Thursday, July 24, 2025

బిసిలకు మొండి’చెయ్యి’

- Advertisement -
- Advertisement -

42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ది మొదటి నుంచి మోసపూరిత వైఖరే
ఆమోదం పొందదని తెలిసి ఆర్డినెన్స్ డ్రామా
బిసి డిక్లరేషన్‌లోని ఒక్క హామీని నెరవేర్చని రేవంత్ సర్కార్
బిఆర్‌ఎస్ బిసి నేతల స్పష్టీకరణ
మనతెలంగాణ/హైదరాబాద్ : బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి మోసపూరిత వైఖరినే అనుసరిస్తుందని బిఆర్‌ఎస్ పార్టీ అభిప్రాయపడింది. కులగణన నుండి ప్రస్తుత ప్రభుత్వం తీసుకువస్తున్న ఆర్డినెన్స్ వరకు అన్ని స్థాయిల్లోనూ బిసిలను మోసం చేయడమే కాంగ్రెస్ అసలైన లక్ష్యంగా ఉందని విమర్శించింది. బోనాల పండుగ సందర్భంగా మంగళవారం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో అందుబాటులో ఉన్న బిసి ప్రజాప్రతినిధులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమావేశమయ్యారు. బిసిల పట్ల కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహపూరిత కార్యక్రమాలపైన కెసిఆర్ ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

కాంగ్రెస్ పార్టీ కేవలం బిసిలను మోసం చేయాలన్న దురుద్దేశంతోనే స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పన అంశంలో, ప్రతి సందర్భంలో చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించిందని బిసి నేతలు అభిప్రాయపడ్డారు. తాము తీసుకువచ్చిన చట్టం ఆమోదం పొందదు అని తెలిసినా, మరోసారి ఆర్డినెన్స్ పేరుతో కొత్త నాటకానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందని వారు పేర్కొన్నారు. కులగణన జిఒ నుండి గణన ప్రక్రియ వరకు బిసిల సంఖ్యను తగ్గించి చూపడంలో కాంగ్రెస్ దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. బిసి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా బిసిలకు తీవ్రమైన అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలన్న అంశంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించిందని విమర్శించారు. తాము చేపట్టిన ప్రతి ప్రక్రియలో ఉన్న లోపాలు లొసుగులు ముందే తెలిసినా, బిసిలను మోసం చేయాలన్న దురాలోచనతో ఇప్పుడు కోర్టుల పేరుతో, చట్టపరమైన నిబంధనలు చూపిస్తూ తప్పించుకోవడానికి కాంగ్రెస్ రంగం సిద్ధం చేస్తున్నదని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కులగణన మరింత శాస్త్రీయంగా జరగాలని చెప్పే కాంగ్రెస్ పార్టీ అత్యంత లోప బూయిష్టంగా నిర్వహించిన కుల గణన సర్వేను జాతీయ రోల్ మోడల్‌గా చెప్పడం ద్వారా తెలంగాణ ప్రజలను మోసం చేయడమే కాకుండా, జాతీయ వేదికలపై అబద్ధాలు చెబుతున్నదని నేతలు మండిపడ్డారు. ఒకవైపు 42 శాతం రిజర్వేషన్ల అంశంలో బిసిలను మోసం చేస్తూనే బిసి డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ కూడా కాంగ్రెస్ అమలు చేయకుండా బిసిలను మభ్యపెడుతుందని బిసి నేతలు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల కోసం ప్రారంభించిన పథకాలను రద్దు చేసి కొత్త పథకాలు ప్రారంభించకపోవడం ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ వారికి చేస్తున్న ద్రోహమే అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News