పాకిస్థాన్ పాలకులు నిరంకుశ విధానాలను అమలు చేస్తున్నారని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పార్లమెంట్ చేసిన ఓ చట్ట సవరణను ఉద్దేశిస్తూ ఎక్స్లో ఆయన స్పందించారు. ఈ బానిసత్వాన్ని అంగీకరించడానికి బదులు జైల్లో చీకటి గదిలో జీవించడానికి ఇష్టపడతానని అన్నారు. తన సందేశాన్ని ప్రజలకు చేరకుండా ప్రభుత్వం అన్నివిధాలా అడ్డుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని తన మద్దతుదారులకు ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. “ ప్రజాస్వామ్యంలో నాలుగు అంశాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఓటుహక్కు, చట్టబద్ధ పాలన, నైతికత, స్వేచ్ఛాయుత మీడియా, ఇటీవల చేసిన ఇరవై ఆరవ రాజ్యాంగ సవరణ వీటన్నింటినీ నాశనం చేసింది.
జులై 6 తరువాత ఈ నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా పోరాడాలని, దేశం మొత్తానికి ముఖ్యంగా పీటీఐ కార్యకర్తలకు, మద్దతు దారులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ బానిసత్వాన్ని అంగీకరించడం కంటే జైల్లో చీకటి గదిలోనే జీవిస్తా ” అని ఇమ్రాన్ పేర్కొన్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్పైనా ఇమ్రాన్ ఖాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓ నియంత అధికారం లోకి వస్తే అతడికి ఓట్లు అవసరం లేదని, ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో పాలన కొనసాగిస్తాడని విమర్శించారు. అక్కడి న్యాయవ్యవస్థ పైనా ఇమ్రాన్ మాట్లాడారు. కోర్టుల్లో ఎంపిక చేసిన న్యాయమూర్తులే ఉంటున్నారని, స్వతంత్రంగా వ్యవహరించే వాళ్లు శక్తిహీనులుగామారిపోతున్నారని అన్నారు. దేశంలో వాక్ స్వాతంత్య్రం కనుమరుగవుతోందన్న ఇమ్రాన్ నిజాయితీ గల జర్నలిస్టులను లక్షంగా చేసుకుంటున్నారని ఆరోపించారు.