యశోద ఆసుపత్రిలో
కెసిఆర్కు వైద్య పరీక్షలు
కెసిఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది: యశోద వైద్యులు
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు గురువారం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల కోసం తన సతీమణి శోభ, కుమారుడు కెటిఆర్తో కలిసి కెసిఆర్ యశోద ఆసుపత్రికి వెళ్లారు. బిఆర్ఎస్ పార్టీ నేతలు హరీశ్రావు, జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా ఆసుపత్రికి వెళ్లారు. కెసిఆర్కు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇది కేవలం రెగ్యులర్ హెల్త్ చెకప్లో భాగమేనని తెలిపారు. కాగా, కొద్ది రోజుల క్రితం జనరల్ హెల్త్ చెకప్లో భాగంగానే కెసిఆర్ గచ్చిబౌలిలోని ఎఐజి ఆసుపత్రికి వెళ్లిన విషయం తెలిసిందే.
నిలకడగా కెసిఆర్ ఆరోగ్యం: హెల్త్ బులిటెన్లో వైద్యులు
యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు గురువారం రాత్రి యశోద ఆసుపత్రి సీనియర్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎం.వి.రావు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. గురువారం సాయంత్రం స్వల్ప నీరసంతో తమ ఆసుపత్రిలో చేరినట్లు పేర్కొన్నారు. ప్రాథమిక పరీక్షలలో అధిక బ్లడ్ షుగర్ లెవెల్స్తో పాటు తక్కువ సోడియం స్థాయి ఉన్నట్లు నిర్థారణ అయ్యిందని అన్నారు. మధుమేహం నియంత్రణ కోసం సోడియం స్థాయి పెంచేందుకు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
కెసిఆర్ ఆరోగ్యం గురించి సిఎం రేవంత్రెడ్డి ఆరా
కెసిఆర్ ఆరోగ్యం గురించి సిఎం రేవంత్రెడ్డి ఆరా తీశారు. యశోద హాస్పిటల్ డాక్టర్లు, అధికారులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఉత్తమ చికిత్స అందించాలని ఆదేశించారు. కెసిఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.