పెళ్లైన రెండు నెలలకే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన తమిళనాడులోని తిరుప్పూర్లో చోటుచేసుకుంది. వరకట్నం కోసం భర్త, అత్తమామల వేధింపుల కారణంగానే 27 ఏళ్ల నవ వధువు సూసైడ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతురాలిని గార్మెంట్ కంపెనీ నడుపుతున్న అన్నాదురై కుమార్తె రిధన్యగా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఏప్రిల్లో 28 ఏళ్ల కవిన్కుమార్ను రిధన్య వివాహం చేసుకుంది. 100 పౌండ్ల (800 గ్రా) బంగారు ఆభరణాలు, రూ.70 లక్షల విలువైన వోల్వో కారు కట్నం కింద ఇచ్చారు. అయితే, ఆదివారం రిధన్య మొండిపాళయంలోని ఒక ఆలయానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరింది. మార్గమధ్యలో ఆమె తన కారును ఆపి పురుగుమందుల మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఆ ప్రాంతంలో చాలా సేపు నిలిపి ఉంచిన కారును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. కారు లోపల రిధన్య చనిపోయి, నోటి నుండి నురుగుతో ఉండటాన్ని గుర్తించారు.
ఆమె చనిపోయే ముందు తన తండ్రికి వాట్సాప్లో ఏడు ఆడియో సందేశాలను పంపింది. అందులో తాను భర్త కెవిన్ తో జీవించలేకపోతున్నానని.. వేధింపులను భరించలేకపోతున్నానని చెప్పింది. అందుకే తాను చనిపోతున్నానని.. దయచేసి తనను క్షమించండని తండ్రికి చెప్పింది. “నేను రోజూ వారి మానసిక హింసను భరించలేకపోతున్నాను. దీని గురించి ఎవరికి చెప్పాలో నాకు తెలియదు. జీవితం ఇలాగే ఉంటుందని.. నేను రాజీ పడాలని వినే వారు చెబుతున్నారు. నా బాధను అర్థం చేసుకోలేకపోతున్నారు” అని ఆమె ఆడియో సందేశంలో పేర్కొంది.
మరో మెసేజ్లో.. తన తల్లిదండ్రులు తనను అనుమానించవచ్చు కానీ తాను అబద్ధం చెప్పడం లేదని పేర్కొంది. “నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ నటిస్తున్నారు. నేను ఎందుకు మౌనంగా ఉన్నానో లేదా ఇలా మారుతున్నానో నాకు అర్థం కావడం లేదు. నేను ఇలా జీవించలేకపోతున్నా. నా జీవితాంతం మీకు భారంగా ఉండాలనుకోను. ఈసారి నేను ఏ తప్పు చేయలేదు. నాకు ఈ జీవితం ఇష్టం లేదు. వాళ్లు నాపై మానసికంగా దాడి చేస్తున్నారు. కెవిన్ నన్ను శారీరకంగా హింసిస్తున్నాడు. నేను ఈ జీవితాన్ని కొనసాగించలేను” అని ఆమె పేర్కొంది.
“నువ్వు, అమ్మ నా ప్రపంచం. నా చివరి శ్వాస వరకు నువ్వే నా ఆశ, కానీ నేను నిన్ను చాలా బాధపెట్టాను. నువ్వు ఈ విషయం బహిరంగంగా చెప్పలేకపోతున్నావు, నన్ను ఇలా చూడలేకపోతున్నావు. నీ బాధ నాకు అర్థమవుతుంది. క్షమించండి నాన్న.. అంతా అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను” అని ఆమె ఇంకో ఆడియో మెసేజ్ చెప్పింది.
పోలీసులు రిధన్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. ఆమె భర్త కవిన్ కుమార్, మామ ఈశ్వరమూర్తి, అత్త చిత్రాదేవిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని.. బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు.