మన తెలంగాణ / హైదరాబాద్: సమాజంలో అత్యంత వెనుకబడిన చెంచులు దశాబ్దాల పాటు సొంత ఇళ్లకు నోచుకోలేదని, వారి సొంతింటి కలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం సాకారం చేస్తుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని ఉట్నూరు, భద్రాచలన, మున్ననూర్, ఏటూరు నాగారం నాలుగు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్ధ ( ఐటిడిఎ)ల ప్రిధిలోని 21 నియోజకవర్గాలలో శాచురేషన్ పద్ధతిలో 13,266 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో శాశ్వత గృహాలను నిర్మించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పలు సందర్భాల్లో సూచించడం జరిగిందని, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో గిరిజనప్రాంతాల్లో అభివృద్ధి, ముఖ్యంగా వారి నివాస గృహాల నిర్మాణంపై అనేక సూచనలు చేశారని, గవర్నర్, ముఖ్యమంత్రి సూచనలు, సలహాలు మేరకు గిరిజన ప్రాంతాల్లో చెంచులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు.
మొదటి విడతలో భాగంగా సోమవారం అచ్చంపేట నియోజక వర్గం మున్ననూర్లో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణతో కలిసి చెంచులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను స్వయంగా తానే అందచేస్తున్నట్లు తెలిపారు. అడవులను నమ్ముకొని జీవించే గిరిజనుల్లో చెంచులు ఒక జాతి అని, వీరు అడవుల్లో వేటాడటం, అటవీ ఫలసాయం సేకరించి అమ్ముకుని జీవనం సాగిస్తున్నారన్నారు. చిన్నచిన్న గుడిసెలు తప్ప వీరికి పక్కా ఇల్లు ఎలా ఉంటుందో ఊహకు అందని విషయమని, అలా అని ఆ అడవి ప్రాంతాల్ని వదలి వారు బతక లేరని, అందుకే వీరు జీవించే ప్రదేశంలోనే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన కూడా చేయలేదన్నారు. ఉట్నూరు ఐటిడిఎ పరిధిలో (10,836 ఇండ్లు) మంచిర్యాల 157, నిర్మల్ 153, ఆసిఫాబాద్ 3371, బోధ్ 163, ఖానాపూర్ 2257, సిర్పూర్ 227, అదిలాబాద్ 2848, బెల్లంపల్ల్లి 223, భద్రాచలన ఐటిడిఎ పరిధిలో అశ్వారావుపేట 274, మున్ననూర్ చెంచు స్పెషల్ ప్రాజెక్ట్లో (2156) అచ్చంపేట్ 785, మహబూబ్నగర్లో 245, పరిగి 63, తాండూర్ 174, కొల్లాపూర్ 105, కల్వకుర్తి 120, వికారాబాద్ 63, దేవరకద్ర 64, నాగార్జునసాగర్ 17, మొత్తంగా 13,266 ఇళ్లను చెంచులకు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. ఈ ఏడాది రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని, అయితే ఐటిడిఎ పరిధిలోని గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 500 నుంచి 700 ఇళ్ల చొప్పున 8,750 ఇళ్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిర్మాణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ను నోడల్ అధికారిగా నియమించినట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.