Saturday, June 28, 2025

మత సామరస్యానికి ప్రతీక మొహర్రం

- Advertisement -
- Advertisement -

‘ఆ దినం మొహర్రం అనే ఆరంభమయినది. ఆ తొమ్మిదో దినం ఆ షహరుకు. కంచిక గరుడ సేవ ముఖ్యమైనట్టుగా ఆ మొహర్రం ప్రబలమైన యుత్సవం. ఆ యుత్సవ కాలంలో పరమాత్ముని చైతన్యం ఆ షహరులో నెక్కువగా ప్రకాశించుటచేత అనేక వేల మంది ఇతర మతస్థులు నుండే వారు కూడా షహరుకు వచ్చి ఆ తొమ్మిదో దినం మొదలు ఆఖరు వరకు నుంచున్నారు” అని బ్రిటిష్ పాలనలో చెన్నైలో సుప్రీం కోర్టులో పని చేస్తున్న ఉన్నతోద్యోగి ఏనుగుల వీరస్వామయ్య తన యాత్రా విశేషాలను పొందుపరిచిన పుస్తకంలో పేర్కొన్నారు. 1829 సంవత్సరంలో పల్లకిలో కాశీ యాత్ర చేస్తూ, రాసుకున్న ఏనుగుల వీరస్వామయ్య చరిత్ర నుంచి తీసుకున్న వాక్యాలివి. ఈ పుస్తకం 1838లో మొదటిసారిగా అచ్చయింది. ఆయన చెన్నై నగరం నుంచి బయలుదేరి రాయలసీమ, తెలంగాణ మీదుగా ఉత్తర భారతదేశం వెళ్లారు. ఇది చాలా ముఖ్యమైన పుస్తకం ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

ముస్లింల మొదటి నెల మొహర్రం. ఆ నెల మొదటి రోజు నుంచి పదవ తేదీ వరకు ముస్లింలలో ఒక వర్గమైన షియాలు సంతాప దినాలను పాటిస్తున్నారు. ఆ సందర్భంగానే అంటే 1830, 27 జూన్‌న వీరస్వామయ్య హైదరాబాద్ చేరుకున్నారు. ఆ రోజు తొమ్మిదో రోజు. అంటే మొహర్రం సంతాప దినాల చివరి రోజులు పదవ రోజుతో ఆ సంతాప దినాలు ముగుస్తాయి. ఆయన పేర్కొన్నట్టుగా హైదరాబాద్ చుట్టు పక్కల నుంచి వేలాది మంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు, అందులో హిందువులు, ఇతర ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఉన్నట్టు వీరస్వామయ్య గారు రాశారు. ఇప్పటికి ఈ సందర్భానికి 195 సంవత్సరాలు. మొహర్రం అనే ఒక మతపరమైన కార్యక్రమం తెలంగాణలో ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో ఒక పండుగ. అది పీర్ల పండుగ పేరుతో ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. కేవలం తెలంగాణలోనే కాదు, దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, కర్నాటక, మహారాష్ట్ర ఒకటేమిటి అన్ని రాష్ట్రాల్లో మొహర్రం పేరుతో పీర్ల పండుగ జరుపుకోవడం విశేషం.

ఇది కల్పిత గాథ ఆధారంగా జరుగుతున్న పండుగ కాదు. క్రీ.శ. 680 సంవత్సరంలో ఇప్పటి ఇరాక్‌లోని కర్బలా మైదానంలో జరిగిన యుద్ధంలో ఇస్లాం వ్యవస్థాపకులు, ప్రవక్త మహమ్మద్ మనవడు హుస్సేన్ ఇబ్‌నే అలీ ప్రాణాలు కోల్పోయారు. ఆయనతోపాటు మరి కొంత మంది యోధులు ఈ యుద్ధంలో మరణించారు. అప్పటి నుంచి వారి సంస్మరణ కోసం షియా తెగ ముస్లింలు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ముస్లింలలో మహమ్మద్ ప్రవక్త తర్వాత ఎవరు నాయకులు అనే విషయం మీద జరిగిన యుద్ధం ఇది. మహమ్మద్ ప్రవక్త అనంతరం ఆయన అల్లుడు అలీ అనితాలిబ్ నాయకుడుగా ఉండాలని ఒక వర్గం, కాదిని మరొక వర్గం ఘర్షణకు దిగారు. యుద్ధాలు జరిగాయి. అల్లుడు పక్షాన ఉన్న వారు షియాలుగా, వాళ్లకు వ్యతిరేకులుగా ఉన్న వారిని సున్నీలుగా గుర్తించారు. ఇది సున్నీ, షియాలకు మధ్య జరిగిన యుద్ధమైనందున సున్నీలు చాలా మంది దీనిని పాటించరు. అక్కడక్కడ కొద్ది మంది సున్నీలు పాల్గొంటారు. కాని అంత భక్తిశ్రద్ధలు ఉండవు.

