Wednesday, July 9, 2025

నేతలు మారకుంటే కాంగ్రెస్‌కు కష్టాలే!

- Advertisement -
- Advertisement -

రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ పనితీరు పట్ల కేంద్ర నాయకత్వం సంతృప్తిగా లేదు. అధికారంలో ఉన్న రాష్ర్టంలో పార్టీ ఉండాల్సిన పద్ధతి, లక్షణాలు, సమన్వయం, కార్యశీలత తెలంగాణలో లోపించాయని అధిష్ఠానం తలపోస్తోంది. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే, చాలా తక్కువ సమయంలోనే కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణుల ఆదరణే కాకుండా ప్రజాదరణను కూడా పార్టీ కోల్పోవాల్సి వస్తుందని నాయకత్వం హెచ్చరించింది. వీలైనంత తొందరగా పనితీరు మార్చుకొని, పరిస్థితిని చక్కదిద్దుకోవాలని ఒకింత ఘాటుగానే రాష్ర్ట ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేసింది. పార్టీలో భిన్నవైఖరులు, విభిన్న స్వరాలు లేవని, అందరం ఒకే ఆలోచన, ఒకే లక్ష్యంతో సంఘటితంగా పనిచేస్తున్నామనే భావన కలిగించాలని ఆదేశించింది.

పార్టీ నాయకులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, చర్యలు చేపట్ట్టడాన్ని అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని సమర్థంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోపార్టీ క్రియాశీలంగా వ్యవహరించాలని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని పార్టీ అఖిల భారత అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ముఖ్యనేతలకు ఉద్బోధించారు. పార్టీ ‘రాజకీయ వ్యవహారాల సంఘం’ (పిఎసి) సమావేశంలో, ఆంతరంగిక భేటీలో ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కెసి వేణుగోపాల్‌లు నుడివిన మాటల్ని, నిర్దిష్టంగా చేసిన వ్యాఖ్యల్ని విశ్లేషిస్తే అధిష్ఠానం అసంతృప్తి స్పష్టమవుతోంది. సుతిమెత్తని మందలింపే అయినా రాష్ర్ట నాయకులకు బోధపడేలా ఘాటైన సందేశమిచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పిసిసి అధినేత మహేశ్ కుమార్ గౌడ్‌లను ఉద్దేశించి కూడా నిర్దిష్ట వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి మాటతీరు అధిష్ఠానానికి నచ్చనట్లే, పిసిసి పనితీరు ముఖ్యమంత్రికీ నచ్చట్లేదనే విషయం ఈ సందర్భంగా స్పష్టమైంది. పిసిసి అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియామకం తర్వాత పది నెలలకు గాని పిసిసి రాష్ర్ట కార్యవర్గం రాలేదు.ఇటీవలే ఏర్పడ్డ రాష్ర్ట కార్యవర్గం ఇప్పుడిప్పుడే పని ప్రారంభించింది. రాష్ర్ట కాంగ్రెస్‌లో ఎవరేం మాట్లాడినా చెల్లుబాటవుతోందని, పిసిసి అధినేతకు ఆయా గొంతులపై ఎటువంటి నియంత్రణ లేదనే భావన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందని, ఆయన చేసినట్టు చెబుతున్న వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తోంది. పిసిసి అధినేత, పార్టీ వ్యవస్థపై ఇంకా పట్టు సాధించాలని ఆయన కోరుకుంటున్నట్టుంది. తమ అధ్యక్షుడి పనితీరు ‘భూమి కౌలుకిచ్చి ఇక ఏమీ పట్టించుకోని యజమాని’ (ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్) లా ఉందని ఆయనొక వ్యాఖ్య చేసినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

తమ పార్టీ నాయకత్వంలో, ప్రభుత్వంలో పొరుగు రాష్ర్టం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కోవర్టులున్నారంటూ పార్టీ ఎంఎల్‌ఎ ఒకరు ఇటీవల చేసిన వ్యాఖ్య పార్టీలో దుమారమే రేపింది. ఒక ఎంఎల్‌ఎ, ప్రస్తుత ప్రభుత్వ నిర్వాకాలను, పరోక్షంగా కొందరు మంత్రుల అవినీతి అక్రమాలను ఎండగట్టడానికి సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద ఇప్పటికే డజన్‌కుపైగా దరఖాస్తుల్ని దాఖలు చేసినట్టు సమాచారం. నగరంలోని విలువైన ఒక భూదందాలో జరిగిన అక్రమాలపై తామే ఫిర్యాదు చేసినా… ప్రభుత్వ శాఖలు గాని, ‘హైడ్రా’ వంటి ఎజెన్సీలు గానీ చర్యలు తీసుకోవట్లేదని ఆగ్రహించిన పార్టీ ఎంఎల్‌ఎలు కొందరు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) వేశారు. ఎంఎల్‌ఎలదే ఈ పరిస్థితి అయితే సామాన్యుల సంగతేమిటని పార్టీలోని వారే ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ స్థూలంగా పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ప్రజల్లో దురభిప్రాయం కలిగిస్తాయని పార్టీ శ్రేయోభిలాషులు భావిస్తున్నారు.

కాంగ్రెస్‌లో అంతర్గత ఫిర్యాదులు కొత్త కాదు. పీఠంపై ఎవరున్నా అసంతుష్టుల ఫిర్యాదులు వస్తుంటాయి. గిట్టని నాయకత్వంపైన సమ ఉజ్జీలు, కిందిస్థాయి వారు… ఇలా ఎవరెవరో అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం కాంగ్రెస్‌లో మామూలే! అన్ని ఫిర్యాదుల్ని అధిష్ఠానం పరిగణనలోకి తీసుకోదు, వాటిని సదరు నాయకుల దృష్టికి తీసుకురాదు. నమ్మదగిన, సహేతుకమైన, నిర్దిష్ట ఆధారాలున్న ఫిర్యాదుల్ని మాత్రం నాయకత్వం అంత తేలిగ్గా తీసిపారేయదు. సందర్భం వచ్చినపుడు ఆయా నాయకుల్ని నేరుగా ప్రశ్నించి, విషయం ఏంటో తెలుసుకుంటుంది, అవసరమైతే తేల్చుకుంటుంది. తీరు మార్చుకోమని చెబుతుంది, సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది. లోగడ కెసిఆర్ సచివాలయానికి రాకుండా ఫావ్‌ుహౌజ్ నుండి పాలన సాగించారని విమర్శించిన కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు అవే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

సిఎం రేవంత్ రెడ్డి కూడా సచివాలయానికి, కేబినెట్ సమావేశాలకు మాత్రమే వస్తూ, మిగతా సమావేశాలను బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోనే ఏర్పాటు చేస్తున్నారంటూ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. రాష్ర్ట పార్టీ అధినేత జిల్లాల పర్యటనల కన్నా విదేశాలు, ఢిల్లీ, ఇతర రాష్ట్రాల పర్యటనలు పెరిగాయనే షికాయతులు కూడా పైస్థాయి వరకు వెళ్లాయి. ఉన్నప్పుడైనా గాంధీభవన్‌లో కుదురుగా కూర్చోరని, అంతకన్నా అధిక సమయం మంత్రు వద్దో, కార్పొరేషన్ చైర్మన్లతోనో, ఇతర కార్పొరేట్లతోనో గడుపుతారనే ఫిర్యాదులూ వచ్చినట్టు ఢిల్లీ పెద్దల మాటల్నిబట్టి స్పష్టమవుతోంది. ‘మీ వ్యవహారం ఇలాగే కొనసాగితే, చివరకు మీ నెత్తినే కొబ్బరికాయ కొట్టే పరిస్థితి వస్తుంది’ అని ఢిల్లీ పెద్ద పిసిసి అధినేతతోనే అన్నారంటే, ఫిర్యాదుల్ని అధిష్ఠానం ఎంత సీరియస్‌గా పరిగణిస్తోందో ఇట్టే అర్థమవుతోంది.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసే కొన్ని వ్యాఖ్యలు, ఉపయోగించే భాషపట్ల తరచూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విపక్షంలో ఉన్నపుడు చెల్లుబాటయిందేమో కాని, ‘సాక్షాత్తూ ముఖ్యమంత్రిగా ఉండి అలా మాట్లాడొచ్చా?’ అన్నది ప్రజాక్షేత్రంలో చర్చ లేవనెత్తుతోంది. అవతలి వారిని విమర్శించేప్పుడు సిఎం వాడే భాష, చేసే విపరీత వ్యాఖ్యలు ముఖ్యమంత్రి హోను తగ్గించేవిగా ఉండటమే కాక ప్రత్యర్థులకు అయాచితంగా అస్త్రాలిచ్చినట్టవుతోందని స్వయంగా ఖర్గేనే తప్పుబట్టినట్టు తెలిసింది. ఖజానా ఖాళీ, అప్పు పుట్టట్లేదు వంటి నిస్సహాయపు మాటలు కూడా సరికాదని,అశోక్ సామ్రాట్‌ను ఉటంకిస్తూ ఓ మాట చెప్పారాయన. ‘బుద్ధం శరణం గచ్చామి’ అన్నది అశోకుడి నినాదమే అయినా, తప్పనపుడు ఆయన కళింగ యుద్ధానికీ సిద్ధమయ్యార’నే విషయాన్ని గుర్తు చేశారు. ఇంకో మాట కూడా చెప్పారు.

