అక్కడికక్కడే నలుగురు మృతి
లారీని వెనుక నుండి ఢీకొన్న కారు
మరొకరికి తీవ్ర గాయాలు
మన తెలంగాణ/తుక్కుగూడ: రంగారెడ్డి జిల్లా, ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంగులూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని వెనుక నుండి కారు ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు అ క్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గా యాయ్యాయి. మృతుల్లో మహబూబాబాద్ జిల్లాకు చెందిన గుగులోతు జనార్దన్ (45), వరంగల్ జిల్లాకు చెందిన మాలోత్ చంద్ (29), రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్కు చెందిన కావలి బాలరాజు ((40), ఎపిలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన భాస్కరరావు (39) ఉన్నారు.
పెద్దఅంబర్పేట్ నుండి బొంగులూర్ వైపు వెళ్తుండగా ఆదిభట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వీరంతా యాదగిరిగుట్టకు కారులో వెళ్లి తిరిగి వస్తుండగా నిద్రమత్తులో వేగంగా గుర్తు తెలియని లారీని వెనక నుండి ఢీకొన్నట్టు తెలుస్తోంది. కారులోనే ఇద్దరి మృతదేహాలు ఇరుక్కుపోయాయి. మృతులు మొయినాబాద్ గ్రీన్ వాలీ రిసార్ట్లో పనిచేసేవారుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన విజయనగరం జిల్లాకు చెందిన జడ కృష్ణ (25) బిఎన్ రెడ్డి నగర్లోని నీలాద్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.