మనతెలంగాణ/మహబూబ్ నగర్ బ్యూరో: గత పది రోజుల నుండి గుర్రంగట్టు ప్రాంతం వద్ద చిరుతపులి సంచరిస్తూ ప్రజలను భయబ్రాంతులను కలిగిస్తున్నది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి పులి తిరిగే ప్రదేశంలో బోను అమర్చినారు. ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేశారు. చిరుతను, ప్రజల సంరక్షణ కొరకు పోలీసుల సహకారం కూడా తోడుగా తీసుకోవడం జరిగిందన్నారు. ఈ విషయమై జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ, అటవీ క్షేత్రాధికారి కమాలుద్దీన్, లక్ష్మీకాంత్ రావు, నాగజ్యోతి, డిఆర్ఓలు, బీట్ అధికారులు సంఘటన స్థలాన్ని పర్యవేక్షించారు.
జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశమై రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రజలను భయాందోళనను గురి కాకుండా అవగాహన కల్పించాలని, గుట్ట చుట్టూ రక్షణ వలం ఏర్పాటు చేసి, అటవీ సిబ్బందిని విడతల వారీగా 24 గంటలు బందోబస్తు విధించి, డ్రోన్ కెమెరాతో పరిశీలించి పులిని పట్టుకుని అడవిలో వదలుటకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డిఎఫ్ఓ కి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, జిల్లా ఎస్పీ డి జానకి, అప్పయ్య, సిఐ పాల్గొన్నారు.