Sunday, July 20, 2025

వచ్చే ఏడాది నాటికి కోచ్ ఫ్యాక్టరీ రెడీ

- Advertisement -
- Advertisement -

కాజీపేట రైల్వే యూనిట్‌లో
కోచ్‌లు, ఇంజన్లతోపాటు మెట్రో రైళ్ల
తయారీ 3వేల మందికి ప్రత్యక్షంగా,
పరోక్షంగా ఉపాధి కోచ్ ఫ్యాక్టరీ
కలను సాకారం చేసిన ఘనత
ప్రధాని మోడీదే కాజీపేట రైల్వే
యూనిట్‌ను సందర్శించిన అనంతరం
కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

మన తెలంగాణ/వరంగల్ ప్రత్యేక ప్రతినిధి : వరంగల్ జిల్లా, కాజీపేట రైల్వే యూనిట్‌లో 2026 నాటికి ఉ త్పత్తి ప్రారంభమవుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కాజీపేటలో కొత్తగా నిర్మాణమవుతున్న రైల్వే ఉత్పత్తి యూనిట్ పనులను మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి శనివారం పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇక్కడ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం జరుగుతోందని అన్నారు. కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒక మెగా ఫ్యాక్టరీగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఇక్కడ రైల్వే కోచ్‌లు, ఇంజన్లతో పాటు మెట్రో రైళ్ల తయారీ, డిజైన్ పనులు కూడా జరుగుతాయని అన్నారు. బహుళ రకాల రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ కార్యకలాపాలు కొనసాగుతాయని అన్నారు. రైల్వే కోచ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అనేక ఏళ్లుగా ప్రజల కలగా ఉందన్నారు. ఆ కలను సాకారం చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీదేనని అన్నారు. రూ.500 కోట్లతో ఈ పరిశ్రమ ఏర్పాటు జరుగుతోందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పురోగతిపై చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు.

కళ్లు తెరిచి చూడండి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సుమారు 40 ఏళ్లుగా వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్ ఉందని అన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు హయాంలో కూడా ఈ కోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నాలు జరిగాయని గుర్తుచేశారు. నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత కాజీపేటలో రైల్వే ఇంజన్లు, కోచ్‌లు, వ్యాగన్లు తయారీకి పరిశ్రమ మంజూరు చేశారని తెలిపారు. ప్రధాని మోడీ స్వయంగా ఇక్కడికి వచ్చి భూమిపూజ చేశారని పేర్కొన్నారు. ఈ యూనిట్ ద్వారా సుమారు 3 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తాయని చెప్పారు. తెలంగాణలో మొత్తం 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతోందని, వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కూడా అందులో భాగమేనని స్పష్టం చేశారు. వరంగల్‌లో రింగ్‌రోడ్‌లో 50 శాతం పనులను కేంద్ర ప్రభుత్వం పూర్తిచేసిందని, టెక్స్‌టైల్ ఇండస్ట్రీని మంజూరు చేసిందని గుర్తుచేశారు. వెయ్యిస్తంభాల గుడిలో కల్యాణ మంటపాన్ని పునరుద్ధరించామని తెలిపారు.

వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ అవసరం ఎంతో ఉందని, బిఆర్‌ఎస్ పాలనలో ముఖ్యమంత్రి కెసిఆర్ కు తాను అనేకసార్లు లిఖితపూర్వకంగా విన్నవించానని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే విషయంపై విన్నవించానని, రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని సేకరించి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి అప్పగిస్తే, వరంగల్ ప్రజలకు విమాన రాకపోకల సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రధాని తెలంగాణకు ఏం ఇచ్చారు? బిజెపి ఏం తెచ్చింది? అని కొందరు ప్రశ్నిస్తున్నారని, అలాంటివారు తమ కళ్లు తెరిచి చూడాలని, చెవులుంటే వినాలని, మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా చూడాలని హితవు పలికారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా కాజీపేటకు వచ్చి రైల్వే మ్యానుఫాక్చరింగ్ పనులను పర్యవేక్షించడం, ఆయన రైల్వేల అభివృద్ధిపై చూపుతున్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. వందేభారత్ రైళ్లు, రైల్వేస్టేషన్ల అభివృద్ధి, రైల్వేల విస్తరణ, వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో అశ్వినీ వైష్ణవ్ తెలంగాణ రైల్వేల ముఖచిత్రాన్ని మారుస్తున్నారని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News