రంగారెడ్డి: వనమే మనం, మనమే వనం అని పెద్దలు చెప్పారని, ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని యూనివర్సిటీ ప్రాంగణంలో రుద్రాక్ష మొక్కను నాటి వనమహోత్సవం-2025 (Vanamahotsavam 2025) ను ప్రారంభించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.
ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 18 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, లక్ష్యాన్ని పూర్తి చేయుటకు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, అందరు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలని దేశ ప్రధాని పిలుపునిచ్చారని, ప్రధాని పిలుపును సాదరంగా ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో రెండు మొక్కలు నాటాలని కోరారు. అమ్మలు కూడా పిల్లల పేరుతో మొక్కను నాటాలని, ప్రతీ ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటాలని, మీ పిల్లల్లాగే నాటిన మొక్కలను సంరక్షిస్తే తెలంగాణ రాష్ట్రమంతా పచ్చదనంతో నిండిపోతుందన్నారు.
మహిళలను ప్రోత్సహిస్తూ మా ప్రభుత్వం ముందుకు వెళుతోందని, సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను ఆడబిడ్డలకు అప్పగించామని, ఆర్టీసీలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాకుండా, ఆర్టీసీకి వెయ్యి బస్సులను అద్దెకు ఇచ్చేలా ప్రోత్సహించి వారిని బస్సులకు యజమానులను చేశామని తెలియజేశారు.
హైటెక్ సిటీలో విప్రో, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఉండేచోట మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కల్పించామని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, పట్టణ ప్రాంతాల్లో మహిళలు కూడాను మహిళా సంఘాల్లో చేరేలా కృషి చేయాలన్నారు. ఈ ఏడాది మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్లు రుణాలు అందించామని, అన్ని రంగాల్లో ఆడబిడ్డలను ముందు భాగాన నిలపాలని ప్రయత్నిస్తున్నామని, ఇందిరమ్మ రాజ్యంలో ఆడ బిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్ రాబోతోందని, వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 ఎమెల్యే సీట్లు ఇచ్చేబాధ్యత తానే తీసుకుంటానాని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ.. వృక్షో రక్షిత రక్షితః (Vanamahotsavam 2025) చెట్లను పెంచడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవడం జరుగుతుందని, జీవవైవిధ్యన్ని కాపాడుకోగలుగుతామని అన్నారు. చెట్లను పెంచడం ద్వారా వర్షాలు సకాలంలో కూరుస్తాయని, వంద శాతం మొక్కలు నాటేందుకు కృషి చేయాలని, భౌగోళిక పరిస్థితి మెరుగుపడే విధంగా రాష్ట్రమంతా విరివిగా వనాలు పెంచాలని, అందుకు అందరూ భాగస్వాములు కావాలని కొండా సురేఖ సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ చీఫ్ విఫ్ పట్నం మహేందర్ రెడ్డి, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపి మల్లు రవి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్, కమిషనర్ కర్ణన్, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, ఉన్నతాధికారులు. తదితరులు పాల్గొన్నారు.