పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం(జూలై 21) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి ఆగస్ట్ 21 వరకు నెల రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. అయితే, ఆగస్టు12 నుంచి 18 వరకు సమావేశాలకు సెలవులు ఉంటాయి. ఈ సమావేశాల్లో మొత్తం 7 పెండింగ్ బిల్లులతో పాటు మరో 8 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.
ఇక, దేశ భద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి వాటిపై చర్చించాలని ఇండియా కూటమి పట్టుపట్టే అవకాశం ఉంది. తానే యుద్ధం ఆపించానని ట్రంప్ పదేపదే చెప్పడం, దేశ ఆంతరంగిక విషయాలలో ప్రమేయం అయిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలపై మోడీ పార్లమెంట్లో ప్రకటన చేయాలని, ఇంతకు అమెరికా పట్ల ఎటువంటి వైఖరి ఉందనేది తెలియచేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు వాడీ వేడీగా జరగనున్నాయి. అయితే, ఆపరేషన్ సింధూర్పై చర్చించేందుకు సిద్ధమేనని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది.