఈ అభిప్రాయానికి వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనంతటి మధ్య ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ కొత్త ప్రశ్న ఒకటి లేవనెత్తుతున్నారు. తమను ఎన్పిటి, ఐఎఇఎ కాపాడలేకపోయినపుడు, తమ కేంద్రాలపై చట్టవిరుద్ధమైన దాడులను ఖండించనపుడు, తాము అందులో భాగస్వాములం ఎందుకు కావాలన్నది ఆయన సూటిప్రశ్న.
దీనిని సమాధానమివ్వని ఐఎఇఎ అధికారులు, యుద్ధాన్ని ఇంకా పెంచవద్దని, దాడులు చేసిన వారితో రాజీ చర్చలకు (అర్ధం లొంగుబాటు అని) కూర్చోవాలని హిత బోధలు చేస్తున్నారు. ఈ విషయంలో నెతన్యాహూకు, ట్రంప్కు, యూరోపియన్ యూనియన్కు, వారికి మధ్య తేడా లేకుండాపోయింది.ఐఎఇఎ మొదటినుంచి అమెరికా బందీ అన్నది తెలిసిన విషయమే. తాజా వార్తల ప్రకారం, తమ అణుకేంద్రాలకు రక్షణ కల్పించనంత వరకు తాము ఐఎఇఎతో సహకరించబోమని ఇరాన్ ప్రకటించింది.రాగల రోజులలో చర్చలు జరిగినట్లయితే అందులో భాగస్వాములెవరు, అజెండా ఏమి కాగలదన్నది ప్రశ్న. ఇంతకు ముందు అయిదు విడతల చర్చలు జరిగినపుడు ఇరాన్, అమెరికా మాత్రమే భాగస్వాములు. అజెండా విషయమై ట్రంప్ తన చంచల చిత్తానికి అనుగుణంగా రకరకాలుగా మాట్లాడారు.
అణ్వస్త్రాలు ఎంత మాత్రం చేయరాదనటంనుంచి మొదలుకొని అసలు ఎటువంటి పరిశోధనలకు వీలులేదనటం వరకు మాటలు మార్చుతూ, ఇరాన్ ‘బేషరతుగా’ లొంగిపోవాలనటం దాకా వెళ్లారు. ఈసారి ఏమనేదీ తెలియదు.అందువల్ల చర్చలకు ఇరాన్ అంగీకరిస్తూనే రెండు షరతులు విధించటం మంచిదవుతుంది. ఒకటి, చర్చలలో ఐఎఇఎ, రష్యా, చైనాలు కూడా భాగస్వాములు కావాలనటం. రెండు, ఐఎఇఎ పర్యవేక్షణకు లోబడి శాంతియుత ప్రయోజనాలు కోసం అణుపరిశోధనలు జరుపుకునే హక్కు తమకు పూర్తిగా ఉండాలని. ఆ మేరకు అందరి సంతకాలతో లిఖితపూర్వక ప్రకటన జరగాలి. తను ఆ సంతకం దారులకే జవాబుదారీ అవుతుంది తప్ప అమెరికాకో, మరెవరికో కాదు. అట్లాగే, ఇజ్రాయెల్ ఏదైనా చేయబూనితే సంతకం దారులంతా కలిసి దానిని నిలువరించాలి.
- టంకశాల అశోక్ ( దూరదృష్టి)
- ( రచయిత సీనియర్ సంపాదకులు)