ఖమ్మం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎప్పటికీ కెసిఆర్ స్థాయి రాదు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలకు ప్రయోజనం లేదని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఖమ్మం పర్యటనలో కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. తాను తప్పు చేయలేదు కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నామని వివరించారు. సవాల్ విసిరిన రేవంత్ చివరకు తోక ముడిచారని చురకలంటించారు. అసెంబ్లీలో కాంగ్రెసోళ్లు చర్చిద్దామంటున్నారని, కానీ తన మైక్ కట్ చేయకుండా ఉంటే చర్చకు సిద్ధంంగా ఉన్నానని సవాల్ విసిరారు. సిఎం రేవంత్ను మానసిక హాస్పిటల్లో చూపించాలని ఎద్దేవా చేశారు. ఆధారాలు లేకుండా డ్రగ్స్, హీరోయిన్స్ అంటూ అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
ఇంకెంతకాలం ఆరోపణలు చేస్తారని, హామీల సంగతేంటని ప్రశ్నించారు. దుబాయ్లో ఎవరో చనిపోతే తనకేం సంబంధమని, దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని ఛాలెంజ్ చేశారు. ఎపి మంత్రి లోకేష్ను అర్ధరాత్రి కలవాల్సిన అవసరం తనకు లేదని, తాను లోకేష్ను కలవలేదని, కలిసినా తప్పేంటి? అని అడిగారు. బనకచర్లపై చర్చించామని ఎపి మంత్రి నిమ్మల అన్నారని, బనకచర్లపై చర్చించలేదని రేవంత్ చెప్పారని, ఎవరు అబద్ధం చెప్పారని నిలదీశారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుతో రేవంత్ రహస్య ఒప్పందం బయటపడిందని, దీంతో రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. బిఆర్ఎస్ పాలనలో తెలంగాణను అనేక అంశాల్లో నెం.1గా నిలిపామని ప్రశంసించారు.