చత్తీస్గఢ్ రాజధాని రాయపూర్ సెంట్రల్ జైలులో ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి కవాసీ లఖ్మాను మంత్రి సీతక్క పరామర్శించారు. మంత్రి సీతక్క వెంట ట్రైకార్ చైర్మన్, ఆదివాసి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్ ఇతర నేతలు జైలులో లఖ్మాను పరామర్శించి ఆయన కుటుంబ సభ్యులకు, అనుచరులకు సంఘీభావం తెలిపారు. అనంతరం స్థానిక మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడారు. మాజీ మంత్రి ఆరు సార్లు ఎంఎల్ఎ, ఆదివాసీల అగ్రనేత కవాసీ లఖ్మాని అకారణంగా అరెస్టు చేశారన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే లఖ్మాని బిజెపి ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోందని ఆరోపించారు.
నిరాధారమైన కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఏలాంటి సాక్షాధారాలు లేకుండానే తప్పుడు కేసులతో ఆరు నెలలుగా జైలులో పెట్టారని ఆరోపించారు. బస్తర్లో ఆదివాసీల గొంతుకగా ఉన్న లఖ్మా అక్రమ అరెస్టును ఖండిస్తున్నామన్నారు. ఆపరేషన్ కగార్ పేరిట ఆదివాసీలను బిజెపి ప్రభుత్వం బలవంతంగా తరిమి వేస్తోందని విమర్శించారు. ఆదివాసీల అణిచివేతలో భాగంగానే లఖ్మాపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. కవాసీ లఖ్మా కుటుం బానికి కాంగ్రెస్ అండగా నిలుస్తోందన్నా. ఆయనకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పక్షాన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.