బిసి రిజర్వేషన్లను సవాల్ చేస్తూ
ఎవరైనా కోర్టుకు వెళ్తే ఉద్దండులైన
న్యాయవాదులను నియమిస్తా
అండగా నిలిచి రిజర్వేషన్లు
కాపాడుకోవాలి బిసి రిజర్వేషన్లను
తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాల్సిన
బాధ్యత రాష్ట్ర బిజెపి నేతలదే
కేంద్రంలోని తెలంగాణ
మంత్రులు మోడీ మెడలు వంచాలి
పంచాయతీరాజ్లో రిజర్వేషన్లు
50శాతం దాటొద్దని చట్టం చేసిందే
కెసిఆర్ తనను కలిసిన బిసి
నేతలతో సిఎం రేవంత్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: బీజేపీ పాలిత రా ష్ట్రాల్లో ఎక్కడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. స్థానిక సంస్థ ల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినె న్స్ తీసుకువచ్చినందుకు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, వివిధ కార్పొరేషన్ల చైర్మ న్లు, పార్టీ బీసీ నేతలు కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహే ష్ కుమా ర్ గౌడ్,మంత్రులు కొండా సురేఖ, జూ పల్లి కృష్ణా రావు, ఈరపత్రి అనిల్, మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కులగణన చాలా పకడ్బందీగా చేశామని, వ్యక్తులు స్వయంగా తమ వివరాలను ప్రకటించారని వివరించారు. కులగణన డేటా 100 శాతం డిజిటలైజేషన్ చేశామని, భవిషత్తులో ఎవరూ ఛాలెంజ్ చేయడానికి వీలు లేకుండా డేటా భద్రపరిచామని చెప్పారు. దేశంలో తెలంగాణ కులగణన బెస్ట్ మోడల్ అని, దేశానికి తెలంగాణ కులగణన రోల్ మోడల్ అని రాహుల్ గాంధీ కొనియాడారని అన్నారు. బీసీ రిజర్వేషన్ ఫలాలను ఆయా వర్గాలు సద్వినియోగం చేసుకోవాలని, ఇది కాంగ్రెస్ పార్టీ విజయం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్లు గొప్ప కార్యక్రమం
100 ఏళ్ల బీసీల ఆకాంక్షను రాహుల్ గాంధీ, ఖర్గే నాయకత్వం లో కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని, బీసీ రిజర్వేషన్లు గొప్ప కార్యక్రమం అని రేవంత్రెడ్డి చెప్పారు. ఆనాడు దళితులు,వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు కల్పించిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చిందని తెలిపారు. కులగణన చేస్తామని రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో స్పష్టం చేశారని, రాహుల్ గాంధీ మాట మాకు శిలాశాసనం అని పునరుద్ఘాటించారు. నాయకుడు మాట ఇస్తే దాన్ని నేరవేర్చాల్సిన బాధ్యత తదని, పీసీసీ అధ్యక్షుడిదని స్పష్టం చేశారు.
కులగణన పైన ఎన్నో అవాంతరాలు వచ్చినా వాటిని అధిగమించామని, ఏడాదిలో పూర్తి పారదర్శకంగా ,పక్కా గా కులగణన పూర్తి చేశామని అన్నారు. ఫిబ్రవరి 4ని సామాజిక న్యాయ దినోత్సవం గా ప్రకటించుకున్నామని, అసెంబ్లీతో పాటు అన్ని వర్గాలతో కులగణన పైన చర్చించామని, అందరి అభిప్రాయాలను తీసుకున్నామన్నారు. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే తెలంగాణ మోడల్ లో కులగణన చేయాలని దేశమంతా చెబుతున్నారని, కులగణనకు తాము వ్యతిరేకమని బీజేపీ గతంలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని, బీసీ రిజర్వేషన్లను 9 వ షెడ్యూల్ లో చేర్చాలనిజంతర్ మంతర్ లో నిర్వహించిన ధర్నాకు16 పార్టీలు మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు. మనం తీసుకువచ్చిన ఒత్తిడికి లొంగే కేంద్రం 2026 లో జరిగే జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించిందని, తెలంగాణ నిర్ణయం దేశాన్ని ప్రభావితం చేసిందని అన్నారు.
చిత్తశుద్ది లేనిది బీజేపీకే
బీసీ రిజర్వేషన్లపై తమకు చిత్తశుద్ధి లేదని కొందరు విమర్శిస్తున్నారని, చిత్తశుద్ది లేనిది బీజేపీకి అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లను 9 వ షెడ్యూల్ చేర్చి చట్టబద్దత కల్పించాల్సింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అని, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, ఆర్ క్రిష్ణయ్య దీనిని సాధించాలని కోరారు. మోడీ స్థానంలో రాహుల్ గాంధీ ఉంటే 48 గంటల్లో నేను రిజర్వేషన్లను సాధించుకు వచ్చేవాడినని, ప్రధాని మోదీని తెలంగాణకు చెందిన బీజేపీ మంత్రులు ప్రశ్నించాలన్నారు. బీజేపీ నాయకులు వాళ్ల నిబద్ధతను చూపించాలని, రిజర్వేషన్ల కోసం ఇంకా ఏం చేయాలన్నా తాను సిద్ధమన్నారు. ఏం చేయాలో చెప్పండి..అర్ధరాత్రి కూడా మంత్రి వర్గం సమావేశం ఏర్పాటు చేస్తానని, రిజర్వేషన్ల విషయంలో తనను ప్రశ్నించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదన్నారు.
నా నిబద్దతను ప్రశ్నించలేరు
నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించిందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసమే ఇంత కాలం స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశామన్నారు. యాభై శాతానికి మించి రిజర్వేషన్లు పెంచొద్దని గత కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం చేసిందరన్నారు. ఈ చట్టం చేసినప్పుడు మంత్రులుగా గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ ఉన్నారని, కేసీఆర్ ఇప్పుడు వాళ్లను తమ పైకి ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. ఆ చట్టంలో పేర్కొన్న యాభై శాతంనిబంధనను సవరిస్తూ తాము ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకువచ్చామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తాపత్రయం పడుతున్నది తానేనని, తనకు తోడుగా రక్షణ కవచంలా ఉండి రిజర్వేషన్లను కాపాడుకోవాలని కోరారు. రిజర్వేషన్లపై ఎవరైనా కోర్టుకు వెళ్తే వాదించడానికి ఢిల్లీ నుంచి ఉద్దండులైన న్యాయవాదులను వాదనల కోసం నియమిస్తానని చెప్పారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కాగితం పెట్టిన వాళ్ళని, కాగితం పెట్టించిన వాళ్లను సామాజిక బహిష్కరణ చేస్తామని ప్రకటించాలని సూచించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని, అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలు అయితేనే నిజమైన విజయం అని, 2029 ఎన్నికల్లో బీసీ రిజర్వేషనే ్లప్రధాన జెండా కావాలని సీఎం అన్నారు.