బర్మింగ్హామ్: ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా భారీ స్కోరు దిశగా కొనసాగుతోంది. కెప్టెన్ శుభ్ మన్ గిల్ అద్భుత సెంచరీతో రాణించడంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో రోజు కూడా భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. రవీంద్ర జడేజాతో కలిసి గిల్ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. మరోవైపు అర్థ శతకంతో ఆకట్టుకున్న జడేజా(89) సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 110 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 419 పరుగులు చేసింది. క్రీజులో గిల్(168), వాషింగ్టన్ సుందర్(01)లు ఉన్నారు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 15 పరుగుల వద్ద కెఎల్ రాహుల్() ఔటయ్యాడు. వన్డౌన్లో వచ్చిన కరుణ్ నాయర్తో కలిసి మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్(87) ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఇద్దరు కుదురుగా ఆడడంతో భారత్ కోలుకుంది. ఇటు యశస్వి అటు నాయర్లు ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. కరణ్ నాయర్(31) పెవిలియన్ చేరిన తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్(25) నిరాశపర్చాడు. ఆ వెంటనే నితీష్ కుమార్ రెడ్డి(1) కూడా ఔట్ కావడంతో భారత్ కొంత ఒత్తిడిలో పడింది. ఈ క్రమంలో గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ జట్టును ఆదుకున్నాడు.