వరుసకు మరిది అయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ..తన భర్తను అతికిరాతకంగా కడతేర్చింది. ఈ ఘోరం బయట పడకుండా ఉండేందుకు కరెంట్ షాక్తో ప్రమాదవశాత్తు చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. చంపడానికి ముందు ఆ ఇద్దరి మధ్య జరిగిన ఛాటింగ్ , ఆ మొత్తం ఘోరాన్ని బయటపెట్టింది. దేశ రాజధానిలో జరిగిన ఈ ఘోరం వివరాల్లోకి వెళ్తే … తన భర్త కరణ్దేవ్ (36) కరెంట్షాక్కు గురయ్యాడంటూ సుస్మిత ఈనెల 13 వ తేదీని ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి స్థానికుల సాయంతో తీసుకెళ్లింది.అయితే అప్పటికే అతను మరణించాడని వైద్యులు తెలిపారు. దీంతో పోస్టుమార్టమ్ కూడా వద్దంటూ అంత్యక్రియల కోసం ఉత్తమ్ నగర్లోని ఇంటికి మృతదేహాన్ని తరలించింది. ఈలోపు… స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు , అంత్యక్రియలను అడ్డుకున్నారు.
మృతుడి వయసు , చనిపోయిన తీరుపైనా అనుమానాలతో అటాప్సీకోసం కరణ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈలోపు కరణ్ సోదరుడు కునాల్ పోలీసులకు ఓ షాకింగ్ విషయం తెలిపాడు. తన అన్న మరణం విషయంలో వదినతో పాటు తన కజిన్ రాహుల్ ప్రమేయం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం చేశాడు. అంతేకాదు.. వాళ్లిద్దరి మధ్య జరిగిన ఇన్స్టాగ్రామ్ చాటింగ్ వివరాలను పోలీసులకు స్క్రీన్ షాట్వీడియో రూపంలో అందించాడు. అందులో కరణ్ను ఎలా హత్య చేయాలని వాళ్లిద్దరూ చర్చించుకున్నారు. పోలీసులు తమ శైలిలో ప్రశ్నించగా, ఆ ఇద్దరూ నిజం ఒప్పుకున్నారు. కరణ్ తరచూ హింసించేవాడని, అదే సమయంలో రాహుల్ తనను ఓదార్చేవాడని, అదే ఇద్దరి మధ్య అనైతిక బంధానికి దారి తీసినట్టు తేలింది. ఈ క్రమంలో కరణ్ అడ్డు తొలగించుకొనేందుకు సుస్మిత రాహుల్ నిర్ణయించుకున్నారు. జులై 13 వ తేదీ రాత్రి భోజనంలో కరణ్కు అధిక మోతాదులో 15 నిద్రమాత్రలు ఇచ్చారు.
ఆపై మత్తులోకి జారుకున్నాక ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్ సారాంశం…
సుస్మిత : నిద్రమాత్రలు అన్నేసి వేసుకున్నాక చనిపోవడానికి ఎంత టైం పడుతుందో ఒకసారి నెట్లో చూడు. మూడు గంటలైంది తిని. వాంతి చేసుకోవడం లాంటి లక్షణాలేవీ కనిపించడం లేదు. ఇంకా చనిపోలేదు. ఏం చేయాలో త్వరగా చెప్పు.
రాహుల్ : అలాంటిదేం జరగకపోతే .. కరెంట్షాక్ పెట్టు.
సుస్మిత : షాక్ ఇవ్వడానికి కట్టేయాలి కదా.. ఎలా ?
రాహుల్ : టేప్తో కట్టేయ్
సుస్మిత : నాభర్త ఊపిరి ఆగిపోలేదు. ఇంకా బతికే ఉన్నాడు. నెమ్మదిగా శ్వాస పీలుస్తున్నాడు.
రాహుల్ : నీ దగ్గర ఉన్న అన్ని మాత్రలు వేసేయ్
సుస్మిత : నోరు తెరవడానికి రావట్లేదు. నీళ్లు మాత్రమే తాగిపించడానికి వీలవుతోంది. నువ్వు రా.. ఇద్దరం కలిసి ఆ మందులేద్దాం. నాకు నిద్రముంచుకొస్తోంది.
ఆ చాటింగ్ తర్వాత రాహుల్ ఇంటికి రాగా, ఇద్దరూ కలిసి కరెంట్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. విచారణలో మరిది రాహుల్తో కలిసి భర్తను చంపినట్టు సుస్మిత ఒప్పుకుంది. తన భర్త డబ్బుల కోసం తరచూ తనను హింసించేవాడని, కార్వాచౌత్ ముందు రోజు కూడా చితకబాదాడని ఆమె చెబుతోంది. నిందితులిద్దరినీ అదుపు లోకి తీసుకున్న పోలీసులు పూర్తిస్థాయి పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు.