Monday, June 30, 2025

మెడికోలకు స్టైపెండ్ 15% పెంపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభు త్వ హాస్పిటళ్లలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మెడికోలకు భారీ గా స్టైపెండ్ పెంచింది. ఒకేసారి 15శాతం పెంచు తూ ఆదివారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్, డెంటల్ విద్యార్థులతో పాటు, సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాన్ని సైతం ప్రభు త్వం పెంచింది. ఈ పెంపుతో ఇంటర్న్‌లకు నెలకు రూ.29,792, పిజి డాక్టర్లకు ప్రథమ సంవత్సరంలో రూ.67,032, ద్వితీయ సంవత్సరంలో రూ.70,757, ఫైనల్ ఇయర్‌లో రూ.74,782 చొప్పున స్టైపెండ్ అందనుంది. సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ప్రథమ సంవత్సరంలో రూ.1,06, 461, రెండో ఏడాదిలో రూ.1,11,785, మూడో ఏడాదిలో రూ.1,17,103 చొప్పున స్టైపెండ్ అందనుంది. అలాగే, సీనియర్ రెసిడెంట్లకు డాక్టర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.92,575 నుంచి రూ.1,06,461 పెంచుతున్నట్టు ప్రభుత్వం జిఒ లో పేర్కొంది. మెడికోలకు పెరిగిన స్టైఫండ్‌తో దక్షి ణ భారతదేశంలోనే అత్యధిక స్టైఫండ్స్ చెల్లిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

పెంచిన స్టైపెండ్ ప్రతి నెలా 10న చెల్లించాలని మంత్రి ఆదేశాలు
రాష్ట్రంలో మెడికోలకు పెంచిన స్టైపెండ్‌ను ఇకపై ప్రతి నెలా 10వ తేదీన చెల్లించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంవత్సరానికి సరిపడా స్టైఫండ్స్ చెల్లించేందుకు అవసరమైన బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ అధికారులు విడుదల చేశారు. అదేవిధంగా పెండింగ్ స్టైఫండ్ బకాయిలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం జూడాల ఖాతాల్లో స్టైఫండ్ డబ్బులు జమ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న సీనియర్ రెసిడెంట్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఇతర సిబ్బంది ఉద్యోగ కాలాన్ని మరో ఏడాది పాటు పెంచుతూ ఆర్థిక శాఖ జిఒ విడుదల చేసింది. దీంతో వీరికి రెగ్యులర్ వేతనాలు చెల్లించేందుకు మార్గం సుగమం అయింది.

మెడికల్ కాలేజీల్లో టీచింగ్ ఫాకల్టీ సమస్యకు చెక్
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో టీచింగ్ ఫాకల్టీ సమస్యకు చెక్ పెడుతూ పలు చర్యలను ప్రభుత్వం తీసుకుంది.ఇప్పటికే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయగా, సుమారు మరో 714 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ పోస్టులను సైతం త్వరలోనే భర్తీ చేయనున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అడిషనల్ డిఎంఇ వంటి పోస్టులను నేరుగా రిక్రూట్ చేసుకునే అవకాశం లేకపోవడంతో, ప్రమోషన్ల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందుకోసం ప్రభుత్వం ప్యానెల్ ఇయర్ రిలాగ్జేషన్ సైతం ఇచ్చినట్టు మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు తెలిపారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న సుమారు 231 మంది అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 308 మందికి, ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో అన్ని మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత, డిపార్ట్‌మెంట్ హెచ్‌ఒడిల సమస్య తీరనున్నది. అర్హత కలిగిన 44 మంది సీనియర్ ప్రొఫెసర్లకు అడిషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లుగా ప్రభుత్వం ప్రమోషన్లు ఇచ్చింది. ఈ ప్రమోషన్లతో రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్స్, టీచింగ్ హాస్పిటళ్లకు రెగ్యులర్ సూపరింటెండెంట్లు రానున్నారు.

రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను విరమించారు. ప్రభుత్వంతో వారు జరిపిన చర్చలు సఫలం అయిన నేపథ్యంలో సోమవారం నుంచి తలపెట్టిన సమ్మెను విరమిస్తున్నామని జూడాలు ప్రకటించారు. తమ సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని లేదంటే జూన్ 30 నుంచి ధర్నాకు దిగుతామని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి ఇటీవల సమ్మె నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ జూడాలను ఆదివారం చర్చలకు ఆహ్వానించారు. చర్చలకు ముందే ప్రభుత్వం మెడికోలకు భారీగా స్టైఫండ్ పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. అలాగే కాలేజీల్లో, అనుబంధ ఆసుపత్రుల్లో మౌలిక సదూపాయాలు పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వంతో తమ చర్చలు సఫలం అయ్యాయని జూడాలు పేర్కొన్నారు. మెడికోలకు భారీగా స్టైఫండ్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో జూడాలు మంత్రి దామోదర రాజనరసింహకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News