అయితే ఈ మొహర్రం తెలంగాణలో కుతుబ్ షాహిల కాలం నుంచి జరుపుకుంటున్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు. 1971లో సెన్సస్ ఆప్ ఇండియా ‘మొహర్రం ఇన్ హైదరాబాద్ సిటి’ అనే పేరుతో ఒక ‘మోనోగ్రాఫ్’ను తయారు చేసింది. ఇందులో మొహర్రం హైదరాబాద్ సంస్థానంలో ఎప్పటి నుంచి ప్రారంభమైందనే విషయాన్ని ప్రస్తావించారు. కుతుబ్ షాహిల కాలం నుంచి ఇక్కడ పీర్ల పండుగ ప్రారంభమైనట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ తర్వాత వచ్చిన అసఫ్‌జాహిలు కూడా దానిని కొనసాగించారు. దీనిని అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం విశేషం. కుతుబ్ షాహిల, అసఫ్‌జాహిలు కాని రాజులు. అయితే రాజులు పాటించిన ప్రతి సందర్భాన్ని ప్రజలు అనుసరించాలని లేదు. కాని హైదరాబాద్ సంస్థానం ప్రజలు ఈ పీర్ల పండుగలో తమదైన సాంప్రదాయాలతో పాల్గొన్నారు. ఇక్కడ మాత్రమే కాదు. దేశమంతా ఇదే రకమైన ఆచారం కొనసాగింది. కొనసాగుతున్నది.
తెలంగాణలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికీ పీర్ల పండుగ గురించి తెలిసే ఉంటుంది. చివరకు హుస్సేన్ పేరును తమ యాసకు అనుగుణంగా ఊహన్నగా మార్చుకున్నారు.

హుస్సేన్ సొదరుడైన హస్సేన్ పేరును ఆశన్నగా పలుకుతున్నారు. వారిద్దరి పేరు మీద సుదీర్ఘమైన పాటే ఉన్నది. అదే విధంగా హస్సేన్ కుమారుడైన కాసిం కూడా ఈ యుద్ధంలో మరణిస్తాడు. అతని పేరు మీద ఒక పాటు ఉంటుంది. ప్రవక్త మహమ్మద్ కూతురు ఫాతిమా బీబీని ఈ పాటలో స్తుతిస్తారు. ఎక్కడో 1400 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇప్పటికీ ఇక్కడ ఎందుకు ప్రజలను కదిలిస్తున్నదనేది ప్రశ్న. అంతేకాకుండా, తమ మతం, ప్రాంతం, సంస్కృతికి సంబంధం లేని ఒక చరిత్ర గాథను తమదిగా ఎందుకు చేసుకున్నారు? ఇది చరిత్రకారులను వేధించిన ప్రశ్న. దీని మీద పరిశోధనలు జరిగాయి. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సదస్సులు జరిగాయి. 1992 లో డిసెంబర్ 6వ తేదీన అయోధ్యలోని బాబరీ మసీదు విధ్వంసం తర్వాత హైదరాబాద్‌లో జానపద కళా పరిశోధన వేదిక, ఫోరం ఫర్ ఫ్రీడం ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనే సంస్థలు జాతీయ సదస్సును నిర్వహించాయి. అప్పుడు హిందూ ముస్లింల ఘర్షణల నేపథ్యంలో భారతదేశం మత సామరస్యానికి ఎటువంటి ప్రతీకగా నిలిచిందని ఆ సదస్సు ద్వారా మొహర్రం ప్రత్యేకతను ఆవిష్కరించారు.
గ్రామాల్లో పీర్ల పండుగ సందర్భంగా జరిగే కార్యక్రమాలను పరిశీలిస్తే అది ముస్లింల పండుగ అనే దానికి ఎటువంటి రుజువులు కానరావు. అది పూర్తిగా స్థానిక సంస్కృతిలో ఇమిడిపోయింది.

పీర్లు అనేవి హస్తం చిహ్నంతో ఉన్న అమరవీరుల స్మారకాలు. వాటిని అక్కడ ప్రతిష్టించడం పది రోజులు వివిధ రకాలైన కార్యక్రమాలు నిర్వహించడం సాంప్రదాయబద్ధంగానే జరుపుకుంటుంది. చివరి రోజు ఊరు ఊరంతా పండుగ లాగా ఉంటుంది. పీర్లు కొట్టం నుంచి (దానిని ఉర్దూలో అశూర్ ఖానా అంటారు) తీసుకొచ్చి మంటలతో నిండిన గుండం (అలువా) చుట్టూ తిప్ప ఊళ్లోకి తీసుకెళతారు. ఆ పేర్లు ప్రతి ఇంటి దగ్గర ఆగుతాయి. ఇంటి వాళ్లు బయటికొచ్చి దట్టె (గుడ్డ) కడతారు. కుడకల పేర్లు (కొబ్బరి) వేస్తారు. అట్లా పీర్లు పట్టుకొని పూనకం వచ్చిన వాళ్లు విబూది బొట్టు పెడతారు. ఇంకొక విషయం చెప్పాలి. కొన్ని గ్రామాల్లో కొన్ని కులాలు, కుటుంబాలు తమ పీర్లను పెట్టుకుంటారు. కులాల పేరుతో పీర్లు ఉంటాయి. బ్రాహ్మణులు మినహా అన్నికులాలు ఇందులో భాగస్వాములు కావడం విశేషం. ఇది మొత్తం శాంతి, సహనం, సామరస్యం, సంఘీభావాలకు ప్రతీకగా నిలుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. నిన్నటి నుంచి ఈ పండుగ ప్రారంభమైంది. ముస్లింలతో పాటు అంటే ఒక మైనారిటీ వర్గమైన షియాలతో పాటు ఈ సాంప్రదాయంలో పాల్గొనడానికి ఉన్న అసలైన కారణాలు కొన్ని ఉన్నాయి. అవి ఇక్కడ ప్రస్తావించడం సందర్భోచితంగా ఉంటుంది.
షియాలు ప్రధాన పాత్ర వహించి ఉనికిలోకి వచ్చిన సాంప్రదాయం సూఫి. ఈ సూఫి సాంప్రదాయం కరుడుగట్టిన ఇస్లాం విశ్వాసాలను తిరస్కరించి, అందరితో కలిసి బతకాలనే ఒక వసుధైక కుటుంబ స్ఫూర్తిని ప్రపంచానికి అందించింది. ఈ సూఫి ద్వారా నెలకొల్పబడనవే దర్గాలు.

