మన తెలంగాణ/హైదరాబాద్ : హెచ్సీఏ స్కామ్పై ఇడి దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. హెచ్సిఎలో క్విడ్ ప్రో కో జరిగినట్టు గుర్తించింది. టెండర్లు లేకుండా అనుకూలమైన వారికే పనులు కేటాయించడంతో హెచ్సిఎ సభ్యులు భారీగా లబ్ది పొందినట్టు ఇడి గుర్తించింది. కొద్ది రోజుల క్రితమే హెచ్సిఎ మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్, అతడి భార్యను విచారించింది . రూ. 90 లక్షల రూపాయలు క్విడ్ ప్రో కో జరిగినట్టు గుర్తించారు. క్రికెట్ బాల్స్ టెండర్ల, జిమ్ సామాను టెండర్లు, స్టేడియం కుర్చీలు టెండర్లు తమకు కేటాయించినందుకు లక్షల రూపాయలు లంచం ఇచ్చినట్లుగా వెలుగుచూసింది.
మాజీ హెచ్సిఎ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్ భార్య పేరు మీద జెబి జ్యూవెలర్స్ ఖాతాలోకి లంచం డబ్బులు జమ అయినట్లు గుర్తించారు. బిసిసిఐ నుంచి వచ్చిన నిధులను క్రికెట్ అభివృద్ధి కోసం కాకుండా సొంత పనులకు వాడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. స్టేడియం టెండర్ల నుంచి మొదలుకుని టికెట్ల విక్రయం దాకా అన్నిట్లో గోల్మాల్కు పాల్పడ్డట్లు గుర్తించారు. గత 10 ఏళ్లలో బిసిసిఐ నుంచి హెచ్సిఎకు 800కోట్లకు పైగా నిధులు వచ్చినట్లు తేలింది. కోట్ల రూపాయలు ఉన్న హెచ్సిఎ అకౌంట్ను సైతం సొంత ప్రయోజనాలకు వాడారని ఆరోపణలు వస్తున్నాయి.
2022లో జస్టిస్ లావ్ నాగేశ్వర్ రావ్ విచారణలో అనేక విషయాలు బట్టబయలయ్యాయి. క్రికెట్ బాల్స్, స్టేడియం చైర్స్, జిమ్ పరికరాలు టెండర్లులలో కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టు ఫోరెన్సిక్ ఆడిట్లో నిర్ధారణ అయింది. ఈ వ్యవహారంపై గతంలోనే హెచ్సిఎ సభ్యులను ఇడి విచారించింది. హెచ్సిఎ అధ్యక్షుడు జగన్ మోహన్ రావ్ సైతం ఇదే రీతిలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. హెచ్సిఎలోకి లోకి ఎంట్రీ కావడానికి ఎవరెవరికి ఎంత ఇచ్చారో ఇడి తేల్చనున్నది . ఐపిఎల్ మ్యాచ్ ల సందర్భంగా టెండర్ల విషయంలోనూ సొంత వాళ్లకే ప్రయోజనాలు చేకూరేలా జగన్ వ్యవహరించినట్లు సమాచారం. ఫుడ్ క్యాటరింగ్, స్టేడియం లో స్టాల్స్, టికెట్స్ కేటాయింపులోనూ తన వారికే కట్టబెట్టుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.