మనతెలంగాణ,సిటిబ్యూరోః నార్సింగి మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసిన కేసులో పరారీలో ఉన్న నలుగురు నిందితులను నార్సింగి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…గండిపేట ఎస్ఆర్ఓ కార్యాలయానికి గత నెల 17వ తేదీన సంతోష్ అనే వ్యక్తి నార్సింగి గ్రామంలోని ఫ్లాట్ నంబర్ 146కు సంబంధించిన ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ను పెట్టి రిలీజ్ డిడ్ విడుదల కోసం దరఖాస్తు చేశాడు. అందులో మున్సిపల్ కమిషనర్ సంతకాలు ఉన్నట్లు చూపించాడు. మున్సిపల్ కమిషనర్ సంతకంపై అనుమానం రావడంతో వెంటనే మున్సిపల్ అధికారికి సమాచారం ఇచ్చాడు. ఇది తెలుసుకున్న సంతోష్ ఎస్ఆర్ఓ కార్యాలయం నుంచి పారిపోయాడు. ప్లాట్ నంబర్146 యజమానురాలు నీరజా స్థలాన్ని జనవరి, 2025లో అరవింద్ అనే వ్యక్తికి విక్రయించారు.
నిందితులు ఆ ఫ్లాట్పై నకిలీ డాక్యుమెంట్లను సృష్టించారు. గండిపేట్ ఎస్ఆర్ఓ ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించిన గులాం మహమ్మద్ ఖాన్, వెంకట్ సత్యనారాయణ, జహీర్ అహ్మద్, చీడెళ్ల శివ నాగేశ్వరరావును అరెస్టు చేశారు. నలుగురు కలిసి మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి ఫేక్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు , అధికార పత్రాలు తయారు చేశారు. సంతోష్, వీరబాబు, శివాని నకిలీ మున్సిపల్ ఉద్యోగులుగా వ్యవహరించినట్టు తెలిసింది. జహీర్ అహ్మద్, శివ నాగేశ్వరరావు, సత్యనారాయణ, గులాం మహ్మద్ ఖాన్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.