భారతదేశంలో ఈ దర్గాలు గత వందల ఏళ్ల నుంచి సంఘ సేవ సంస్థలుగా పని చేశాయి. అక్కడ ఆకలి అని వెళ్లిన వారికి అన్నం పెట్టడం, ఆశ్రయం ఇవ్వడం చదువు, వైద్యం అందించడం కూడా ఎన్నో దర్గాలు చేశాయి. అటువంటి వాటికి సంచార రూపం ఫకీర్లు. వాళ్లు ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలను దీవించి, స్వాంతన పరచడం చేస్తుంటారు. అందుకే తెలంగాణలోనే కాదు దేశంలోని చాలా దర్గాలకు ముస్లింల కన్న ముస్లిమేతరులే ఎక్కువగా వెళ్తుంటారు. అందువల్ల మొహర్రం నెలలో హుస్సేన్ మరణం, ఆ వీర కన్నీటి గాథ ప్రజలు తమదిగా భావించారు. రెండో కారణం, మన దేశంలో విషాద గాథలకు, వాటి చరిత్రకు ప్రజలు ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు. మనం సత్యహరిశ్చంద్రుడు, సతీసావిత్రి, పాండవ వనవాసం, సీతమ్మను రావణుడు అపహరించుట కథలను ప్రజలు తమదిగా భావిస్తుంటారు. కారణమేమిటంటే ఇప్పటికీ 90 శాతం మంది ప్రజలు కష్టాలలోనే ఉన్నారు. కష్టాలలో ఉన్న వారితో ఎక్కువగా పోల్చుకుంటారు. ప్రవక్త మహమ్మద్ మనవడు హుస్సేన్‌ను తొమ్మిది రోజులు హింసించి, నీళ్లు కూడా ఇవ్వకుండా వేధించి చంపిన ఘటన ప్రజలను ఎక్కువగా కలవరపరచి ఉంటుంది. ఇటువంటి కథలు ఇక్కడ కోకొల్లలుగా జరిగి ఉంటాయి.

రాజులు, జమీందార్లు ప్రజలను హింసించిన ఘటనలు మనకు తెలుసు. అందువల్ల కూడా ప్రజలు హుస్సేన్ వీర మరణం తమ ఇంట్లోనే జరిగినట్టు భావించి ఉంటారు. మూడోది, కులవివక్ష, అంటరానితనం. మన దేశంలోని హిందూ దేవాలయాలలోకి అంటరాని కులాలను రానివ్వరు. మరి కొన్ని శూద్ర కులాలను గుడిలోకి రానిచ్చినప్పటికీ, ఎటువంటి పాత్ర ఉండదు. బ్రాహ్మణులకు తప్ప మిగతా వారెవ్వరికి గర్భగుడిలోకి ప్రవేశం లేదు. అయితే పీర్లు మాత్రం కులం, గోత్రం, మతం చూడకుండా ప్రతి ఇంటి గుమ్మం దగ్గరికి వస్తాయి. తరతరాలుగా అంటరాని వాళ్లుగా ఊరి బయట ఉన్న మాల, మాదిగల ఇండ్లకు కూడా పీర్లు రావడం వారిని పీర్లకు, పీర్ల పండుగకు దగ్గర చేశాయి. భారతదేశంలోని ప్రజల్లో ఉన్న మత సామరస్యాన్ని ప్రబోధించి ప్రజలందరినీ ఒకటిగా చూస్తున్న పీర్ల పండుగ సమకాలీన సమాజంలో కూడా ఎంతో అవసరమనిపిస్తోంది. వందల ఏళ్లుగా ప్రజలు తమదిగా భావిస్తున్న మొహర్రం గతంలో నిర్వహించిన పాత్రను మరింత పరిశోధించి, అది నిర్వహించిన పాత్రను గుర్తించగలిగితే, ఈనాటి ప్రజలు మత సామరస్యాన్ని నింపడానికి ఒక మార్గం దొరుకుతుంది.

మల్లేపల్లి లక్ష్మయ్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News