Saturday, July 12, 2025

అమెరికా సహకరిస్తే 3 ట్రిలియన్ డాలర్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:ప్రజాస్వామ్యానికి మార్గదర్శి గా, నిరంతరం ఆవిష్కరణలను అందించడమనే రెండు అం శాల్లో అమెరికా ప్రపంచ దృక్కోణాన్ని మార్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ తాజ్ కృష్ణలో జరిగిన హైదరాబాద్ కాన్సూల్ జనరల్ – అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోయిందని, ప్రపంచం ముందు అనేక సానుకూల అంశాలను ఆవిష్కరించిందన్నారు.ఓటమిని ఎప్పుడూ అంగీకరించని స్ఫూర్తి అమెరికాది అని, ఎల్లప్పుడూ బలమైన దేశంగా, అనే క అంశాల్లో ఒక సానుకూల మార్గంలో పరిష్కారాలను చూపగలిగిందని పేర్కొన్నారు.

తెలంగాణ స్ఫూర్తి కూడా అమెరికా స్ఫూర్తికి ఎంతో సారూప్యత ఉందని, స్నేహాన్ని కోరుకోవడం, బంధాన్ని మరింత పటిష్టపరుచుకోవడం తెలంగాణ ప్రత్యేకత అన్నారు. 2008 లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఏర్పాటైందని, భారతదేశంతో దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో అమెరికా ఎంతో నిబద్ధతను ప్రదర్శించిందని చెప్పారు. అమెరికాతో తెలుగు ప్రజలకు ఉన్న స్నేహ పూర్వకమైన బంధం ఎంతో బలమైందని, అమెరికాలో తెలుగు భాష వేగంగా అభివృద్ధి చెందుతోందని, హైదరాబాద్ కాన్సూల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ రెండు సంస్కృతుల మధ్య, ప్రజల మధ్య వాణిజ్యపరమైన సంబంధాలను పటిష్టపరచడంలో, ఇరు దేశాల మధ్య బలమైన వారధిగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఐటీ, ఫార్మా, డిఫెన్స్, మాన్యుఫాక్చరింగ్, ఏరోస్పేస్ వంటి రంగాలకు చెందిన దాదాపు 200 అమెరికా కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా ప్రస్తుతం పనిచేస్తున్నాయని, ఎంతో మంది విద్యార్థులు తమ కలలను నెరవేర్చుకోవడానికి ఇక్కడి నుంచి అమెరికా వెళుతున్నారని చెప్పారు.

అమెరికా – తెలంగాణల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపరచడానికి తాము ప్రయత్నిస్తున్నామని, తెలంగాణను 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి తెలంగాణ రైజింగ్ దార్శనికతకు కట్టుబడి తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు అమెరికన్ల మద్దతు కావాలని, జాతీయ స్థాయిలో పరస్పర విశ్వాసం, విలువల ఆధారంగా అమెరికా -భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందన్నారు. వ్యాపార, వాణిజ్య రంగాలు, పెట్టుబడులు, ప్రజాస్వామ్యాన్ని విస్తృతం చేయడం, ప్రపంచ శాంతిని నెలకొల్పడం వంటి లక్ష్యాలతో స్నేహపూర్వక బలమైన సంబంధాలు కలిగి ఉండాలని ఇరు దేశాలు కోరుకుంటున్నాయని, ముఖ్యంగా సైనిక విన్యాసాలు, అంతరిక్ష పరిశోధనలో సహకారం, సాంకేతిక రంగంలో పెట్టుబడులకు సంబంధించిన వాణిజ్యంలో ఇరు దేశాలు రికార్డు నెలకొల్పాయని చెప్పారు. హైదరాబాద్‌లో మరింత పురోభివృద్ధి సాధించాలని, అమెరికాలోని అత్యుత్తమైన వాటిని తెలంగాణకు తీసుకువస్తారని తాను ఆశిస్తున్నానని, ఈ వేడుకలకు థీమ్‌గా నిర్ధేశించినట్టుగా చెప్పాలంటే ఒక్కటిగా ఉంటే..మరింత పటిష్టంగా..ఎదగగలమని తాను విశ్వసిస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News