‘ఎంతో కఠోర శ్రమ, దీక్షతో మీరు మీ ఆశయాన్ని నెరవేర్చుకొని ముఖ్యమంత్రి అయ్యారు, మరి కాంగ్రెస్ గెలుపుకోసం శ్రమపడిన పార్టీ ఇతర నాయకులు, కార్యకర్తల ఆశలు, ఆశయాలు, అభీష్టాలు కూడా నెరవేరాలి కదా? అందుకు ప్రభుత్వాధినేతగా మీరు, పార్టీ అధినేతగా పిసిసి చీఫ్ సహకరించాలి కదా?’ అని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా, ఆయన తననే ఒక ఉదాహరణగా చెప్పారు. ‘ఈ వయసులో కూడా నేను ఎప్పుడూ నిరాశ, నిస్పృహల్ని దరిరానీయను, పార్టీకి, కార్యకర్తలకు ఏం చేయగలమనే ఆలోచిస్తాను’ అని పేర్కొన్నారు. తాము ఇష్టపడని కొందరు సీనియర్లను రాజకీయ వ్యవహారాల సంఘం (పిఎసి)లో ఎదుర్కోవడం ఇష్టం లేకే, అటువంటి కొందరితో ఒక ‘సలహా సంఘం’ ఏర్పాటన్నది సిఎం, పిసిసి అధినేత కలిపి పన్నిన పన్నాగమని కూడా ఎవరో ఢిల్లీ నేతల చెవిన వేసినట్టు తెలుస్తోంది.

వీటన్నిటి ప్రభావమా? తమకున్న సమాచారమా? తెలియదు కానీ, మంత్రివర్గ కూర్పు. వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం వంటి అంశాలతో సహా పలు విషయాల్లో ఢిల్లీ అధిష్ఠానం ముఖ్యమంత్రికి సంపూర్ణ స్వేచ్చ ఇస్తున్నట్టు లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ల పద్ధతికే ప్రస్తుతానికి తిలోదకాలిచ్చినట్టుంది. పార్టీ పనితీరు పైస్థాయిలో ఇలా ఉంటే క్షేత్రంలోనూ భిన్నంగా ఏమీ లేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో ‘పీపుల్స్ పల్స్’ నిర్వహించిన ‘ట్రాకర్ పోల్ సర్వే’ గణాంకాలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో తప్ప మిగిలిన అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ కాంగ్రెస్ వెనుకబడే ఉంది. సగం మంది మంత్రుల నియోజకవర్గాల్లో మెజారిటీ మండలాల్లో ప్రత్యర్థి పార్టీలదే ఆధిక్యత కనిపిస్తోంది. పైన కుదుటపడితే తప్ప కింది స్థాయిలో పార్టీ కుదురుకునే వాతావరణం లేదు.

  • దిలీప్‌రెడ్డి సమకాలీనం
  • రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News