Thursday, July 31, 2025

రేవంత్ అండతోనే బనకచర్లపై ఎపి బరితెగింపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో కాంగ్రెస్‌ను మొద్దు నిద్ర లేపింది బిఆర్‌ఎస్ పార్టీ అని మాజీ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరుగని పోరాటం చేసింది బిఆర్‌ఎస్ పార్టీ అని తెలిపారు. గోదావరిలో 1000 టిఎంసిలు, కృ ష్ణాలో 500 టిఎంసిలు చాలు అని చెప్పిన రేవంత్‌కు.. మిగులు జలాల్లోనూ తెలంగాణకు వాటా ఉంటుందని జ్ఞానోదయం చేసింది బిఆర్‌ఎస్ పార్టీ అని పేర్కొన్నారు.

అవే పాత అబద్దాలు ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి.. అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ఇప్పటికీ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు పట్ల రేవంత్‌రెడ్డి చూపుతున్న గురు భక్తికి ఇది నిదర్శనం కాదా..? అని నిలదీశారు. జిడబ్లూడిటి అవార్డు ప్రకారం, సిడబ్లూసి అనుమతి పొందకుండా ఈఏసీ అనుమతి ఇవ్వదు అని తెలిపారు. ఎపి అనుమతుల కోసం సిడబ్లూసికి వెళ్లే కంటే ముందే అపెక్స్ కౌన్సిల్‌కు వెళ్లాలనే సోయి కూడా లేదు రేవంత్‌రెడ్డికి లేదని విమర్శించారు. కనీస అవగాహన లేని వ్యక్తులు నీటి పారుదల శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తొమ్మిదిన్నరేండ్ల బిఆర్‌ఎస్ పాలనలో ప్రస్తావనే రాని బనకచర్ల ప్రాజెక్టు, ఇప్పుడు ఎవరి అండ చూసుకొని ముందుకు వచ్చిందో తెలంగాణ ప్రజలకు తెలియదా..? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి మౌనంగా ఉంటూ అందిస్తున్న సహకారం వల్లనే కదా బనకచర్ల వ్యవహారం ఇక్కడి దాకా వచ్చింది అని నిలదీశారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో అన్యాయం చేస్తూనే, లెక్కకు మించి అబద్దాలు ప్రచారం చేస్తూ.. బిఆర్‌ఎస్‌పై చేస్తున్న రేవంత్‌రెడ్డి క్షుద్ర రాజకీయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నదని, ఆయన తెలంగాణ వ్యతిరేక విధానాలను అసహ్యించుకుంటున్నదని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News